Monday, December 29, 2014

దండగమారి 31

డిసెంబర్ 31.. క్యాలండర్లో చివరి తేదీ.. అలాగే జనవరి 1 క్యాలండర్లో మొదటి తేదీ మాత్రమే.. ఈ రెండు తేదీలకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరమే లేదు.. మీ జీవితాల్లో కొత్తగా వచ్చే మార్పేమీ ఉండదు.. పోయేదీ ఏమీ లేదు.. గోడకు కొత్త క్యాలండర్ తగిలించుకోండి.. డైరీ రాసే అలవాటు ఉంటే కొనుక్కోండి.. లేదంటే ఎవరైనా గిఫ్ట్ ఇస్తే తీసుకోండి..
చాలా మందికి డిసెంబర్ 31 తేదీని తలచుకోగానే ఎక్కడలేని పూనకం వచ్చేస్తోంది.. తాగాలి, తినాలి, చిందులేయాలి, రోడ్లపై హ్యాపీ న్యూ ఇయర్ అంటూ వెర్రి కేకలు వేస్తూ ర్యాష్ డ్రైవింగ్ చేయాలి.. ఇదీ వారి సైకాలజీ.. ఇదెక్కడి సంస్కృతి? ఇందు వల్ల వారికి కాని, సమాజానికి గానీ ఏమైనా మేలు జరుగుతోందా? ఆలోచించండి.. ఎందుకీ పనికి మాలిన వేడుకలు.. ఈ వేడుకలు జరుపుకోవడం వల్ల లాభ పడేది మద్యం అమ్మకాల వల్ల వైన్ షాపులు, బార్ల ఓనర్లు.. ప్రభుత్వానికి ఖజానా నిండుతుంది.. క్లబ్బులు, హోటళ్లకు, బేకరీ షాపుల వాలకు ఆదాయం.. చమురు వదిలేది మాత్రం మీకే.. ఒళ్లు గుళ్లయ్యేదీ మీకే.. ఉత్సాహం శృతి మించితే విషాదం కూడా..
జనవరి 1న న్యూ ఇయర్ జరుపుకోవడం తప్పా, ఒప్పా అని నేను చర్చించదలచుకోలేదు.. కానీ అర్థం లేని వేడుకల కోసం కాలాన్ని, డబ్బును వృధా ఎందుకు చేసుకోవడం?.. అంతగా ఉత్సహంగా ఉంటే అందరికీ శుభం కలగాలని మీ ఇష్ట దైవాన్ని మొక్కుకోండి.. పనికి మాలిన సంబరాల కోసం పెట్టే ఖర్చును సామాజిక సేవా కార్యక్రమాల కోసం ఉపయోగించండి.. ఇందు వల్ల కాస్త పుణ్యం, పురుషార్థం ఉంటుంది.. 

Thursday, December 25, 2014

మదన్ మోహన్ మాలవీయ – MMM..

 ఆయన చేపట్టిన మహా యజ్ఞానికి నిజాం నవాబు కూడా విరాళం ఇవ్వక తప్పలేదు.. That is MMM మనీ మేకింగ్ మిషన్..
మదన్ మోహన్ మాలవీయ పేద కుటుంబంలో పుట్టి అతికష్టం మీద చదువుకోగలిగారు.. వేదాధ్యనం చేశారు.. ఉపాధ్యాయ వృత్తి చేపట్టి న్యాయవాద విద్య పూర్తి చేసుకొని లాయర్ అయ్యారు.. జాతీయ ఉద్యమంలో చేరి స్వాతంత్ర్య సంగ్రామంలో తనవంతు పాత్ర పోషించారు.. కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షునిగా, గాంధీజీకి సన్నిహితునిగా పని చేశారు..
చిన్నప్పుడు చదువుకోడానికి తాను పడ్డ కష్టం మరెవరికీ రాకూడనుకున్నారు మదన్ మోహన్ మాలవీయ.. అందు కోసం ఏకంగా విశ్వ విద్యాలయం స్థాపించడానికి నిర్ణయించుకున్నారు.. దానికి బెనారస్ హిందూ యూనివర్సిటీ అనే పేరు పెట్టారు.. ఇందు కోసం అవసరమయ్యే నిధుల కోసం కాలికి బలపం కట్టుకొని దేశమంతా తిరిగారు.. మాలవీయ వ్యక్తిత్వం తెలిసిన సంస్థానాధీశులు, ప్రముఖులు, నాయకులు, ధనవంతులు భూరి విరాళాలు ఇచ్చి ప్రోత్సహించారు.. మాలవీయ ఎక్కడికి వెళ్లినా ఉత్త చేతులతో తిరిగి రారని పేరుండేది.. అందుకే ఆయనను మనీ మేకింగ్ మిషన్ అని సరదాగా పిలిచేవారు..
ఈ క్రమంలో మదన్ మోహన్ మాలవీయ హైదరాబాద్ వచ్చారు.. సంస్థానాధీశుడు నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ ను కలసి తాను ఎందుకు వచ్చానో వివరించాడు.. ముస్లింనైన నేను హిందూ యూనివర్సిటీకి విరాళం ఇవ్వడం ఏమిటి.. ప్రసక్తే లేదు అని నిరాకరించాడు నవాబు.. కానీ మాలవీయ ఉత్తి చేతులతో పోయే కాదు కదా.. నిజాం ప్యాలస్ నుండి బయటకు వచ్చారు.. నగర వీధుల్లో తిరుగుతుండగా ఓ శవయాత్ర కనిపించింది.. ఊరేగింపులో శవంపై చిల్లర నాణేలు చల్లుతున్నారు.. పరుగున వెళ్లి ఏరుకోవడం మొదలు పెట్టారు.. దారిన పోయేవారు మాలవీయ చేస్తున్న పని చూసి ఆశ్చర్యపోయారు.. సమాచారం నిజాం నవాబుకు చేరింది.. మదన్ మోహన్ మాలవీయను పిలిచి ఏమిటి మీరు చేస్తున్న పని అని నిలదీశాడు.. తాను చేపట్టిన సంకల్పం నెరవేర్చుకునేందుకు ఉత్తి చేతులతో హైదరాబాద్ వదిలి వెళ్లే ప్రసక్తి లేదని స్పష్టం చేశారాయన.. తన తప్పును గుర్తించిన మీర్ ఉస్మాన్ అలీఖాన్ సముచిత రీతిలో విరాళం అందించారు.. విజయగర్వంతో హైదరాబాద్ నుండి బయలు దేరారు మాలవీయ..

ఈ కథ రకరకాలుగా ప్రచారంలో ఉంది.. కానీ ఏది ఏమైనా మదన్ మోహన్ మాలవీయ సంకల్పానికి అద్దం పట్టే కథ ఇది.. That’s MMM.. మనీ మేకింగ్ మిషన్.. ఆయన చేసిన కృషి ఫలించింది బెనారాస్ యూనివర్సిటీ మనోన్నత విద్యాలయంగా ఆవిర్భవించింది..

భారత రత్నకు జన్మదిన శుభాకాంక్షలు

పార్లమెంట్లో ఓ కొత్త ప్రతిపక్ష సభ్యుడి వాక్పటిమను చూసి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ ముగ్దుడయ్యారు.. వివిధ అంశాలపై ఆయన అవగాహణను, అసాధారణ నైపుణ్యాన్ని చూసి ప్రశంసించలేకుండా ఉండలేకపోయారు.. ఈ యువకుడు ఏనాటికైనా ఈ దేశ ప్రధాని అవుతాడని నెహ్రూ ఊహించారు.. 1957 నాటి మాట ఇది.. ఆ కొత్త సభ్యుడు బలరాంపూర్ నియోజకవర్గం నుండి లోక్ సభకు ఎన్నికైన అటల్ బిహారీ వాజపేయి.. నెహ్రూ అంఛనా భవిష్యత్ లో నిజమైంది..
దేశంలో కాంగ్రెస్ పతనం తర్వాత కిచిడీ సంకీర్ణ ప్రభుత్వాల వైఫల్యం తర్వాత దేశ ప్రజలు బీజేపీని బొటాబొటీ మెజారిటీతో గెలిపించారు.. ఇలాంటి సమయంలో ప్రధానమంత్రి అయిన వాజపేయి భాగస్వామ్య పక్షాలను ఒప్పిస్తూ సంకీర్ణ ప్రభుత్వాన్ని విజయవంతంగా నడిపారు.. అటల్జీ ప్రధానిగా ఉన్న సమయంలో దేశ అభివృద్దికి కొత్త బాటలు పడ్డాయి.. స్వర్ణ చతుర్భుజి రహదారుల లాంటి మౌళిక సదుపాయాలను విస్తరించారు. సంస్కరణలను అమలు చేయడంలో విజయం సాధించారు.. దేశం ఆర్థికంగా బలోపేతమైంది..  పోక్రాన్ అణుపరీక్ష ద్వారా అగ్రరాజ్యాలకు సవాలు విసిరారు. భారత దేశ శాస్త్ర సాంకేతిక సత్తాను ప్రపంచానికి చాటారు.. కయ్యానికి కాలు దువ్విన పాకిస్తాన్ కు కార్గిల్ యుద్దంలో గట్టి బుద్ది చెప్పారు..
అటల్ బిహారీ వాజపేయి గొప్ప రాజనీతిజ్ఞుడు మాత్రమే కాదు.. ఆయన గొప్ప కవి, వక్త కూడా.. హిందీలో అటల్జీ రాసిన కవిత్వం, వ్యాసాలు పండితుల ప్రశంసలందుకున్నాయి.. ఆయన అనర్ఘళ  ప్రసంగాలకు జనం మంత్ర ముగ్దులైపోయేవారు.. అసమాన ప్రతిభావంతుడైన వాజపేయి ప్రసంగాన్ని ఆలకించేందుకు పార్లమెంట్లో అన్నిపక్షాల సభ్యులు ఆసక్తిని చూపించేవారు.. ఆజన్మ బ్రహ్మచారిగా దేశ సేవకు అంకితమైన అటల్జీ వ్యక్తిత్వం పార్టీలకు అతీతంగా అందరినీ మిత్రులుగా మార్చింది..  

సుపరిపాలన అంటే ఏమిటో ఆచరణలో చూపించారు అటల్ బిహారీ వాజపేయి.. అందుకే అటల్జీ జన్మదినాన్ని సుపరిపాలన దినోత్సవంగా ప్రకటించారు ప్రధాని నరేంద్ర మోదీ.. వాజపేయి దేశానికి చేసిన సేవలకు గుర్తింపుగా భారతరత్న అవార్డును ప్రకటించారు.. వాజపేయిని అలంకరిచడంతో భారత రత్నానికి విలువ పెరిగింది.. అటల్జీకి సంపూర్ణ ఆయురారోగ్యాలు కలగాలని కోరుకుందాం..

క్రైస్తవ మిత్రులు, వారి కుటుంబ సభ్యులందరికీ..


Wednesday, December 24, 2014

విలువ పెరిగిన భారత రత్న..

