Saturday, August 31, 2013

ఈయనకు బాధ్యత లేదా?..

నేను దొంగనా? అని బాధ పడ్డారు.. బొగ్గు కుంభకోణం ఫైళ్లు పోతే నేనేం చేయాలి, నేను కాపలా దారుడినా? అంటూ అమాయకంగా ప్రశ్నించారు.. ఆర్థిక సంక్షోభానికి మేమా కారణం? ఉల్లి ధర పెగితే మాదా బాధ్యత అంటున్నారీ పెద్ద మనిషి.. బంగారం ధర పెరిగినా, రూపాయి ధర పతనమైనా తనకు సంబంధం లేదన్నట్లు తేల్చేశారు.. అన్నింటికీ బీజేపీయే కారుణం, వారి వల్లే సంస్కరణలకు అవరోధం ఏర్పడిందని దుమ్మెత్తి పోశారు.. రాజ్యసభలో ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మాట్లాడిన తీరు ఇది..
ప్రధానమంత్రి మట్లాడిన తీరు ఆశ్చర్యాన్ని కలిగించడమే కాదు, బాధ్యతా రహితంగా కూడా ఉంది.. అధికారంలో ఉన్నవారు, దేశాన్ని పరిపాలించే నాయకులు ప్రజలకు జవాబుదారిగా ఉండాలి.. కానీ తమకేదీ సంబంధం లేదని చాటు కోవడం మన్మోహన్ చేతగాని తనాన్ని స్పష్టంగా బయట పెడుతోంది.. ప్రతిపక్షం అన్నప్పుడు అధికారంలో ఉన్నవారిని నిలదీయడం సహజం.. జవాబు చెప్పడం అధికారంలో ఉన్నవారి విధి..
తొమ్మిదేళ్ల యూపీఏ ప్రభుత్వానికి నాయకత్వం వహించిన ప్రధాని మన్మోహన్ సింగ్ తన పాలనలో జరిగిన తప్పిదాలకు బాధ్యత వహించాల్సిన అవసరం లేదా? తనకేమీ సంబంధం లేదని తప్పించుకునే బదులు పదవిని త్యజిస్తేనే మంచిది కదా? 2014 నాటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం పాలవుతుందని సర్వేలన్నీ చెబుతున్నాయి.. అప్పడు కాంగ్రెస్ నాయకులంతా బలిపశువును చేసేది మన్మోహన్ సింగ్ గారినే.. గతంలో పీవీ నరసింహారావు పరిస్థితి ఏమైంది? రావు గారికి పట్టిన దుస్థితి సింగ్ గారికి పట్టక ముందే తెలివైన నిర్ణయం తీసుకోవడం ఉత్తమమేమో?..

Friday, August 30, 2013

బరితెగించిన బర్మా..

మన నాయకుల అసమర్ధత ప్రపంచానికి తెలిసిపోయింది.. నిన్నటి దాకా పాకిస్తాన్, చైనాలు మన సరిహద్దులను కబలిస్తే, ఇవాళ మయన్మార్(బర్మా) కూడా తెగించింది.. మణిపూర్ రాష్ట్రంలోని చందేల్ జిల్లా మోరే పట్టణ సమీపంలోని హాలెన్ ఫాయ్ గ్రామంలోకి చొరబడి స్థావరాన్ని ఏర్పాటు చేసుకుంది మణిపూర్.. పొరుగు దేశానికి బుద్ది చెప్పాల్సిన భారత ప్రభుత్వం ఎప్పటిలాగే..'మమన్మార్ తో ఈ విషయాన్ని చర్చించి సామరస్యంగా సరిహద్దు సమస్యను పరిష్కరిస్తాం' అంటూ చిలుక పలుకులు పలికింది..
దేశ సరిహద్దులను కాపాడుకోలేని మన దౌర్భగ్య పరిస్థితికి ఈ బలహీన దేశం చక్కగా ఉపయోగించుకుంది.. పాకిస్తాన్, చైనాలను మనం గట్టిగా బుద్ది చెప్పి ఉంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేదా? మన నాయకుల అతి మంచితనాన్ని బలహీనతగా భావించిన పొరుగు దేశాలు కాలరెగరేస్తున్నాయి..
మన బలహీన విదేశాంగ విధానం కారణంగా ఒకప్పుడు మనకు ఎంతో సన్నిహితంగా ఉంటూ, పెద్దన్నగా గౌరవించిన నేపాల్, శ్రీలంక, మాల్దీవులు క్రమంగా చైనాతో స్నేహం  ప్రారంభించి ప్రయోజనాలు పొందుతున్నాయి.. భూటాన్ విషయంలోనూ మన ప్రభుత్వం ఇటీవల తప్పు చేస్తోంది.. ఇదే విధానం కొనసాగితే భవిష్యత్తుల్లో దేశ సరిహద్దులు మరింత ప్రమాదంలో పడతాయి.. ఇప్పటికైనా భారత విదేశాంగ విధానంలో మార్పు రావాలి..