భారత రత్న అవార్డుకు ఈసారి నిజంగా విలువ పెరిగింది.. రెండు మహోన్నత శిఖరాలకు ఈ రత్నాలను అలంకరిస్తున్నారు.. ఒక మహోన్నత స్వాతంత్ర్య సమరయోధుడికి, మరో మహా రాజనీతిజ్ఞునికి భారత రత్న అవార్డులను ప్రధానం చేయాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయించడం ఎంతో ఆనందించదగిన విషయం..
భారత స్వాతంత్ర్య సమయపోరాటంలో కీలక పాత్ర పోషించిన పండిత మదన్ మోహన్ మాలవీయ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షునిగా పని చేశారు.. బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం స్థాపించారు. విద్యావేత్తగా, సంఘ సంస్కర్తగా పేరు తెచ్చుకున్నారు.. సాంప్రదాయ హిందూ కుటుంబంలో పుట్టిన మావవీయ చిన్నప్పుడే వేదాంతం అభ్యసించారు.. సమాజంలో కుల, మత బేధాలకు వ్యతిరేకంగా పని చేశారు.. మహాత్మా గాంధీతో కలిసి లండన్ రౌండ్ టేబుల్ సమావేశానికి వెళ్లడంతో పాటు క్విట్ ఇండియా ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. రెండు దిన పత్రికలను కూడా స్థాపించారు. సరిగ్గా స్వాతంత్ర్యానికి ఒక సంవత్సరం ముందే కన్ను మూశారు..
అటల్ బిహారీ వాజపేయి మహోన్నత జాతీయ వాది.. దేశం కోసం జీవితాన్నే అంకితం చేసిన మహానీయుడు.. ఆర్ఎస్ఎస్ ద్వారా సమాజ సేవను ప్రారంభించిన అటల్జీ, జనసంఘ్, బీజేపీలకు నాయకత్వం వహించారు.. ఎమర్జెన్సీ కాలంలో జైలుపాలయ్యారు.. జనతా ప్రభుత్వంలో విదేశాంగ మంత్రిగా పని చేశారు.. దేశంలో సంకీర్ణ ప్రభుత్వాల పాలన ప్రారంభం అయ్యాక తొలి కాంగ్రెసేతర ప్రభుత్వానికి నాయకత్వం వహించి పరి పాలనలో తన సత్తా చాటారు.. సమర్థ నాయకత్వంతో సుస్థిర ప్రభుత్వాన్ని ఆచరణలో చూపించడమే కాకుండా, సంస్కరణ వేగం పెంచి దేశాన్ని ఆర్ధికంగా బలోపేతం చేశారు.. స్వర్ణ చతుర్జుజి లాంటి పథకాలతో మౌళిక సదుపాయాలను మెరుగు పరిచారు. పార్టీలకు అతీతంగా దేశ ప్రజలందరి మన్నలు అందుకుంటున్నారు వాజపేయి.. అటల్జీ మంచి నాయకుడు మాత్రమే కాదు వక్త, కవి, రచయితగా కూడా ప్రసిద్దులు.. ఆయన జన్మదినాన్ని నరేంద్ర మోదీ ప్రభుత్వం సుపరిపానా దినోత్సవంగా ప్రకటిచడం దేశ ప్రజలందరికీ గర్వకారణం..

మదన్ మోహన్ మాలవీయజీ, అటల్ బిహారీ వాజపేయిజీ.. ఇద్దరి జన్మదినోత్సవాలు డిసెంబర్ 25వ తేదీనే.. ఇరువురినీ భారత రత్న అవార్డులు వరించడం అదృష్టం..


మరోసారి మోదీ శక్తి..

కాంగ్రెస్ ముక్త్ భారత్.. బీజేపీ ఇచ్చిన నినాదం వాస్తవ రూపంలో కొనసాగుతోంది.. దేశమంతటా వరుసగా కాంగ్రెస్ కోటలు కూలుతున్నాయి.. తాజా ఝార్ఖండ్, జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ భాగస్వామిగా ఉన్న సంకీర్ణ ప్రభుత్వాలు పడిపోవడమేకాదు.. ఆ పార్టీ ప్రాంతీయ పార్టీలన్నా చిన్నదైపోయింది..
ఎన్నికల ఫలితాలు వస్తున్న సమయంలో ఓ మిత్రుడు ఇక బీజేపీ పని అయిపోయిందని సంబరపడ్డాడు.. ఆయన ఉద్దేశ్యం ఝార్ఖండ్లో బీజేపీకి ఎగ్జిట్ ఫోల్స్ చెప్పినట్లు సీట్లు రాలేదని. జమ్మూకశ్మీర్లో మిషన్44+ సక్సెస్ కాలేదని.. ఝర్ఖండ్లో ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన స్పష్టమైన మెజారిటీ బీజేపీకి ఉంది.. తొలిసారి హంగేతర ప్రభుత్వం అక్కడ ఏర్పటవుతోంది..
ఇక జమ్మూ కశ్మీర్ విషయానికి వస్తే అక్కడ బీజేపీ సాధించిన విజయం చిన్నదేం కాదు.. పీడీపీ 28 స్థానాలు పొందితే, బీజేపీ 25 సీట్లు సాధించింది.. మరో ముఖ్య విషయం ఏమిటంటే ఓట్ల శాతంలో బీజేపీదే పైచేయి.. బీజేపీకి 23 శాతం వస్తే, పీడీపీకి 22.7 శాతం ఓట్లు దక్కాయి.. కశ్మీర్ లోయ, లద్దాక్ లలో బీజేపీకి సీట్లు రాకపోవచ్చు కానీ రాష్ట్రంలో కీలక శక్తిగా బీజేపీ ఆవిర్భవించడం వేర్పాటు వాదులకు గడ్డు పరిస్థిస్తే.. వాస్తవానికి ఫలితాలను ఇంతకు మించి ఊహించడం కాస్త అత్యాశే అవుతుంది.. జమ్మూ, కశ్మీర్ లోయ జనాభా నిశ్పత్తి ప్రకారం చూస్తే కశ్మీర్లో అసెంబ్లీ సీట్లు కాస్త ఎక్కువున్నాయి.. కాబట్టి సహజంగా అక్కడ విజయం సాధించే వారిదే పైచేయి అవుతుంది..

జమ్మూ కశ్మీర్లో బీజేపీ మిషన్ 44+ ఒక సంకల్పం.. అది పూర్తిగా సాధ్యం కాకున్నా, రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేనంత ప్రశాంతంగా ఓటింగ్ జరగడం, పోలింగ్ శాతం పెరగడం ప్రజాస్వామ్య విజయం.. అక్కడ ఎవరు ఓడినా, గెలిచినా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు, గ్రాంట్లతోనే ప్రభుత్వం నడవాల్సిందే.. అక్కడి ప్రజలు క్రమంగా వేర్పాటు వాదులను దూరం పెడుతూ క్రమంగా యావద్దేశంతో మమేకం అవుతున్నారు.. కశ్మీర్లో వరదలు వచ్చినప్పుడు భారత ప్రభుత్వ అవసరం వారికి తెలిసివచ్చింది..

Tuesday, December 23, 2014

నాకు తెలియకుండానే అభిమాన దర్శకుడు..

నేను సినిమాలు అంతగా చూడను.. చూసే సినిమాలు కూడా కమల్ హాసన్, రజనీకాంత్ లవే ఎక్కవ.. ఈ ఇద్దరు మహా నటులను వెండి తెరకు అందించిన గొప్ప దర్శకుడు బాలచందర్.. నాకు ఎంతో ఇష్టమైన చిత్రాల్లో కూడా సింహ భాగం బాలచందర్ దర్శకత్వంలో వచ్చినవే.. ఆకలిరాజ్యం, మరోచరిత్ర, అంతులేని కథ, రుద్రవీణ చిత్రాలు తరచూ మెదులుతూనే ఉంటాయి.. బాలచందర్ తెలుగులో చాలా తక్కువ సినిమాలే తీసి ఉండవచ్చు.. ఆయన తమిళ దర్శకుడే కావచ్చు.. కానీ నాకు తెలియకుండానే నా అభిమాన దర్శకుల్లో ఒకరైపోయారు.. దర్శకునిగా, నిర్మాతగా, రచయితగా బహుముఖ రూపాల్లో ప్రేక్షక లోకానికి దర్శనం ఇచ్చిన బాలచందర్ మనకు దూరం కావడం బాధాకరంగానే ఉంది.. వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్ధిస్తున్నాను..

Saturday, December 20, 2014

గీతా ప్రెస్ భవిష్యత్ ఏమిటి?

తెలుగులో మంచి భగవద్గీత గ్రంధం కావాలని పొరుగు రాష్ట్రంలో ఉన్న ఓ మిత్రుడు కోరాడు.. అది కొందామని సుల్తాన్ బజార్(హైదరాబాద్)లోని గీతాప్రెస్ పుస్తకాలయానికి వెళ్లాను.. భగవద్గీత తెలుగులోనే రూ.2, 5 మొదలుకొని రకరకాల ధరలు, సైజులు, వ్యాఖ్యానాలతో దొరుకుతాయక్కడ.. ఆశ్చర్యంగా నేను కోరుకున్న ప్రతులు లేవక్కడ.. ఇదేమిటని అడిగితే స్టాక్ లేదు అన్నారు అక్కడి సిబ్బంది.. ఎప్పుడొస్తాయి అని అడిగితే చెప్పలేం అన్నారు కాస్త విచారంగా.. ఈ సమాధానానికి కాస్త ఆశ్చర్య పోయాను.. నగరంలో జరుగుతున్న బుక్ ఫెయిర్ వెళ్లితే అక్కడో మిత్రుడు చెప్పిన వార్త షాక్ కలిగించింది.. వర్కర్ల సమ్మె కారణంగా గీతా ప్రెస్ తాత్కాలికంగా మూసేశారట..
భారత దేశంలోని పురాతన ఆధ్యాత్మిక గ్రంథాల ప్రచురణ సంస్థ గీతా ప్రెస్.. 1923లో గోరఖ్ పూర్ కేంద్రంగా స్థాపించారీ సంస్థను.. లాభాపేక్ష లేకుండా చాలా చవక ధరకు, నాణ్యమైన ఆధ్యాత్మిక, నైతిక సాహిత్యాన్ని ప్రజలకు అందిస్తున్న సంస్థ ఇది.. హిందీ, సంస్కృతం, ఇంగ్లీషు, తెలుగు, కన్నడ, బెంగాలి, ఒరియా, తమిళ, గుజరాతీ, మరాఠీ భాషల్లో భగవద్గీత, సనాతన ధర్మం, పురాణాలు, ఉపనిషత్ లతో పాటు గృహస్త్య, నైతిక అంశాలకు సంబంధించిన పుస్తకాలను ప్రచురిస్తుంది గీతా ప్రెస్..

కార్మికులు తమ వేతనాలు, ఇతర డిమాండ్ల కోసం సమ్మె చేపట్టడంతో విధిలేని పరిస్థితుల్లో గీతా ప్రెస్ యాజమాన్యం లాకౌట్ ప్రకటించిందట.. లాభాపేక్ష లేకుండా సేవా భావంతో నడుస్తున్న సంస్థను కార్మిక సంఘాలు ఎలా వీధికీడ్చాయో చూడండి.. దీని వల్ల ఎవరికి లాభం? కార్మికులు పస్తులుండాల్సిందే కదా.. పైగా ఉత్తమ ఆధ్మాత్మిక, నైతిక సాహిత్యాన్ని ప్రజలకు దూరం చేసిన అపకీర్తి ఎవరికి?.. త్వరలో గీతాప్రెస్ తిరిగి ప్రారంభం కావాలని కోరుకుందాం..

వందేళ్ల క్రితమే గాడ్గేబాబా స్పచ్ఛ అభియాన్..

స్వచ్ఛ్ భారత్ అభియాన్.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పుణ్యమా అని దేశమంతా మార్మోగుతోంది.. నాయకులు, సెలబ్రటీలు చీపుర్లు పట్టి వీధులూడుస్తూ ఫోజులిచ్చేస్తున్నారు.. ఒక మంచి ఉద్దేశ్యంతో చేపట్టిన కార్యక్రమం ఇలా పబ్లిసిటీ జిమ్మిక్కులకే పరిమితం అవుతోందా అనే బాధ మనసులో కలుగుతోంది.. ప్రధాని మోదీ ఎంతో ప్రాధాన్యత ఇస్తున్న ఈ ఉద్యమం ఎంత వరకూ ఫలిస్తుంది అనే చర్చను పక్కన పెట్టి వందేళ్ల క్రితం స్వచ్ఛతా ఉద్యమాన్ని జనం ముందుకు తెచ్చిన మహనీయున్ని గుర్తు తెచ్చుకుందాం..
మహారాష్ట్రలోని అమరావతి జిల్లా షేన్ గావ్ లో జన్మించారు గాడ్గేబాబా.. బాబా అసలు పేరు దేవూజీ.. 30వ ఏటా భార్యా పిల్లలు అనే బంధాన్ని తెంచుకున్న బాబా, జీవితాంతం సన్యాసిగా జీవించి ఈ పదానికి నిజమైన అర్థాన్ని ఆచరణలో చూపించారు.. మూఢ నమ్మకాలు మానేయమని, కులం పేరుతో సాటి మనిషిని కించపరచొద్దని మనుషులంతా ఒకటే అని ప్రబోధించేవారు బాబా.. ఆలయాల్లో పాటలు, కీర్తనల పాడుతూ అందరినీ ఆకట్టుకునేలా ఆధ్యాత్మిక, నైతిక, ఆచరనీయమైన విషయాలను బోధించేవారు..
గాడ్గేబాబా చేపట్టిన అతిపెద్ద ఉద్యమ  స్వచ్ఛతా అభియాన్.. రంగుల గుడ్డ పేలికల బట్టలతో కనిపించే బాబా తలపై మట్టి చిప్ప కనిపించేది.. చేతిలో చీపురు పట్టుకొని కనిపించేవారు.. గాడ్గేబాబా ఏ ఊరికి వెళ్లినా అక్కడి వీధులు, ఆలయాలను శభ్రంగా ఊడ్చేవారు.. పొలం పనులు, మట్టిపని, కుమ్మరిపని చేసి పొట్ట నింపుకునేవారు బాబా.. ఎవరినీ చేయిచాచి అడగలేదు.. దేవాలయాల చెంతో, ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ పడుకునేవారు.. చివరకు రోడ్డు మీదే దేహం చాలించారు.
ఇంత నిరాడంబరంగా జీవించిన గాడ్గేబాబా ఒక వ్యక్తి సమాజానికి పనికి వచ్చే పనులు ఎలా చేయవచ్చే చేసి చూపించారు.. అనాధాశ్రమాలు, పాఠశాలలు, బాలల వసతి గృహాలు, ధర్మశాలలు ప్రజల సహకారంతో నిర్మించారు.. నేటి తరం వారికి తెలియని విషయం ఏమిటంటే మహాత్మాగాంధీ, బాబా సాహెబ్ అంబేద్కర్ లాంటి ప్రముఖులకు గాడ్గేబాబా స్పూర్తినిచ్చారు. బాబాను అంబేద్కర్ తన గురువుగా చెప్పుకునేవారు..

గాడ్గేబాబా జన్మించింది ఫిబ్రవరి 23, 1876న.. పరమపదించిన తేదీ డిసెంబర్ 20, 1956, అంటే సరిగ్గా ఇదే రోజు.. స్వచ్ఛ్ భారత్, కుల రహిత సమాజం కోసం వందేళ్ల క్రితమే ఉద్యమించారు బాబా.. వీటిని విజయవంతం చేసి ఆచరణలో చూపించడమే మనం ఆయనకు ఇచ్చే నిజమైన నివాళి..

Friday, December 19, 2014

గాంధీ బీర్..

మద్య పానాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు మహాత్మా గాంధీ.. అలాంటి మహాత్మున్ని అవమాన పరిచేలా అమెరికాలోని ఒక కంపెనీ ఏకంగా గాంధీజీ పేరిట బీర్ టిన్, బాటిళ్ళను విడుదల  చేసింది. పైగా మహాత్మా గాంధీని వ్యంగ్య చిత్రాన్ని టిన్ మీద ముద్రించింది.. 
కనెక్టికట్ స్టేట్ ఉడ్ బ్రిడ్జ్ నగరంలోని   న్యూ ఇంగ్లాండ్ బెవరేజేస్ అనే కంపెనీ చేసిన ఈ దుశ్చర్యను ప్రవాస భారతీయులు తీవ్రంగా ఖండిస్తూ న్యాయ పోరాటానికి దిగారు.. 

Thursday, December 18, 2014

బుద్దిరాని పాక్..

కుక్క తోక వంకరే కదా మరి.. తాలిబాన్ ఉగ్రవాదులు చిన్నారులను   పొట్టన పెట్టుకున్నా పాకిస్తాన్ పాలనా యంత్రాంగానికి బుద్ధి రాలేదు.. కరడుగట్టిన ఉగ్రవాది జాకీ ఉర్ రెహ్మాన్ లక్వీకి పాకిస్తాన్ ఉగ్రవాద వ్యతిరేక న్యాయస్థానం నిర్లజ్జగా బెయిల్ ఇచ్చేసింది.. 164 మందిని బలి తీసుకున్న ముంబై 26/11 మారణకాండకు స్కెచ్ గీసింది ఈ లక్వీ రక్కసుడే.. 

Wednesday, December 17, 2014

పెషావర్లో దారుణం..

మాటలకందని రాక్షసకాండ ఇది.. విష సర్పాన్ని పెంచి ముద్దాడితే ఏమవుతుంది?.. ఊహించిందే జరిగింది.. భారత దేశంపై విషయం కక్కుతూ ఆవిర్భవించిన పాకిస్తాన్ చివరకు తాను తీసిన గోతిలో తానే పడుతోంది..
పెషావర్ నగరంలో సైనిక పాఠశాలపై తాలిబాన్లు దాడి చేసి 130కి పైగా విద్యార్థులను పొట్టన పెట్టుకోవడం ప్రపంచాన్నే నివ్వెరపరచింది.. పాకిస్తాన్ ప్రభుత్వం, సైన్యంపై ఉన్న కోపాన్ని పసి పిల్లలపై చూపించారు తాలిబాన్లు.. ఈ తాలిబాన్లు ఎక్కడివారో, ఎవరు పెంచి పోషించారో అందరికీ తెలుసు.. పాకిస్తాన్ తాను చేసిన పాపానికి తానే బలవుతోంది.. ఇప్పటికైనా ఆ దేశ పాలకులకు కనువిప్పు కావాలి..

Saturday, December 13, 2014

పాశ్చాత్య మీడియా వక్ర దృష్టి..

దేవుడు వరమిచ్చినా పూజారి వరమివ్వలేదనే సామెత మనకు బాగా తెలిసిందే. దేవుడు మన పట్ల సానుభూతితో ఉన్న మధ్యలో ఉండే పూజారే మనపై శీతకన్నేశాడనే అర్థంలో దీన్ని వాడుతుంటారు. ఈ సామెత విషయాన్ని పక్కన పెడితే.. అమెరికాకు చెందిన ప్రఖ్యాత TIME (టైమ్) పత్రిక ప్రతి ఏటా ఎంపిక చేసే పర్సన్ ఆఫ్ ఇయర్ కోసం పాఠకుల అభిప్రాయాలను సేకరిస్తుంటుంది. ఈసారి జరిగిన ప్రజాభిప్రాయ సేకరణలో భారత ప్రధాని నరేంద్ర మోదీకి అత్యధిక పాఠకులు మద్దతు పలికారు. 16.2 శాతం ఓట్లతో ఆయన మొదటి స్థానంలో నిలిచారు. 50 లక్షల ఓట్లు వస్తే అందులో 37 శాతం అమెరికన్లవే. భారత్ నుండి 17 శాతం ఓట్లు వచ్చాయట.. కానీ విచిత్రంగా టైమ్ ఎడిటోరియల్ బోర్డు పాఠకుల అభిప్రాయాన్ని పక్కన పెట్టింది. 
అయోధ్య రామజన్మ భూమి ఉద్యమం భారత దేశ చరిత్రను మలుపు తిప్పింది.. ప్రపంచం దృష్టినీ ఆకర్షించింది. బ్రిటన్ కు చెందిన BBC 1990లో నిర్వహించిన పర్సన్ ఆఫ్ ద ఇయర్ సర్వేలో నాటి బీజేపీ సారధి లాల్ క్రిష్ణ అడ్వానీకి పాఠకులు అత్యధిక సంఖ్యలో ఓటేశారు. కానీ ఇరాక్ నియంత సద్దాం హుస్సేన్ ఎంపికయ్యాడు.. ఇందుకు BBC చూపిన సాకు కూడా విచిత్రంగా అనిపించింది. అడ్వానీకి మద్దతుగా వచ్చిన ఓట్ల తాలూకు పోస్టల్ కవర్లు ఒకే రంగులో ఉన్నాయట..
కొద్ది వారాల క్రితమే భారత దేశం మంగళ్ యాన్ విజయవంతం చేయడం తెలిసిందే.. అంగారక గ్రహంపై తొలి ప్రయత్నంలోనే విజయవంతంగా ఉపగ్రహాన్ని పంపి ప్రపంచ వ్యాప్త ప్రశంసలు అందుకున్నారు భారత శాస్త్రవేత్తలు.. పాపం ఇది THE NEW YARK TIMES పత్రిక వారికి నచ్చలేదు కాబోలు.. ఒక భారతీయ పశువుల కాపరి Elite Space Club డోరు తడుతున్న కార్టూన్ ప్రచురించింది.. అయితే భారతీయుల మనోభావాలు దెబ్బతిన్నాయని గ్రహించి ఆ తర్వాత క్షమాపణలు చెప్పుకుంది..

మనం మొదట చెప్పుకున్న TIME పత్రిక నరేంద్ర మోదీపై మొదటి నుండీ శీతకన్ను వేసినట్లే కనిపిస్తోంది.. గతంలో 2012 మోస్ట్ వాంటెడ్ అంటూ మోదీని చిత్రీకరించే ప్రయత్నం చేసింది.. ఆ తర్వాత కాలంలో ఆయన ఇండియా ప్రధాని కావడం ఖాయమని గ్రహించి, Modi meas business అనే కవర్ పేజీ స్టోరీని కాస్త అటూ ఇటూ అల్లి కవర్ చేసుకుంది.. ఈ ఉదాహరణలన్నీ అంతర్జాతీయ మీడియాకు భారత దేశం, బీజేపీలపై ఉన్న వక్రదృష్టికి అద్దం పడుతున్నాయి..

Wednesday, December 10, 2014

చార్మినార్ కడుతున్న ఫోటో అట.. హహహ్హ..

నిజం నిద్ర లేచేలోపు అబద్దం లోకం చుట్టి వస్తుందంటారు.. ఈ ఫోటో చూశాక అలాగే అనిపించింది.. చార్మినార్ నిర్మిస్తున్న దృశ్యం అంటూ సోషల్ మీడియాలో ప్రచారం పొందుతున్న ఫోటో ఇది.. నిజానికి చార్మినార్ 1591లో నిర్మాణమైంది.. అప్పటికి అసలు ఫోటోగ్రఫీయే పుట్టలేదు.. ఫోటోగ్రపీ ఒక రూపం సంతరించుకున్నది 1820 తర్వాతే.. చార్మినార్ నిర్మించే సమయంలో ఫోటో తీయడమే నిజమైతే పాపం కులీ కుతుబ్ షా ఎందుకు ఫోటో దిగలేదు? ఆలోచించారా?
వాస్తవం ఏమిటంటే 1940 నాటి ఫలక్ నూమా ప్యాలస్ ఏరియల్ వ్యూ ఫోటోను ఎవరో మహానుభావుడు మార్ఫింగ్ చేసి, చార్మినార్ నిర్మిస్తుట్లు మార్చేశాడు.. పాపం వాస్తవం బోధపడక చాలా మంది దీన్ని షేర్ చేసుకుంటున్నారు.. ముఖ్యంగా వాట్స్ఆప్ లో ఈ చిత్రం ఎక్కువగా షేర్ అవుతోంది.. ఇంతలా చర్చకు దారి తీసిన ఆ మార్ఫింగ్ వీరుడికి జోహార్లు..
ఇక్కడ పొందు పరిచిన మార్ఫింగ్ ఫోటో, అసలు ఫోటో జాగ్రత్తగా గమనించండి..

Sunday, December 7, 2014

కేజ్రీ.. ద బిజినెస్ క్లాస్ మాన్..