Wednesday, August 28, 2013

Monday, August 26, 2013

హైదరాబాద్ ఎవరిది?

నాకు దక్కనిది మరొకరికి దక్కకూడనే ఆలోచనా విధానాన్ని ఎలా అర్థం చేసుకోవాలి?.. ఇది ఉన్మాద మనస్థత్వం కాదా?.. రాష్ట్ర విభజన జరిగితే హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉండాలని కొందరు, కేంద్ర పాలిత ప్రాంతంగా ఉండాలని మరి కొందరు వాదిస్తున్నారు.. అసలు హైదరాబాద్ నగరాన్ని తామే అభివృద్ధి చేశామని, ఈ నగరంపై తమకూ హక్కు ఉందని లా పాయింట్ లేవనెత్తుతున్నారు.. తెలంగాణకు ఎంత హక్కు ఉందో తమకూ అంతే హక్కు ఉందని అంటున్నారు..
హైదరాబాద్ ఎవరిది అనే వాదనల్లో కొన్ని చాలా విచిత్రంగా కనిపిస్తున్నాయి.. ఈ మహానగర చరిత్ర తెలిసిన వారెవరూ ఇలా మూర్ఖంగా మాట్లాడరు.. సరిగ్గా 422 సంవత్సరాల క్రితం (1591లో) నిర్మించిన నగరమిది.. కుతుబ్ షాహీలు, అసఫ్ జాహీలు (నిజాంలు) హైదరాబాద్ కేంద్రంగా తమ సామ్రాజ్యాలను నడిపించారు.. 1948లో హైదరాబాద్ భారత దేశంలో విలీనం అయ్యే నాటికి దేశంలోనేని ప్రముఖ నగరాల్లో ఒకటి.. గోల్కొండ, చార్మినార్ లాంటి ప్రఖ్యాత కట్టడాలతో ప్రపంచ ఖ్యాతి పొందిన చారిత్రిక నగరమిది.. భిన్న సంస్కృతులు, జాతులు, మతాలు, భాషల ప్రజలు హైదరాబాద్ లో స్థిరపడ్డారు. నిజాం పాలన అంతం తర్వాత 8 ఏళ్లపాటు హైదరాబాద్ ప్రత్యేక రాష్ట్రంగా(తెలంగాణ, మరాఠ్వాడ, హై.కర్ణాటక) కొనసాగింది..1956లో ఎలాంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ అవతరించిందో అందరికీ తెలుసు.. (మద్రాసు, కర్నూలు భంగపాట్లు) కనుక చరిత్ర లోతుల్లోకి వెళ్లదలుకోలేదు.. సొంత రాజధాని ఏర్పాటు చేసుకోలేని పరిస్థితుల్లో ఆంధ్ర రాష్ట్ర నేతలు కేవలం హైదరాబాద్ నగరం కోసమే భాషాప్రయుక్త రాష్ట్రాల వాదన తెర పైకి తెచ్చి తెలంగాణను కలుపుకొని ఆంద్రప్రదేశ్ ఏర్పాటు చేశారు (ఆంధ్ర రాష్ట్ర అసెంబ్లీలో బెజవాడ గోపాలరెడ్డి, నీలం సంజీవరెడ్డి ప్రసంగాల రికార్డులను పరిశీలించండి)..