కేజ్రీవాల్ కో అచ్చే దిన్ గయా.. ఆమ్ ఆద్మీ ఖాస్ అద్మీ బన్ గయా..
ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బిజినెస్ క్లాస్ ప్రయాణం వివాదాస్పదమైంది. ప్రపంచ బ్రాండ్ సమ్మిట్ ఈ ఏడాది అత్యంత ప్రభావిత వ్యక్తిగా కేజ్రీవాల్‌ను ఎంపిక చేసింది. ఈ నేపథ్యంలో ఆయనను సన్మానించేందుకు బ్రాండ్ సమ్మిట్ సంస్థ ఆహ్వానించింది. ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు ఆయన దుబాయ్ వెళ్లారు. కేజ్రీవాల్ బిజినెస్ క్లాస్ సీటులో ఉన్న సమయంలో ఓ ప్రయాణీకుడు ఫోటో తీసి, వెంటనే దాన్ని ట్విట్టర్‌లో పెట్టాడు.
నిజానికి అరవింద్ కేజ్రీవాల్ బిజినెస్ క్లాస్లో ప్రయాణించడాన్ని తప్పు పట్టాల్సిన అవసరం లేదు.. అది ఆయన ఇష్టం.. కానీ రెండు నాల్కల ధోరనే ప్రశ్నార్ధకం.. కేజ్రీవాల్ జనంలో ఉన్నప్పుడు చేసే పనులకు, వ్యక్తిగత ఆచరణలో చూపేదానిలోనే ఉంది తేడా అంతా.. గతంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పెద్ద కార్లను ఉపయోగించలేదు. పెద్ద ప్రభుత్వ బంగళా తీసుకున్నా విమర్శలు రావడంతో వదులుకున్నారు.
ఓ వైపు పార్టీ విరాళాలు అంటూ తనతో భోజనానికి ప్లేట్ కు రూ.20 వేలు ఖరీదు కట్టే ఈ ఆమ్ ఆద్మీ ఇలా ఖరీదైన విమానయానం చేయడం ఏమిటి? టికెట్టు ధరను ఆయనను పిలిచిన వారే భరించి ఉండొచ్చు.. కానీ సాధారణ ప్రయాణం చేసి, మిగతా సొమ్మును తన పార్టీ విరాళానికి జమ చేయమని వారిని అడిగి ఉండాల్సింది..
ఈ తతంగాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు, కార్యకర్తలు సమర్ధించుకోవడం ఆశ్చర్యాన్ని కలిగించింది.. సాధారణ ప్రజలు కూడా బిజినెస్ క్లాస్ ప్రయాణం చేయవచ్చట.. కేజ్రీవాల్ దీన్ని నిరూపించారట.. ఇది వింటుంటే తాటి చెట్టు ఎందుకు ఎక్కావయ్యా అని ప్రశ్నిస్తే, దూడ గడ్డి కోసం అని సమాధానం చెప్పినట్లుగా లేదూ?

Saturday, December 6, 2014

గూడు లేని రామచంద్రుడు..

పాపం అయోధ్యలో రాం లాలా దుస్థితి చూడండి.. వివాదాస్పద కట్టడం నేల కూలి నేటికి 22 ఏళ్లు గడచిపోయింది.. మందిరమో, మసీదో అప్పటి దాకా ఉన్న గూడు కూడా పోయింది.. తన జన్మభూమిలో టెంటులో కాందీశీకునిగా మారిపోయాడు శ్రీరామ చంద్రుడు..
కోర్టు పరిధిలో ఉన్న అంశం అంటూ అక్కడ తాత్కాలికంగా అయినా నిర్మాణాలకు అనుమతించడం లేదు.. దశాబ్దాల తర్వాత ఫైజాబాద్ కోర్టు తీర్పు ఇచ్చినా, మళ్లీ అపీల్ కు పోయారు కక్షిదారులు.. ఇక ఇప్పట్లో ఈ కేసు తేలేనా అనిపిస్తోంది.. అయోధ్య కేసు విషయంలో ప్రధాని దివంగత పీవీ నరసింహారావు అనేవారు కొన్ని సమస్యలను కాలమే పరిష్కరించాలని.. ఆయన ఎందుకు అలా అన్నారో అప్పట్లో ఎవరికీ అర్థం కాలేదు.. కాలం గడుస్తున్న కొద్దీ ఉద్రిక్తతలు తగ్గి సమస్యను జనం మరచిపోతారు.. అప్పుడు ప్రశాంతంగా సమస్యను తేల్చేయొచ్చు..
అయోధ్య విషయంలో ఇప్పుడు ఎవరికీ పెద్దగా పట్టింపు లేదు.. గతంలో అక్కడ ఒక ఆలయం తాలూకు ఆనవాళ్లు ఉన్నాయని పురావస్తుశాఖ తవ్వకాల్లో బయటపడ్డ ఆధారాలను కోర్డు కూడా నిర్ధారించింది.. ఈ కేసు ప్రధాన కక్షిదారు కూడా మనసు మార్చుకొని ఆలయ నిర్మాణానికి అంగీకరిస్తున్నారు మరి సమస్యను సాగదీయండం ఎందుకు? భవ్య రామమందిరం నిర్మించడంలో ఆంతర్యం ఎందుకు?.. కొన్ని పార్టీలు సంస్థలు ఓటు బ్యాంకు రాజకీయాల కోసం అయోధ్య అంశాన్ని సాగదీస్తున్నాయి.. న్యాయస్థానాలు తర్వగా సమస్యను పరిష్కరించాలని భవ్య రామమందిరం మన జీవిత కాలంలోనే సాధ్యం కావాలని కోరుకుందాం.. జై శ్రీరాం..

Tuesday, December 2, 2014

గీతా రహస్యం

భగవద్గీత.. అంటే భగవంతుని గీతం. వేదాలు, ఉపనిషత్తుల్లో ఉన్న సారాంశాన్ని శ్రీకృష్ణుడు 18 అధ్యాయాల్లో భగవద్గీత ద్వారా బోధించాడు.. భక్తి, జ్ఞానము, కర్మ, యోగం, మోక్షం, తత్వం, సన్యాసం తదితర అంశాలు ఇందులో నిక్షిప్తమై ఉన్నాయి.. యుద్ధానికి విముఖుడైన అర్జునిడికి శ్రీకృష్ణుడు చేసిన కర్తవ్య బోధనే భగవద్గీతగా ప్రసిద్ధికెక్కింది..
భగవద్గీతను కేవలం ఆధ్యాత్మిక గ్రంధంగా చూస్తే దాన్ని మనం సరిగ్గా అర్ధం చేసుకోనట్లే.. ఇప్పుడు మనం పర్సనాలిటీ డెవలప్మెంట్ అని గొప్పగా చెప్పుకుంటున్నాం.. కానీ భగవద్గీత కూడా అలాంటి కోర్సే అని చెప్పక తప్పదు.. ఉత్తమ మానవునిగా ఎదిగేందుకు మార్గాన్ని భగవద్గీత చూపుతుంది..
భగవద్గీత అంటే చనిపోయినప్పుడు వినిపించే ఘంటసాల సంగీతం అనే భావన చాలా మందిలో ఏర్పడటం దురదృష్టకరం.. ఆ సమయంలో ఆధ్మాత్మిక చింతన, ఉపశమనం కోసం భగవద్గీతను వినడంలో ఎలాంటి తప్పులేదు.. కానీ నిత్య జీవితంలో అన్ని సందర్భాల్లోనూ మనం గీతా సారాంశాన్ని తెలుసుకొని ఆచరించాలి..
మరి కొందరు భవవద్గీతను పదవీ విరమణ తర్వాత కాలక్షేపం కోసం చదువుకుంటారు.. కానీ జీవిత చరమాంకంలో మాత్రమే గీతను చదువుకోవడం వల్ల ఏం లాభం? ముందుగానే చదువుకుంటే వారు తమ జీవితాలను మరింత ఫలవంతంగా తీర్చి దిద్దుకునేవారు కదా?
భగవద్గీత కేవలం హిందువులదేనా?.. శ్రీకృష్ణుడు ఎక్కడా అందులో చెప్పలేదు. మానవ జీవితాన్ని మార్చేసిన ఆవిష్కరణలు, సిద్దాంతాలు ఒక మతానికే పరిమితం కాలేదు కదా? మరి కొన్ని వేల సంవత్సరాల క్రితం ఆవిర్భవించిన గీతాన్ని ఒక మతంతో ముడి పెట్టడం సమంజసమేనా? హిందుత్వం ఒక జీవన విధానం.. భగవద్గీత ఈ ధర్మాన్ని ఆచరించే వారి జీవితాన్ని పరిపూర్ణం చేస్తుంది.. అన్య మత విశ్వాసులకు ఈ అదృష్టం ఎందుకు దక్కరాదు?
నేడు గీతాజయంతి.. మార్గశీర్ష మాసం శుద్ధ ఏకాదశి రోజున భగవద్గీత ఆవిర్భవించింది.. ఈ శుభ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు.. 

Wednesday, November 26, 2014

తీవ్రవాదంపై సమరం సాగాలి..

1857.. ఈ సంఖ్య మన ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామ (సిపాయిల తిరుగుబాటు) సంవత్సరం అనుకుంటున్నారా?.. అంతే కాదు యాదృచ్చికంగా తీవ్రవాదులు ఇప్పటి దాకా మన దేశ పౌరులను పొట్టన పెట్టుకున్న పౌరుల సంఖ్య కూడా ఇంతే.. ఆగస్టు 2,1984 నాటి మీనం బాకం బాంబు పేలుడు మొదలుకొని ఈ ఏడాది మే 1, 2014 వరకూ దేశంలో జరిగిన 58 ఉగ్రవాద ఘటనల్లో మరణించిన పౌరుల సంఖ్య 1857.. ఇందులో అత్యధికంగా ముంబయిలో జరిగిన మూడు ఘోర బాంబు దాడుల సంఘటనల మృతులు ఉన్నారు..(సోర్స్:వికీపీడియా)
తీవ్రవాదం మన దేశానికి ప్రధాన సమస్యగా మారింది.. శతృవు ఎక్కడో ఉండడు.. మన మధ్యలోనే ఉంటాడు.. చెప్పిరాడు.. హఠాత్తుగా వచ్చి పని కానిచ్చుకొని పోతాడు.. అప్రమత్తంగా లేకపోతే మనకే ప్రమాదం.. ఇందులో పొరుగు దేశాల ప్రోత్సాహంతో కొనసాగుతున్న ఉగ్రవాద సంస్థలు కొన్నయితే.. వివిధ రాష్ట్రాల్లో ఉద్యమాల పేరుతో కొనసాగుతున్న సంస్థలు మరికొన్ని..
దేశ ప్రజలంతా తీవ్రవాదానికి వ్యతిరేకంగా గళం ఎత్తాలి.. కలిసికట్టుగా పోరాడాలి.. ఐక్యతను ప్రదర్శించాలి.. మనకెందుకులే అని తప్పించుకునే పరిస్థితి లేదు.. మనం వెళ్లుతున్న రోడ్డు మీదో, హోటళ్లోనో, థియేటర్లోనే ఎప్పుడు ఏమి జరుగుతుందో చెప్పలేని పరిస్థితి.. హైదరాబాద్లో ఛాట్ తినేందుకు వెళ్లి, తిరిగి రాని లోకాలకు పోయారు అమాయక ప్రజలు.. తీవ్రవాదులు ఎప్పుడు ఏ రూపంలో పొంచి ఉంటారో, ఎవరిని పొట్టనపెట్టుకుంటారో ఎవరికి తెలుసు?
26/11 దేశ చరిత్రలో మరుపురాని తేదీగా మిగిలిపోయింది నవంబర్ 26, 2008నాడు పాకిస్తాన్ నుండి వచ్చిన తీవ్రవాదులు దేశ వాణిజ్య రాజధాని ముంబై మీద దాడి చేసి మారణ హోమం సృష్టించారు.. ఎందరో పౌరులు బలైపోయారు.. తీవ్రవాదులను తిప్పికొట్టే క్రమంలో వీర జవానులు, పోలీసులు నేలకొరిగారు.. ఈ రోజున వారందరికీ నివా
ళులర్పిద్దాం.. తీవ్ర వాదానికి వ్యతిరేకంగా మన గళం వినిపిద్దాం..