హైదరాబాద్ రాష్ట్ర రాజధాని కాబట్టే సహజంగా అన్ని ప్రాంతాల వారు ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం ఇక్కడకు వచ్చారు.. ఇందులో ఎవరినీ తప్పు పట్టాల్సిన అవసరం లేదు.. కానీ కొందరు సీమాంధ్ర నేతలు తామే హైదరాబాద్ నగరాన్ని అభివృద్ది చేశామని ప్రగల్భాలు పలకడం ఎందుకు? తొండటు గుడ్లు పెట్టడానికి కూడా ఇష్టపడని నగరాన్ని అంతర్జాతీయ నగరంగా మార్చామని, రాళ్ల హైదరాబాద్ను రతనాల హైదరాబాద్గా మార్చామని రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఎందుకు చేస్తారు? ఆంధ్రప్రదేశ్ రాజధానిగా మారకముందే అన్ని శాసనసభ, సచివాలయం తదితర మౌళిక సదుపాయాలు హైదరాబాద్ నగరంలో అందుబాటులో ఉన్నాయి.. హైదరాబాద్ భౌగోళికంగా దేశం నడిబొడ్డున ఉంది.. ఇక్కడ వాతావరణం సమశీతోష్ణ స్థితిలో ఉంటుంది.. ఈ కారణంగానే రక్షణ రంగంతో సహా ఎన్నో కేంద్ర ప్రభుత్వం సంస్థలు హైదరాబాద్ ను తమ కీలక స్థావరంగా మలచుకొన్నాయి.. ఇది సీమాంధ్ర నాయకుల కృషి అని ప్రచారం చేసుకోవడం హస్యాస్పదం.. ఇక్కడ అర్థం కాని విషయం ఒకటి ఉంది.. 1956 నాటికే హైదరాబాద్ దేశంలో 5వ పెద్ద నగరంగా ఉంది.. ఇప్పటికీ అదే స్థానంలో ఉంది.. హైదరాబాద్ నగర అభివృద్ధి తమ ఘనతే అని డబ్బా కొట్టుకునే నాయకులు దీన్ని కనీసం2,3,4 స్థానాలకైనా తీసుకెళ్ల గలిగారా? దేశంలోని అన్నిప్రముఖ నగరాలతో సమానంగానే ఇక్కడ అభివృద్ధి సాధిస్తూ వచ్చింది కదా? నగరంలో ఇబ్బడి ముబ్బడిగా జనాభా, కాలుష్యం పెంచడం.. చెరవులు, ఖాళీ స్థలాలను మింగేయడం.. హైటెక్ సిటీ, ఫ్లయ్ ఓవర్లు కట్టడం, నేతాజీలు ఇబ్బడి ముబ్బడిగా ఇక్కడ ఆస్తులు పెంచుకోవడం మాత్రమే అభివృద్ధికి కొలమానాలా?..
భౌగోళికంగా సీమాంధ్ర ప్రాంతానికి ఏ దారిలో చూసినా 200 కిలో మీటర్ల దూరంలో ఉంటుంది.. ఎటు నుండి చూసినా రెండు, మూడు తెలంగాణ జిల్లాలు అడ్డుగా ఉంటాయి.. ఈ పరిస్థితుల్లో హైదరాబాద్ శాశ్వత ఉమ్మడి రాజధానిగా ఉండటం సాధ్యమేనా? ఇది సాధ్యం కాదని తెలిసే సీమాంధ్ర నాయకులు కేంద్ర పాలిత ప్రాంత వాదనను తెరపైకి తెచ్చారు.. కేంద్ర పాలిత ప్రాంతం అంటే ఇక్కడ ప్రజాప్రతినిధుల పాత్ర తగ్గిపోతుంది.. ఇదేం కుట్ర?  హైదరాబాద్ నగరానికి తాగునీరు, విద్యుత్తు, చివరకు పాలు, కూరగాయల లాంటి నిత్యావసరాలు ఈ జిల్లాల నుండే రావాలి.. హైదరాబాద్ నగరపాలక సంస్థ ఇప్పడు గ్రేటర్ గా అవతరించి ఇతర తెలంగాణ జిల్లాలైన రంగారెడ్డి, మెదక్ సరిహద్దులకు విస్తరించింది.. నిజానికి పరిశ్రమలన్నీ ఈ జిల్లాల్లోనే ఉన్నాయి.. ఇలాంటి పరిస్థితుల్లో హైదరాబాద్ నగరాన్ని విడదీయడం సాధ్యమేనా? ఏరకంగా చూసినా హైదరాబాద్ చారిత్రకంగా, సాంస్కృతికంగా తెలంగాణ ప్రాంతానికి గుండెకాయ లాంటిది.. 57 సంవత్సరాల అనుబంధంతో హైదరాబాద్ మాదని వాదిస్తూ, 422 సంవత్సరాల అనుబంధం ఉన్న తెలంగాణ ప్రజలకు ఈ నగరాన్ని దూరం చేయడం న్యాయమా? ఈ మహానగరం తమకు దక్కే అవకాశం లేదు కాబట్టి తెలంగాణకు కూడా దూరం చేయాలనే శాడిజమే ఇందులో కనిపిస్తోంది.. అంటే తాను పెళ్లి చేసుకునే అవకాశం లేని అమ్మాయిపై యాసిడ్ పోయడం లాంటి వికృత ఆనందం అన్నమాట..
హైదరాబాద్ దూరమైతే నింగి విరిగి నేల మీద పడుతుందా? భూగోళం బద్దలౌతుందా? తెలుగు వారికి రెండు రాష్ట్రాలు, రెండు రాజధానులు ఉంటే ఎవరికి నష్టం? తెలంగాణ వాసులు స్వపరిపాలన కోరుకోవడం నేరమా? రాష్ట్ర విభజన వల్ల సీమాంధ్ర విద్యార్థులకు, నిరుద్యోగులకు ఎలా నష్టమో చెప్పగలరా? సీమాంధ్రకు కొత్త రాజధాని వస్తే ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు ఆ ప్రాంతం మరింతగా అభివృద్ది చెందుతుందనేది వాస్తవం కాదా? శరవేగంగా మారిపోతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వ ఉద్యోగాల పాత్ర క్రమంగా తగ్గిపోతోంది.. ప్రయివేటు రంగంలోనే ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.. ప్రయివేటు ఉద్యోగాలకు ప్రాంతాలతో సంబంధం ఉండదు.. బతుకు తెరువు కోసం ఎవరు ఎక్కడికైనా పోయి పని చేసుకోవచ్చు.. ఈ అంశాన్ని ప్రజలకు అర్థమయ్యేలా ఎందుకు చెప్పడం లేదు?
హైదరాబాద్ నగరంలో అన్ని ప్రాంతాల ప్రజలు నివసిస్తున్నారు.. చాలా కాలంగా వారి మధ్య సామరస్యపూర్వక వాతావరణం ఉంది.. ఇక్కడ అందరికీ జీవించే హక్కు ఉంది.. రాజకీయ నాయకులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం ఇంకా సమైక్యాంధ్ర పేరిట ఇరు ప్రాంతాల ప్రజల్లో అనవసర అపోహలు సృష్టిస్తూ, సామరస్యపూర్వక వాతావరణాన్ని దెబ్బతీస్తున్నారు.. రాజకీయ పార్టీలు రెండు నాల్కల ధోరణితో ఓటు బ్యాంకు రాజకీయాలు నడుపుతున్నాయి.. సీమాంధ్ర ప్రజలైనా, తెలంగాణ ప్రజలైనా ఇలాంటి స్వార్థ నాయకుల మాటలు నమ్మకుండా సామరస్యతను కాపాడుకోవాలి..