Tuesday, November 25, 2014

చరిత్ర పుటల్లో కోరంగి

మారిషస్ దేశంలో తెలుగు వారిని కోరంగిలంటారు.. అలాగే బర్మా (మయాన్మార్)లో కూడా తెలుగువారిని కోరంగీలుగానే పిలుస్తారు.. ఎందుకలా?  శతాబ్దాలుగా కోస్తాంధ్ర తీరంలోని కోరంగి నుండి ఉభయ గోదావరి జిల్లాలు, విశాఖ, శ్రీకాకుళం తదితర జిల్లాల ప్రజలు వారు ఉపాధి చైనా, బర్మా, మలేషియా తదితర తూర్పు ఆసియా దేశాలకు, శ్రీలంక, మారిషస్, ఇతర ఆఫ్రికా దేశాలకు వలస వెళ్లారు.. అందుకే వారికి కోరంగీలనే పేరు వచ్చింది.. తూర్పు గోదావరి జిల్లాలో కాకినాడ సమీపంలో ఉన్న గ్రామమే కోరంగి.. అయితే ఇప్పుడున్న కోరంగి, ఒకనాటి కోరంగి వేరు..
కోరంగి ఒకప్పుడు అతి కీలకమైన ఓడ రేవు.. అంతే కాదు ఇక్కడి నౌకా నిర్మాణ పరిశ్రమకు ఎంతో పెద్ద చరిత్ర ఉంది.  క్రీస్తు పూర్వం నుండే దీని ఆనవాళ్లు ఉన్నాయి.. ఈస్టిండియా కంపెనీ మన దేశానికి వచ్చిన తర్వాత కూడా కోరంగి నౌకాయాన పరిశ్రమ ప్రపంచంలోనే గొప్పదిగా పేరు తెచ్చకుంది.. లండన్ రేవులో లంగరు వేసిన కోరంగి మేడ్ నౌకలను చూసి బ్రిటిష్ వారికి కన్ను కుట్టింది.. నౌకా వ్యాపారంపై పట్టు సాధించిన బ్రిటిష్ వారు కోరండి నౌకా పరిశ్రమను నిర్వీర్యం చేసేందుకు పన్నుల భారాన్ని మోపారు.. అయినా తట్టుకొని నిలబడింది ఇక్కడి పరిశ్రమ.. కోరండి ఓడ రేవు అతి పెద్ద వ్యాపార కేంద్రంగా వర్దిల్లేది..
రెండు అతి పెద్ద తుఫానును కోరంగిని కాల గర్భంలో కలిపేశాయి.. 1789, 1839 సంవత్సరాలు కోరంగికి మరణ శాసనాలుగా మారాయి.. 1789 డిసెంబర్ మాసంలో వచ్చిన మహా తుఫాను ధాటికి కోరంగి అల్లకల్లోలం అయిపోయింది.. దాదాపు 20 వేల మంది మరణించారు.. ఇక్కడి ప్రజలు సర్వ కోల్పోయారు.. అయినా క్రమంగా కలుకొని మళ్లీ నౌకా నిర్మాణ పరిశ్రమను కొనసాగించారు.. కానీ 1839లో నవంబర్ 25 తేదీ కోరంగి ఉనికి కాలగర్భంలో కలిపేసింది.. 40 అడుగుల ఎత్తున లేచిన మహా అల ఊరంతటినీ ఇసుక సమాధి చేసేసింది.. దాదాపు 3 లక్షల మంది ప్రాణాలు పోయాయి.. ఇళ్లూ, గిడ్డంగులు, నౌకా పరిశ్రమ మాయమైపోయాయి.. ప్రపంచ తుఫానుల చరిత్రలో మూడో అతిపెద్ద విషాదంగా నమోదైంది ఈ ఘటన.. అసలు cyclone అనే పదాన్ని ఇంగ్లీషు వారు ఈ విషాదం తర్వాతే ఉనికిలోకి తెచ్చారంటారు..

కోరంగి ఇప్పుడు లేదు.. ఆనాటి నౌకా పరిశ్రమ కూడా లేదు.. ఇసుక దిబ్బల కింద దాని చరిత్ర సమాధి అయిపోయింది.. ఈ మహా విషాదం జరిగి ఈ రోజుకు సరిగ్గా 175 సంవత్సరాలు.. 

మాంసాహార వ్యతిరేక దినోత్సవం

ఈ సృష్టిలో అన్ని ప్రాణుల్లాగానే మనిషి కూడా ఓ భాగమే.. ప్రాణులన్నీ తమ మనుగడ కోసం పరస్పరం పోరడుకుంటాయి.. తోటి ప్రాణిని భక్షించేస్తాయి.. ఈ పోరాటంలో ఇతర ప్రాణులకన్నా అధికంగా బుద్ధి జీవిగా భావించే మానవుడు పై చేయి సాధించేశాడు.. కానీ తన ఆటవిక లక్షణాలను ఇంకా కొనసాగిస్తున్నాడు.. తన ఆహారం, సౌకర్యం, వినోదం అనే స్వార్థాల కోసం తోటి ప్రాణులను, వాటి స్వేచ్ఛను హరిస్తున్నాడు.. జీవించే హక్కు కేవలం మనిషికేనా? ఇతర ప్రాణులు ఏం పాపం చేశాయి..
మనం కనీసం మాంసాహారం మానేయడం ద్వారా అయినా తోటి ప్రాణుల హక్కును కాపాడవచ్చు.. మాంసాహాహారం లేకుండా జీవించలేమా? వాస్తవానికి మాంసాహారం కన్నా శాఖాహారంలోనే పోషక విలువలు అధికంగా ఉన్నాయి.. మాంసాహారం సర్వ రోగాలకు మూలం.. ఏ జంతువు ఏ రోగంతో బాధ పడుతుందో ఎవరికి తెలుసు.. అది మాంసాహారంగా మారి మన పొట్టలో చేరితే మనకు తెలియకుండానే రోగాలపాలవుతాం.. దీని బదులు తాజా శాఖాహారం తీసుకుంటే మేలు కదా? మాంసాహారం రుచికరం అనేది మన జిహ్వా చాపల్యానికి సంబంధించిన భ్రమ మాత్రమే.. ఇష్టపడితే శాఖాహారంలోనే అద్భుతమైన రుచిని ఆస్వాధించ వచ్చు.. తద్వారా జీవ హింసకు దూరంగా ఆరోగ్యంగా ఉండవచ్చు..

సాధు టీఎల్ వాస్వాని జయంతి అయిన నవంబర్ 25ను భారత దేశ వ్యాప్తంగా ప్రతి ఏటా Meatless Day  మాంసాహార వ్యతిరేక దినోత్సవంగా జరుపుకుంటున్నారు.. జంతువుల హక్కులు, వాటి స్వేచ్ఛా స్వాతంత్రాలను కాపాడేందుకు ఎంతో కృషి  చేసిన సాధు వాస్వాని జయంతి రోజైనా మాంసాహారానికి దూరంగా ఉందాం.. ఈ ఒక్కరోజే కాదు శాశ్వతంగా శాఖాహారులుగా మారుదాం..

Friday, November 21, 2014

పేరు.. పోరు.. హైదరాబాద్ విమానాశ్రయం

శంషాబాద్ విమానాశ్రయ దేశీయ టెర్మినల్ కు ఎన్టీఆర్ పేరు పెట్టడాన్ని సమర్ధిస్తారా?.. వ్యతిరేకిస్తారా?.. కొందరు మిత్రులు నన్ను అడిగిన ప్రశ్నలు ఇవి.. అభిప్రాయాన్ని ప్రకటించేందుకు నేనేం రాజకీయ నాయకున్ని కాదు.. అలాగని నా అభిప్రాయాన్ని దాచుకోవాల్సిన అవసరం కూడా లేదు..
ఇది అసందర్భమైన చర్య.. తొందర పాటు నిర్ణయం అని నేరుగా, ముందుగానే చెబుతున్నాను.. ఎన్టీ రామారావు గొప్ప తెలుగు నాయకుడు.. అత్యధిక సంఖ్యలో ప్రజలు అభిమానించే రాజకీయ నాయకుడు, సినీ నటుడు.. దీన్ని అంగీకరించాల్సిందే.. మరి ఇంతటి మహనీయుని పేరును వివాదాల్లోకి లాగడం అవసరమా?.. ఎన్టీఆర్ నెంబర్ వన్ తెలుగు వాడు, సమైక్య ఆంధ్రప్రదేశ్ కు మూడు సార్లు ముఖ్యమంత్రిగా పని చేశారని వాదించినా మారిన పరిస్థితుల్లో ఎవరైనా ఆయన స్వరాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అనే అంటారు కధా? పీవీ నరసింహారావు దేశ ప్రధానిగా పని చేసిన గొప్ప తెలుగువాడు కావచ్చు కానీ ఆయన స్వస్థలం వచ్చే సరికి అది తెలంగాణ రాష్ట్రంలో భాగం అని మనం అంగీకరిస్తున్నామా లేదా?
రాజశేఖర రెడ్డి హయాంలో బేగంపేటలోని విమానాశ్రయాన్ని శంషాబాద్ కు తరలించినప్పుడు అప్పటి వరకూ దేశీయ టెర్నినల్ కు ఉన్న ఎన్టీ రామారావు పేరును అక్కడ కొనసాగించక పోవడం అన్యాయమే.. తాము మళ్లీ అధికారంలోకి వస్తే ఎన్టీఆర్ పేరును మళ్లీ పెడతామని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆనాటి పరిస్థితుల్లో ప్రకటించారు.. కానీ రాష్ట్ర విభజన తర్వాత పరిస్థితులు మారిపోయాయి.. శంషాబాద్ విమానాశ్రయం కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో భాగమైపోయింది..
కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా అశోక్ గజపతి రాజును నిమమించినప్పుడే తేనెటీగ తుట్టెను కదిపే ఈ తొందరపాటు నిర్ణయం తీసుకుంటారేమో అని నేను ఊహించాను.. నేను ఊహించిందే  నిజం అయింది.. శంషాబాద్ విమానాశ్రయం విషయంలో  తీసుకున్న వివాదాస్పద నిర్ణయాన్ని టీఆర్ఎస్ తో పాటు అన్ని పార్టీలు వ్యతిరేకించక తప్పని పరిస్థితి ఏర్పడింది.. చివరకు ఈ తుంటరి పని వల్ల తెలంగాణ అసెంబ్లీలో టీడీపీ సభ్యులు కూడా ఇరకాటంలో పడాల్సి వచ్చింది.. అశోకుని సాయంతో చంద్రబాబు కేంద్ర ప్రభుత్వంపై వత్తిడి తెచ్చి ఎన్టీఆర్ పేరును పెట్టించడంతో ఇక్కడ బీజేపీ నాయకులు కూడా ఇబ్బందికర పరిస్థితినే ఎదుర్కొన్నారు..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖపట్నం, విజయవాడ (గన్నవరం), తిరుపతి (రేణిగుంట) విమానాశ్రయాలు ఉన్నాయి.. కొత్త రాష్ట్రం రాజధానితో పాటు కొత్త విమానాశ్రయం కూడా నిర్మించుకోవడానికీ అవకాశం ఉంది.. వీటిలో దేనికి ఎన్టీరామారావు పేరును పెట్టినా వ్యతిరేకించే వారు ఉండరు.. ఒక టెర్మినల్ కేం కర్మ ఏకంగా విమానాశ్రయం మొత్తానికి ఆ మహనీయుని పేరును పెట్టుకున్నా అభ్యంతరం ఎవరికుంటుంది.. ఇంత చక్కని అవకాశం ఉన్నప్పుడు పొరుగు రాష్ట్రం వారి విమానాశ్రయానికి బలవంతంగా ఎన్టీఆర్ పేరును రుద్దడంలోని ఆంతర్యం ఏమిటి.. ఇది తెంపరితనం కాదా? కోరి జగడం పెట్టుకోవడానికి మహనీయుడు ఎన్టీరామారావు పేరే దొరికిందా?.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు దాదాపులో అన్ని విషయాల్లో ఇప్పటికే ప్రతి రోజూ సిగపట్లు పడుతున్నాయి.. ఈ పరిస్థితిలో మూలిగే నక్కపై తాటి పండు పడ్డట్లు మరో కొత్త వివాదం అవసరమా?