Sunday, August 18, 2013

ఒమర్జీ సమాధానం మీ దగ్గరే ఉంది..

కాశ్మీరీలను భారత దేశంలో భాగంగా ఎందుకు చూడటంలోదే చెప్పాలని డిమాండ్ చేశారు జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా.. దేశ ప్రధాన స్రవంతి నుండి కాశ్మీర్ ను విడిగా చూడటాన్ని తాను ఎన్నోసార్లు ప్రశ్నించానని, దానికి సమాధానం తెలుసుకోవడం కష్టంగా ఉందని వాపోయారాయన.. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఒమర్ అబ్దుల్లా వేసిన అమాయక(?) ప్రశ్న ఇది..
ఒమర్ అబ్దుల్లా ఈ ప్రశ్నను తన తాత షేక్ అబ్దుల్లాను(జమ్మూ కాశ్మీర్ తొలి సీఎం) అడిగి ఉంటే భాగుండేది.. ప్రస్తుతం ఆయన లేరు కనక, కనీసం తండ్రి ఫరూఖ్ అబ్దుల్లాను(మాజీ సీఎం) అయినా అడగాల్సింది.. అసలు కాశ్మీర్ ఈ దేశంలో అంతర్భాగం కాదనే భావన అక్కడి ప్రజల్లో ఎందుకు కలిగింది?.. దీనికి కారణం కాశ్మీరీ నాయకులు, అక్కడి వేర్పాటువాద శక్తులు కాదా? ఆ రాష్ట్రాన్ని ఏళ్ల తరుబడి పాలించిన అబ్దుల్లాల కుటుంబానికి ఈ విషయంలో సంబంధం లేదా?
ఈ ప్రశ్నలకు మూలాలన్నీ భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 370లోనే ఉన్నాయి.. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం భారత దేశంలో వినీనం అయ్యే సందర్భంలో కుదిరిన ఒప్పందం ప్రకారం ఆ రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తూ  భారత రాజ్యాంగంలో 370వ అధికరణ  చేర్చారు.. వాస్తవానికి ఈ అధికరణ తత్కాలికమే అయినా, ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ అధికరణను అడ్డు పెట్టుకొనే తాము మిగతా భారత దేశ రాష్ట్రాలకు భిన్నం అని వాదిస్తుంటారు అక్కడి నేతలు.. ఆర్టికల్ 370 ప్రకారం భారత దేశంలోని ఇతర రాష్ట్రాల వారు స్థిరాస్థుల క్రయవిక్రయాలు జరపరాదు. ఇక్కడి భూములపై వేరే ప్రాంతాల వారికి హక్కులు కల్పించరాదు. కానీ పాకిస్తాన్ ఆక్రమితక కాశ్మీర్ వాసులకు మాత్రం ఇలాంటి నిబంధనలు లేదు.. కాశ్మీరీలు మాత్రం భారత దేశంలో ఎక్కడైనా స్థిరాస్తులు కొనుగోలు చేయవచ్చు..  ఇలాంటి అడ్డగోలు నిబంధనలను అడ్డం పెట్టుకొని వేర్పాటు వాద నాయకులు 1953 నాటి పూర్వ స్థితిని పునరుద్దరించాలని డిమాండ్ చేస్తున్నారు..  దీని ప్రకారం భారత దేశం తరహాలోనే కాశ్మీర్ కు కూడా ప్రధాని పదవి ఉంటుంది.. భారత జాతీయ పతాకం మాదిరే కాశ్మీర్ కు ప్రత్యేక పతాకం ఉంటుంది..
ఆర్టికల్ 370కి వ్యతిరేకంగా 1953లో జనసంఘ్ (బీజేపీ పూర్వ నామం) అధ్యక్షడు డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ సత్యాగ్రహం చేసేందుకు కాశ్మీర్ వెళ్లగా, షేక్ అబ్దుల్లా ప్రభుత్వం అరెస్టు చేసింది.. అక్కడి జైలులోనే ఆయన అనుమానాస్పద స్థితిలో మరణించారు.. కానీ 370 నిబంధన మాత్రం కొనసాగుతూనే ఉంది..
కాశ్మీర్ వేర్పాటు వాద నాయకులు తాము ప్రత్యేక దేశ హోదా కోసం, పాకిస్తాన్తో విలీనం కోసం ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు.. వీరికి వంత పాడే రీతిలో ఇప్పడు అధికారంలో ఉన్న నేషనల్ కాన్ఫరెన్స్ (అబ్దుల్లా పార్టీ) మరింత ప్రత్యేక ప్రతిపత్తి పేరిట కేంద్ర ప్రభుత్వంపై వత్తిడి తెస్తోంది.. ఆనాటి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ మిత్రుడైన షేక్ అబ్దుల్లాకు దొడ్డి దారిలో కట్టబెట్టిన అధికారం ప్రజాస్వామ్యం ముసుగులో అవిచ్ఛిన్నంగా కొనసాగుతోంది.. 1947లో పాకిస్తాన్ స్వాధీనం చేసుకున్న భూభాగం (పీవోకే) తిరిగి స్వాధీనం చేసుకునే మాట దేవుడెరుగు, పాకిస్తాన్ ప్రేరిత ఉగ్రవాదాన్ని రూపు మాపేందుకు షేక్ అబ్దుల్లా, ఆయన తనయుడు ఫరూఖ్ అబ్దుల్లా, మనవడు(ప్రస్తుత సీఎం) చేసిందేమీ లేదు..
వేర్పాటు వాదులు కాశ్మీర్ లోయలో కాశ్మీరీ పండిట్ (హిందువులు)లపై అత్యాచారాలు చేసినా, వారి ఆస్తులను స్వాధీనం చేసుకొని తరిమేసినా నోరు మెదపలేదు.. వారి రక్షణ కోసం ఎలాంటి చర్యలు తీసుకోలేదు.. ఈనాటికీ లోయ నుండి తరిమేయ బడిన లక్షలాది మంది పండిట్లు జమ్మూ, ఢిల్లీల్లో జీవచ్చవాలుగా బతుకుతున్నారు.. వారి సమస్యను ఇటు కేంద్ర ప్రభుత్వం, అటు రాష్ట్ర ప్రభుత్వ పట్టించుకోదు..
ఇప్పడు చెప్పండి ఒమర్ అబ్దుల్లాజీ మీరు అడుగుతున్నప్రశ్నలకు జవాబు ఎవరు చెప్పాలి?..