శంషాబాద్ విమానాశ్రయంలోని రెండు టెర్నినళ్లకు పీవీ నరసింహారావు, కొమరం భీమ్ పేర్లు పెడితే అభ్యంతరం ఎవరికి? అలాగే నవ్యాంధ్ర రాజధాని, విమానాశ్రయాలకు ఎన్టీఆర్ పెరు పెట్టుకుంటే వ్యతిరేకించేది ఎవరు?

1947.. ఒక శరణార్ధి కథ

యువరాజ్ గుప్తా.. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ మీర్పూర్ జిల్లా కోట్లి పట్టణ వాసి.. భారత దేశంలో జమ్మూ కాశ్మీర్ విలీన సందర్భంగా పాకిస్తాన్ సైన్యం ఆయన స్వస్థలాన్ని ఆక్రమించింది.. 27 నవంబర్, 1947 రోజున 14 ఏళ్ల వయస్సులో యువరాజ్ గుప్తా తన కుటుంబ సభ్యులతో జమ్మూకు వలస వచ్చేశారు.. రైల్వే శాఖలో పని చేసి రిటైర్ అయిన యువరాజ్ గుప్తా తన పుట్టిన ఊరు, చిన్నప్పటి జ్ఞాపకాలను మరువలేదు.. ఆ ప్రాంతంతో మనసిక సంబంధం వదులుకోలేక 2004లో అతికష్టం మీద పాకిస్తాన్ ఆక్రమిక కాశ్మీర్ వెళ్లారు.. వీసాపై పీవోకే వెళ్లిన తొలి హిందూ ఆయనే కావడం మరో విశేషం..

హైదరాబాద్ వచ్చిన యువరాజ్ గుప్తా జమ్మూ కాశ్మీర్ అధ్యయన కేంద్రం (హైదరాబాద్ విభాగం) బృందంతో తన జ్ఞాపకాలను పంచుకున్నారు.. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ ప్రజల కడగండ్లను, ఉగ్రవాదుల దుశ్యర్యలను చెప్పుకొచ్చారు.. తనకు జన్మనిచ్చిన స్వస్థలం ప్రస్తుతం ఎదుర్కొంటున్న కడగండ్లకు చెప్పుడూ భావోద్వేగంతో కంటతడి పెట్టారు.. యువరాజ్ గుప్తా చెప్పిన విషయాలు చాలా ఆసక్తిని, బాధను కలిగించాయి.. ప్రస్తుతం పీవోకేలో హిందువుల జనాభా శాతం ‘0’ .. పాకిస్తాన్ సైన్యం దాదాపుగా వారిని నిర్మూలించడమో, తగలేయడమే, తరిమేయడమే చేసేసింది.. విధిలేని పరిస్థితుల్లో కొందరు మతం మార్చుకున్నారు.. పీవొకే ప్రజలు పాకిస్తాన్ ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని యువరాజ్ గుప్తా అంటున్నారు.. పాకిస్తాన్ చెర నుండి విముక్తి కోసం వారు తపిస్తున్నారట.. తన జ్ఞాపకాలు, అనుభవాలతో యువరాజ్ గుప్తా త్వరలో ఓ పుస్తకం రాస్తున్నారు.. కొద్ది వారాల్లోనే అది మన ముందుకు రాబోతోంది..

Wednesday, November 19, 2014

ఈయనకు పబ్లిసిటీ పిచ్చి ముదిరింది..

ఈ వ్యక్తిని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదనిపిస్తుంది.. తన కొత్త సినిమా రిలీజింగ్ సమయంలో పబ్లిసిటీ కోసం ఏదో వాగేస్తాడు.. వార్తల్లోకి వస్తాడు.. అందరి దృష్టి పడుతుంది.. సాధారణంగా తిట్లే ఉంటాయి.. కానీ అదే ఆయనకు కావాలి.. చాలా ఛీప్ ట్రిక్ ఇది..
ఇతని పబ్లిసిటీ పిచ్చి కొన్ని సార్లు చిరాకు తెప్పిస్తుంది.. స్వతహాగా నాస్తికుడైన ఈయన దురద్దేశ్యాలతో హిందూ దేవుళ్లను వివాదాల్లోకి లాగుతుంటాడు.. తాజాగా తెలంగాణ వారికి యాదగిరి నరసింహ స్వామి ఉన్నాక, తిరుపతి వెంకటేశ్వరుడు ఎందుకు అని వాగాడు.. తెలంగాణ వారు తిరుపతి దేవున్ని మొక్కితేనేం.. ఆంద్రావారు యాదగిరి దేవున్ని పూజిస్తేనేం.. మధ్యలో ఈ నాస్తికునికి ఏం నొప్పి?
దేవుళ్లకు ప్రాంతాలను ఆపాదించి ఉద్రిక్తతలు సృష్టించి పబ్లిసిటీ పొందే ఈయన మనస్థత్వం చాలా నీఛం.. ఏ ప్రాంతానికైనా దేవుడు ఒక్కడే.. దేవుళ్లు సరిహద్దులుంటాయా? ఈ పెద్ద మనిషికి విష్ణువు అవతారాలు తెలియవని అనుకోను..వెంటేశ్వరుడైనా, నరసింహుడైనా ఒక్కరే..
ఇలాంటి వ్యక్తులను ఎంత తక్కువ పట్టించుకుంటే అంత మంచిదేమో..

Tuesday, November 18, 2014

విశ్వ నాయకుని పాత్రలో మోదీ..

సిడ్నీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగం ప్రవాస భారతీయుల మదిని తట్టింది.. భారతీయులుగా పుట్టినందుకు ఎందుకు గర్వించాలో సూటిగా చెప్పారుు మోదీ.. భారత దేశం ఒకనాటి విశ్వ గురువు స్థానాన్ని తిరిగి సంపాదించడానికి ఇక ఎంతో దూరం లేదు అనే విశ్వాసం కలిగించింది..
నరేంద్ర మోదీ భారతీయుల మనస్సు గెలుచుకొని ప్రధానమంత్రి కావడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది.. ఇప్పుడు చాలా తక్కువ సమయంలోనే ప్రపంచ నాయకుని స్థాయిని పొందుతున్నారు.. మోదీ ఏ దేశానికి వెళ్లినా ప్రవాస భారతీయులు బ్రహ్మరథం పడుతున్నారు.. అమెరికా, ఆస్ట్రేలియా దేశాల్లో నరేంద్ర మోదీ బహిరంగ సభలు ఎంతో విజయవంతం అయ్యాయి.. అక్కడి ప్రభుత్వాలు ఆయనకు రాక్ స్టార్ ఇమేజీని ఇచ్చాయి.. గతంలో ఏ భారత ప్రధానమంత్రికీ లేనంతటి ఆదరణ మోదీ పట్ల చూపించారు ప్రవాస భారతీయులు.. అమెరికా, ఆస్ట్రేలియా దేశాలకు ఎంతో మంది విదేశీ నాయకులు వస్తుంటారు.. కానీ వారి సభలో ఎంత భారీగా, ఆర్భాటంగా జరిగిన దాఖలాలు లేవు.. భారత దేశమంటే విదేశీయులకు తెలిసింది గాంధీ, నెహ్రూ మాత్రమే.. ఇప్పుడు నరేంద్ర మోదీని సైతం శక్తివంతమైన విశ్వ నాయకునిగా గుర్తిస్తున్నారు.. ఇది మోదీకి మత్రమే కాదు భారతీయులందరికీ గౌరవమే..

Wednesday, November 12, 2014

వైస్ ఛాన్సలర్ తిక్క..

ఈయన్ని చూస్తే బీటు కానిస్టేబుల్ మాదిరిగా కనిపిస్తున్నాడా?.. కానీ బీట్ కానిస్టేబుల్కి ఉన్న ఇంగితం కూడా ఈ పెద్ద మనిషికి లేదు.. గస్తీ తిరిగే కానిస్టేబుల్ రోడ్లపై పోకిరీలకు కంట్రోల్ చేస్తాడు.. కానీ ఈ పెద్దాయన అమ్మాయిలు చదువుకోడానికి లైబ్రరీలకే రావద్దని అంటాడు.. ఇంతకీ ఈ పెద్దాయన ఎవరో తెలుసా?.. ఆలీగర్ ముస్లిం యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ జమీరుద్దీన్ షా..
ఆడ పిల్లలు కూడా అబ్బాయిలతో సమానంగా, ఇంకా చెప్పాలంటే వారికన్నా ధీటుగా చదువుకొన్ని అన్ని రంగాల్లోనూ దూసుకుపోతున్న కాలం ఇది.. ప్రతి తండ్రీ తన కూతురును కొడుకతో సమానంగా చదివిస్తున్నాడు.. కానీ ఒక యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ అయిన ఈ పెద్దాయన ఇంకా ఛాందసవాదం వదులుకోకపోవడం దారుణం.. తన యూనివర్సిటీ పరిధిలోని విద్యార్ధినులు లైబ్రరీకి రావద్దని, వస్తే విద్యార్థుల చదువులకు ఆటంకం ఏర్పడుతుందని వాదించడానికి ఇతగాడికి ఎంత ధైర్యం? ఇలాంటి దౌర్భాగ్య మనస్థత్వం ఉన్నవారు ఉన్నత పదవులకు అర్హులేనా?

Monday, November 10, 2014

ఆధారే సర్వస్వం.. (కార్టూన్)

ప్రజలందరికీ ఆధార్ కార్డులు ఇక తప్పనిసరి.. ఈ కార్డు ఉంటేనే ఇక మనుషులుగా గుర్తిస్తారు.. సంక్షేమ కార్యక్రమాలకు అయినా, సిమ్ కార్డు తీసుకోవాలన్నా, బ్యాంకు అకౌంట్ తెరవాలన్నా ఆధారే గుర్తింపు.. ఈ చిత్రాన్ని చూసి జస్ట్ నవ్వుకోండి అంతే..

Sunday, November 9, 2014

జనం నేతకు మళ్లీ కేంద్ర మంత్రి పదవి

కొందరికి పదవులతోనే గుర్తింపు.. పదవులకు గుర్తింపు తెచ్చేవారు మరి కొందరు.. ఇక పదవులు ఉన్నా, లేకున్నా గుర్తింపు ఉన్నవారు చాలా అరుదు.. మన దత్తన్నది ఈ కోవే..
ఆరు దశాబ్దాలుగా ప్రజాసేవలో ఉన్న బండారు దత్తాత్రేయ గారిని మూడోసారి కేంద్ర మంత్రి పదవి వరించడం బీజేపీ కార్యకర్తలకు మాత్రమే కాదు, రెండు రాష్ట్రాల్లోని తెలుగు ప్రజలను, నాయకులను, పార్టీలకు అతీతంగా ఆనందం కలిగించిన వార్త..
దత్తాత్రేయ గారు ఆర్ఎస్ఎస్ ద్వారా సమాజ సేవకు అంకితమైన దత్తాత్రేయ ఎమర్జెన్సీ సమయంలో నిర్వహించిన పాత్ర, దివిసీమ ఉప్పెన అప్పుడు చేపట్టిన సేవ మరువలేనిది.. బీజేపీలో పదవులను సమర్ధవంతంగా చేపట్టారు.. నాలుగు సార్లు సికింద్రాబాద్ నుండి ఎంపీగా ఎన్నికయ్యారు.. అటల్జీలో పాటు నేడు మోదీ మంత్రి వర్గంలో మంత్రి పదవులు నిర్వహించడం సంతోషకరం..
బండారు దత్తాత్రేయ గారు ఎప్పుడు ప్రజల మధ్యే ఉంటారు.. అధికారంలో ఉన్నా, లేకున్నా వారి సమస్యల పరిష్కారం కోసం కృషి చేయడం ఆయన నైజం.. గతంలో కేంద్ర రైల్వే, పట్టణాభివృద్ధి శాఖలకు సహాయ మంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాద్ నగరానికి ఎంఎంటీఎస్ రైలును తీసుకొచ్చారు దత్తాత్రేయ.. అలాగే వాంబే పథకం కింద ఎంతో మంది పేదలకు ఇళ్లు నిర్మించి ఇచ్చారు.. కానీ దీనికి అంతగా ప్రచారం దక్కకపోవడం ఆశ్చర్యకరం..
దత్తాత్రేయకు పార్టీలకు అతీతంగా అందరితో కలుపుగోరుగా ఉంటారు.. రాజకీయ ప్రత్యర్థులను సైతం ఆత్మీయంగా పలకరిస్తారు.. ప్రతి ఏటా దసరా సమయంలో తెలంగాణలో అలయ్ బలయ్ కార్యక్రమంతో అన్ని పార్టీల నేతలను ఒకే వేదికపైకి తేవడం సామాన్య విషయం కాదు..
మరోసారి కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన దత్తన్న తెలుగు రాష్ట్రాల సర్వతో ముఖాభివృద్ధిలో తనదైన ముద్రను చూపుతారని కచ్చితంగా చెప్పగలను..వారికి హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు..

Wednesday, November 5, 2014

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకున్న మతి లేని, హాస్యాస్పదమైన నిర్ణయం ఏదైనా ఉందంటే.. అది ఏటీఎంల వాడకంపై నియంత్రణ. మెట్రో నగరాల్లో సొంత బ్యాంకు ఏటీఎంను నెలకు ఐదు సార్లే ఉపయోగించాలట.. ఇతర బ్యాంకుల ఏటీఎంలను మూడు సార్లు మాత్రమే ఉపయోగించాలి. అంతకు మించితే ప్రతి లావాదేవీకి అధనంగా రూ.20 వసూలు చేస్తారట.
ఏటీఎంలు ఎన్నిసార్లు ఉపయోగించుకుంటే ఏమిటి నష్టం?.. మధ్యలో ఆర్బీఐకీ ఏమిటి నొప్పి?.. ఖాతాదారులను ఇబ్బంది పెట్టే ఈ చెత్త ఐడియా వారికి ఎవరిచ్చారు?..

బ్యాంకింగ్ సర్వీసులు ఎక్కువగా ఉపయోగించుకునేది వేతన జీవులే.. గతంలో జీతాలు చేతికి ఇచ్చే రోజుల్లో చిరుద్యోగులు వారం పది రోజుల్లో అంతా ఖర్చయిపోయి, మిగతా నెలంతా ఇబ్బంది పడేవారు.. బ్యాంక్ అకౌంట్లో జీతాలు వేసే విధానం వచ్చాక వారిలో పొదుపు చేసుకునే అలవాటు పెరిగింది.. ప్రతిసారీ చెక్కు పట్టుకొని బ్యాంకుకు వెళ్లి ఇబ్బంది పడాల్సి అవసరం లేకుండా ఏటీఎం కార్డులు అందరికీ ప్రయోజనకరంగా మారాయి..
ఏటీఎంల వాడకంపై నియంత్రణ కారణంగా ఖాతాదారులు తమ వేతనాలను రెండు మూడు విడతల్లో మొత్తం లాగేసుకుంటారు. ఫలితంగా వారి అకౌంట్లో నెలాఖరుదాకా ఉండాల్సిన నిల్వలు తగ్గుతాయి.. ఇక్కడ ఎక్కువ నష్టపోతున్నది బ్యాంకులే.. మరోవైపు ఏటీఎంలను ఐదు సార్లు వినియోగించుకున్నాక, ఛార్జీల భారాన్ని తప్పించుకునేందుకు నేరుగా బ్యాంకుకే వచ్చేస్తారు.. ఇలా అయితే బ్యాంకు సిబ్బందిపై పని భారం పెరగడం మాత్రమే కాదు, ఖతాదారుకు సమయం కూడా వృధా..

ప్రతి పౌరునికి బ్యాంకు ఖాతా ఉండాలనే లక్ష్యంతో ప్రధాని మోదీ ఇటీవల జన్ ధన్ పథకాన్ని ప్రారంభించారు.. ప్రజల్లో పొదుపు అలవాటు పెంచడంతో పాటు, ప్రభుత్వ ప్రయోజనాలు వారికి నేరుగా చేరాలన్నదే ఈ పథకం ఆశయం.. కానీ ఆర్బీఐ అధికారుల మతి లేని విధానాలకు ప్రజలను బ్యాంకుల సేవలను మరింత దూరం చేసేవిలా ఉన్నాయి.. పరోక్షంగా వారిలో పొదుపుపై ఆసక్తిని తగ్గిస్తున్నాయి.. ఇక్కడ అంతిమంగా నష్టం కలిగేది ఎవరికి? అంతో ఇంతో దేశ ఆర్థిక వ్యవస్థకే కదా?..

Tuesday, November 4, 2014

న్యూయార్క్ టైమ్స్ అహంకారం అణిగే ఉండాలి..

భారతీయుల అంతరిక్ష ప్రయోగ విజయంపై ఓర్వలేక న్యూయర్క్ టెమ్స్ పత్రిక వేసిన కార్టూన్ గుర్తుండే ఉంటుంది.. ఆ కార్టూన్ వివాదాస్పదం కావడంతో న్యూయార్క్ టైమ్స్ క్షమాపణలు చెప్పిందనుకోండి.. అయితే ఇటీవల ఓ రాకెట్ ప్రయోజంలో అమెరికా ఫెయిల్ అయిన ఉదంతంపై మన హిందుస్థాన్ పత్రిక వేసిన కార్టూన్ అందరినీ ఆకర్షించింది.. అమెరికన్ పత్రిక అహంకారానికి, దెబ్బకు దెబ్బ అన్నట్లుందా కార్టూన్..

Sunday, November 2, 2014

పేదలకు వరం.. ఉచిత వైద్యం

చాలా కాలంగా ప్రభుత్వాలు ప్రజారోగ్యాన్ని గాలికి వదిలేస్తున్నాయి.. ప్రభుత్వాసుపత్రుల్లో వైద్య సేవలు, సౌకర్యాలు అందుబాటులో లేకుండా పోయాయి.. ఫలితంగా ప్రజలు ప్రయివేటు ఆస్పత్రులకు వెళ్లి జేబులు ఖాళీ చేసుకుంటున్నారు.. ఇక పేదవాడికి పెద్ద రోగం వస్తే అప్పు చేసి, ఆర్థికంగా చితికిపోతున్నాడు.. వైద్యానికి డబ్బు పుట్టక విధిలేక మరణిస్తున్న సందర్భాలు ఉన్నాయి.. ఇక ఇదంతా గతం కాబోతోంది.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెస్తున్న సరికొత్త పథకం దేశ ప్రజలకు, ముఖ్యంగా పేదలకు ఆశాజ్యోతిగా కనిపిస్తోంది..
ఇకపై ఆస్పత్రులకు వెళ్లితే డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదు.. ఎంత పెద్ద రోగానికై ఉచితంగా చికిత్స చేస్తారు.. మందులు కూడా ఉచితమే.. ఈ ఖర్చునంతా కేంద్ర ప్రభుత్వమే భరించబోతోంది.. ఇది కల కాదు నిజం రూపం దాల్చబోతోంది.. ప్రజారోగ్యం బాధ్యత పూర్తిగా ప్రభుత్వానిదే.. ప్రజలు వైద్యం కోసం పెట్టే ఖర్చు ఆదా కావడం, వారి ఆర్థిక పరిస్థితిని మెరుగు పరుస్తుంది.. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఇప్పటికే ఈ మేరకు నివేదికను తయారు చేసింది..

అమెరికాలో అమలవుతున్న తరహా యూనివర్సల్ హెల్త్ ఫ్లాన్ భారత దేశంలోనూ తీసుకురావడానికి ప్రధాని నరేంద్రమోదీ నిర్ణయించారు. వచ్చే ఏడాది ఏప్రిల్ నుండి ప్రారంభమయ్యే ఈ పథకం 2019 నాటికి దేశ వ్యాప్తంగా అమలు చేయబోతున్నారు. ఇందు కోసం 1.6 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ ఖర్చుచేయబోతున్నారు.. దేశంలోనే అతిపెద్ధ ఆరోగ్య పథకం అతి త్వరలో మన ముందుకు రాబోతోంది.. 

ఆంధ్రప్రదేశ్ అవతరణ అక్టోబర్ 1..

ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం ఎప్పుడు? నవంబర్ ఒకటా?. జూన్ రెండా?.. లేక అక్టోబర్ ఒకటా? ఈ విషయంలో అధికార పక్షం, ప్రతిపక్షం పరస్పర విరుద్దంగా ప్రకటనలు చేస్తూ ప్రజల్లో గందరగోళం సృష్టిస్తున్నాయి.. నిజానికి ఇద్దరి వాదనలు అర్థం లేనివనే చెప్పక తప్పదు..ఈ ప్రశ్నకు చరిత్రలో స్పష్టమైన సమాధానం ఉంది..
ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలోని తెలుగు వారు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం చిరకాల పోరాటం చేశారు.. అమరజీవి పొట్టి శ్రీరాములు ఆత్మార్పణం ఫలితంగా అక్టోబర్ 1, 1953న ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది.. ఆ తర్వాత హైదరాబాద్ రాష్ట్రంలోని తెలంగాణ ప్రాంతం, ఆంధ్ర రాష్ట్రం విలీనమై నవంబర్ 1, 1956న ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది.. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంతో జూన్ 2, 2014న రాష్ట్రం రెండుగా విడిపోయింది.. తెలంగాణ మినహా మిగతా ప్రాంతం ఆంధ్రప్రదేశ్ పేరుతోనే కొనసాగుతోంది..
తెలంగాణ విషయానికి వచ్చే సరికి జూన్ 2 అవతరణ దినోత్సవం.. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సైతం ఇదే తేదీ జరపవచ్చా అన్నదే సందిగ్దం.. రాష్ట్ర క్యాబినెట్ ఈ తేదీకి ఆమోద ముద్ర వేయడాన్ని వైఎస్సార్సీపీ తప్పు పట్టింది.. నవంబర్ ఒకటినే ఉత్సవాలకు సిద్దమైంది..
నవంబర్ ఒకటి సమైక్యాంధ్రప్రదేశ్ ఆవిర్భవించిన రోజు.. అసలు సమైక్యాంధ్రప్రదేశ్ రాష్ట్రమే ఇప్పుడు లేదు.. మరి ఈ తేదీన అవతరణ ఉత్సవాలు జరపడంలో అర్థం ఉందా? జూన్ రెండు అనే సరికి తెలంగాణ ఆవిర్భావమే అందరికీ గుర్తుకు వస్తుంది.. ఆ రోజున ఉత్సవాలు జరపడంలోనూ అర్థం లేదు.. ఇక మిగిలింది అక్టోబర్ ఒకటి..
1953 అక్టోబర్ ఒకటిన మద్రాసు రాష్ట్రం ఉండి విడిపోయి ఏర్పడిన ఆంధ్ర రాష్ట్రం ఇప్పుడు మళ్లీ దాదాపు అదే రూపంలో (ఖమ్మంలో కొన్ని ప్రాంతాలు తప్ప) ఆంధ్ర ప్రదేశ్ పేరుతో కొనసాగుతోంది.. 1956 నవంబర్ ఒకటిన ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావంతో ఈ తేదీని అంతా మరిచిపోయారు.. వాస్తవానికి తాజా నవ్వాంధ్రప్రదేశ్ అయినా, నాటి ఆంధ్ర రాష్ట్రమైనా అక్టోబర్ ఒకటి 1953న ఏర్పడిన భౌగోళిక స్వరూపమే.. మరి ఈ తేదీనే అవతరణ దినోత్సవం జరుపుకుంటే ఎవరు కాదంటారు?

చారిత్రిక వాస్తవాలను పరిగణలోకి తీసుకొని అక్టోబర్ ఒకటినాడే రాష్ట్ర అవతరణ దినోత్సవాలను జరుపుకోవడం సమంజసం.. అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనే పేరును తిరిగి ఆంధ్ర రాష్ట్రంగా మార్చుకుంటే మరింత స్పష్టత కనిపిస్తుంది..

Friday, October 31, 2014

ఇదేం వైఖరి బుఖారీ..

మోదీకి నై.. షరీఫ్ కు జై.. ఇదండీ మన ఢిల్లీ జామా మసీదు షాహీ ఇమామ్ సయ్యద్ అహ్మద్ బుఖారీ విధానం.. తన తనయుడు షాబన్ కు నూతన ఇమాం బాధ్యతలు అప్పగిస్తున్న సందర్భంగా పాకిస్తాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ ను ఆహ్వానించిన బుఖారీ సాబ్, భారత ప్రధాని నరేంద్ర మోదీని మాత్రం ఆహ్వనించడట.. ఎందుకంటే గజరాత్ అల్లర్లకుె మోదీ క్షమాపణ చెప్పలేదట..ఇదేం లాజిక్కో మరి.. మోదీ ముస్లిం వ్యతిరేకట..
ఇటీవల ఒక ఇంటర్వ్యూలో భారతీయ ముస్లింల దేశభక్తిపై ప్రధాని మోదీ ఇచ్చిన కితాబు అందరికీ గుర్తుండే ఉంటుంది.. మరి మోదీ ముస్లిం వ్యతిరేకని ఎలా చెప్పగలడీ బుఖారీ? భారతీయులంతా ఓట్లేసేనే కదా నరేంద్ర మోదీ ప్రధాని అయ్యారు.. ముస్లింలు అత్యధిక సంఖ్యలో ఉన్న నియోజకవర్గాల్లో కూడా బీజేపీకి ఓట్లు పడ్డాయి.. మరి మోదీని వారు ఆమోదించినట్లా? తిరస్కరించినట్లా?
ఈ బేఖారీ బుఖారీ మాటలను పట్టించుకోవాల్సిన అవసరం లేదు.. కొద్ది కాలం క్రితం ఢిల్లీకి వచ్చిన ఇమాం బుఖారీ దగ్గరుండీ మరీ జామా మసీదును చూపించారు.. తినేది భారత సొమ్ము.. పాడేది.... జాతీయవాద ముస్లింలు ఇలాంటి మత నాయకులు ద్వంద్వ వైఖరిని గమనిస్తూనే ఉన్నారు..

వల్లభభాయి తొలి ప్రధాని అయ్యి ఉంటే?..

సర్దార్ వల్లభభాయ్ పటేల్ స్వతంత్ర భారత తొలి ప్రధానమంత్రి అయ్యి ఉంటే?.. దేశ చరిత్ర గతి ఎలా ఉండేది?
ఈ ప్రశ్న ఈ మధ్య కాలంలో తరచూ వినిపిస్తోంది.. నిజమే సర్దార్ పటేల్ మన దేశానికి తొలి ప్రధాని అయి ఉంటే బాగుండేది.. ప్రస్తుతం మన దేశం ఎదుర్కొంటున్న సమస్యలకు ఆనాడే ఫుల్ స్టాప్ పడి ఉండేది..
బ్రిటిష్ వారు స్వాతంత్ర్యం ఇచ్చే నెపంలో దేశాన్ని విభజించారు.. పాకిస్తాన్ అనే శాశ్వత చిచ్చు రగిలించారు.. 552 స్వదేశీ సంస్థానాలకు ఇండియా లేదా పాకిస్తాన్లో చేరవచ్చు లేదా స్వతంత్రంగా ఉండొచ్చు అనే మెలిక పెట్టి వెళ్లారు.. ఈ సంస్థానాల కారణంగా ఎప్పటికీ సమస్యలు తప్పదని గ్రహించారు తొలి ఉప ప్రధాని, హోంమంత్రి సర్ధార్ వల్లభభాయి పటేల్.. సంస్థానాధీశులందరినీ ఒప్పించి భారత దేశంలో సంపూర్ణంగా విలీనం చేశారు.. అయితే హైదరాబాద్, జునాఘడ్, జమ్మూ కాశ్మీర్ సంస్థానాల సంగతి తేలలేదు..  ఈ దశలో పటేల్ కఠిన నిర్ణయం తీసుకున్నారు.. హైదరాబాద్, జునాఘడ్లను దండోపాయంతో దారికి తెచ్చారు.. అయితే కాశ్మీర్ విషయంలో ప్రధాని నెహ్రూ తానే స్వయంగా జోక్యం చేసుకున్నాడు.. అందుకే అది నేటికీ ఎటూ తేలకుండా రావణ కాష్టంలా రగులుతూ ఉంది..
కాశ్మీర్ సమస్యను నెహ్రూ ఐక్యరాజ్య సమితికి నివేదించడాన్ని వల్లభభాయి పటేల్ తప్పు పట్టారు. అలాగే పాకిస్తాన్ కు 55 కోట్ల రూపాయలు ఇవ్వాలనే నిర్ణయాన్ని గట్టిగా వ్యతిరేకించారు. సర్దార్ పటేల్ కేవలం 40 నెలలు మాత్రమే ఉప ప్రదాని పదవిలో ఉన్నారు.. ఆయన ఇంకొన్ని సంవత్సరాలు బతికి ఉంటే టిబెట్ సమస్య, చైనా యుద్దం వచ్చేవి కావని చెప్పక తప్పదు.. పాకిస్తాన్, చైనా దురాక్రమణలకు కచ్చితంగా అడ్డుకట్ట వేసి ఉండేవారు..  ప్రధాని నెహ్రూ తొందర పాటు  నిర్ణయాలకు పటేల్ ఎప్పటికప్పుడు అడ్డుకట్ట వేస్తూ వచ్చారు..  వారి మరణం తర్వాత నెహ్రూకు పట్టపగ్గాలు లేకుండా పోయాయి.. ఎన్నో తప్పటడుగులు వేస్తూ వచ్చారు..
వాస్తవానికి దేశ విభజన తర్వాత సర్ధార్ పటేల్ ప్రధానమంత్రి పదవి చేపట్టాలని దేశ ప్రజలంతా కోరుకున్నారు. కాంగ్రెస్ పార్టీలోని మెజారిటీ నాయకులు, సభ్యుల అభిమతం కూడా అదే.. కానీ మహాత్మా గాంధీ తన ప్రియ శిష్యుడు నెహ్రూ వైపు మొగ్గు చూపించారు.. ఉప ప్రధానిగా, హోంమంత్రిగా పటేల్ బాధ్యతలు చేపట్టిన పటేల్ తానేమిటో ఆచరణలో చూపించారు.. దేశ సమగ్రతకు బాటలు వేశారు.. వల్లభభాయి పటేల్ తొలి ప్రధాని అయి ఉంటే మన దేశ చరిత్ర ఇప్పుడున్నంత అధ్వాన్న స్థితిలో మాత్రం ఉండేది కాదు.. పటేల్ తన ధృడ నిర్ణయాలతో చక్కని బాట వేసేవారు.. నెహ్రూలా తొందర పాటు నిర్ణయాలు తీసుకునేవారు కాదు.. అందుకే అన్ని ఉక్కు మనిషి అన్నారు..

అక్టోబర్ 31న సర్ధార్ వల్లభభాయి పటేల్ జయంతిని భారత ప్రభుత్వం రాష్ట్రీయ ఏక్తా దివస్ గా ప్రకటించింది.. దేశ సమగ్రత, ఐక్యత, భద్రత కోసం చిత్తశుద్దితో పని చేస్తూ పటేల్ ఆశయాల సాధన కోసం మనమంతా ప్రతిన బూనాల్సిన తరుణమిది..

Monday, October 27, 2014

ఎబోలా మరణ మృదంగం..

ఎబోలా.. ఈ పేరు వింటేనే ప్రపంచం వణికిపోతోంది.. ముఖ్యంగా అగ్ర దేశాలు..
పశ్చిమ ఆఫ్రికా దేశాల్లో ఎబోలా సోకి జనం పిట్టల్లా రాలిపోతుంటే అగ్ర దేశాలు పట్టించుకోలేదు.. ఆ అంటరాని పేద దేశాల్లో జనం చస్తే ఎంత, బతికితే ఎంత అని నిర్లక్ష్యం చేశాయి.. కానీ ఈ ప్రాణాంతక రక్కసి తమ గడప దాకా వచ్చేసరి హడలిపోతున్నాయి.. అర్జంటుగా మందును తెచ్చే ప్రయత్నాలు మొదలు పెట్టాయి.. వాస్తవానికి ఈ ఎబోలా వైరస్ 1976లోనే బయటపడింది.. దీనిపై పరిశోధనలు చేసిన అమెరికా కెనడా దేశాల శాస్త్రవేత్తలు మందును కూడా కనిపెట్టామని ప్రకటించారు.. ఆ తర్వాత దాన్ని విస్మరించారు.. అప్పట్లో అంత అవసరం లేదని భావించి తదుపరి పరిశోధనలు, మందుల ఉత్పత్తికి కొంత నిర్లక్ష్యం  ప్రదర్శించారు.. ఫలితంగా ఇప్పడు ఈ మహమ్మారి ఉగ్రరూపం దాల్చింది.
పశ్చిమాఫ్రికాలోని గినియాలో మొదలైన మరణ మృదంగం అన్ని దేశాలకు విస్తరిస్తోంది.. ఇప్పటి వరకూ 10,141 ఎబోలా వ్యాధి కేసులు నమోదైతే 4,922 మంది మృత్యువాత పడ్డారు.. ఈ ఏడాది మార్చిలో గినియాలో తొలి కేసు అధికారికంగా నమోదైంది.. కానీ అప్పటికే ఆలస్యం అయింది.. పొరుగునే ఉన్న లైబీరియా, సియెర్రా లియోన్, నైజీరియా దేశాలకుఈ వ్యాధి విస్తరించింది.. ఆఫ్రికా అడవుల్లోని గొరిల్లాలు, చింపాంజీలు, కోతులు, దుప్పులు, గబ్బిలాల నుండి ఈ వ్యాధి మొదలైందని తేలింది.. చనిపోయిన ఈ వన్యప్రాణులను పూడ్చే క్రమంలో వాటి రక్తం, ఇతర స్రావాల నుండి మనుషులకు వైరస్ అంటుకుంది.. ఈ దేశాల్లో గొరిల్లాలు, గబ్బిలాలను తినే అలవాటు కూడా మరో కారణమని భావిస్తున్నారు..
ఎబోలాతో మరణించిన వారిని అంత్యక్రియలు చేసే బంధువులకు, చికిత్స చేసే వైద్య సిబ్బందికి సైతం వైరస్ సోకడంతో దీని తీవ్రత అర్థమెంది.. ఎబోలా నివారణకు మందును అందుబాటులోకి తేవడానికి మరో నాలుగైదు నెలలు పడుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ అంఛనా వేస్తోంది,, కానీ డిసెంబర్లోగా మందు అందుబాటులోకి రాకపోతే ఒక్క లైబీరియాలోనే 90, 000 మంది మరణిస్తారని అంఛనా వేస్తున్నారు..  అమెరికా, యూరోప్ దేశాలకు క్రమంగా విస్తరిస్తున్న ఈ వ్యాధి, ఇప్పటి వరకైతే మన దేశానికి చేరినట్లు అధికారికంగా నిర్ధారణ కాలేదు.. కానీ ఈ వ్యాధి తీవ్రంగా ఉన్న దేశాల్లో భారతీయులు కూడా ఉండటంతో మన ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది..
ఎబోలా వైరస్ సోకిన వ్యక్తి రక్తపీడనం పడిపోయి, శరీర అవయవాల పని తీరు దెబ్బతిని మరణిస్తాడు..  వ్యాధి సోకినట్లు బయటపడటానికి కనీసం వారం రోజులు పడుతుంది.. ఈలోగా జరగాల్సిన ముప్పు జరిగిపోతుంది.. జ్వరం, వాంతులు, విరేచనాలు, వికారం, కడుపు నొప్పి, వెన్నునొప్పి, గొంతు తడ ఆరడం, శరీరంపై దద్దుర్లు ఈ వ్యాధి ప్రాథమిక లక్షణాలు.. వ్యాధి తీవ్రమైతే కాలేయం, మూత్ర పిండాలు దెబ్బతినడంతో  పాటు శరీరంలోపల, బయట తీవ్రమైన రక్త స్రావాలు మొదలవుతాయి.. సత్వర చికిత్స అందితేనే మనిషి బతికి బట్టకడతాడు.. లేకపోతే నూటికి 90 శాతం మరణం తప్పదు..

ఎబాలా వ్యాధిపై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.. తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదకరమే.. బీ అలర్ట్..