Saturday, August 17, 2013

వీరేనా మన నాయకులు?..

ఏ దేశానికైనా ఆర్థిక, రక్షణ రంగాలు అత్యంత కీలకం.. ఈ రెండూ నిర్వీర్యమైపోతే.. పరిస్థితి ఏమిటో ఊహించారా?... ఆ దేశం పతనం కావడం ఖాయం..
ఇది మరే దేశం సమస్యో కాదు.. 67 ఏళ్ల స్వతంత్ర  భారత దేశం ఇప్పడు ఎదుర్కొంటున్న పరిస్థితి ఇది.. రూపాయి విలువ గతంలో ఎన్నడూ లేనంత రికార్డు స్థాయికి పడిపోయింది. అమెరికన్ డాలర్తో మారకం విలువ రూ.62.03 అయ్యింది.. దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పుడు సరి సమానంగా ఉన్న డాలర్-రూపాయిల మధ్య క్రమంగా వచ్చిన గ్యాప్ ఇప్పడు ఇంత వరకూ వచ్చింది.. ఆర్థిక పరిస్థితి త్వరలో గాడిలో పడుతుందని ప్రధాని మన్మోహన్ సింగ్ అధికారంలోకి వచ్చింది మొదలు గత 9 ఏళ్లుగా చెబుతూనే ఉన్నారు.. అందుకు విరుద్దంగా దిగజారుతూనే వస్తోంది.. భారత దేశం పరువు గంగలో కలుస్తోంది..
ఈ దేశంలో ప్రపంచ స్థాయి ఆర్థిక వేత్తలకు కొదవలేదు.. ప్రధాని మన్మోహన్, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు మాంటెక్ సింగ్ అహ్లూవాలియా, రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ రంగరాజన్, ప్రస్తుత ఆర్థిక మంత్రి చిదంబరం.. అసలు వీరంతా భారత దేశాన్ని ఏం చేద్దామనుకుంటున్నారో అర్థం కావడం లేదు.. దివాళా అంచుకు తీసుకెళ్లి ఏ దేశాన్నికి తాకట్టు పడతారోనని భయమేస్తోంది.. రూ.27 సంపాదించిన వాడు పేదరికంలోంచి బయట పడ్డట్లేనని ప్రకటించినప్పుడే ఈ ఆర్థికవేత్తల మానసిక స్థితిపై అనుమానం వేసింది.. కెన్యాలో బస్తాడు కరెన్సీ నోట్లు తీసుకెళితే గానీ బ్రెడ్డు ముక్క రాదట.. రేపు మన రూపాయి పరిస్థితి కూడా అలాగే అవుతుందని భయమేస్తోంది..
ఇక దేశ భద్రత విషయానికి వద్దాం.. సరిహద్దులో పాకిస్తాన్ సైన్యం మన సైనికులకు చంపేసి పోతున్నా ఏం చేయలేని స్థితికి దిగజారింది మన ప్రభుత్వం.. భారత సరిహద్దుల్లో అనునిత్యం పాకిస్తాన్ కాల్పులతో కవ్వింపు చర్యలకు పాల్పడి, ఉగ్రవాదులను మన దేశంలోకి చొప్పిస్తున్నా సోయి లేకుండా వ్యవహరిస్తున్నారు మన దేశ పెద్దలు.. అటు చైనా కూడా తరచూ కాలు దువ్వుతూనే ఉంది.. లడక్, అరుణాచల్ లోకి పదే పదే చైనా సైన్యం చొరబడుతున్నా దిక్కు తోచని విధంగా వ్యవహరిస్తోంది మన్మోహన్ ప్రభుత్వం.. ఎక్కడైనా తప్పు చేసినోడే భయపడతాడు.. కానీ యూపీఏ ప్రభుత్వం పొరుగు దేశాలు రెచ్చిపోతున్నా వారిని చూసీ చూడనట్లు వదిలేయడంలోని ఆంతర్యం ఏమిటి?..
పాకిస్తాన్, చైనాలకు గట్టి బుద్ది చెప్పలేనంతగా దిగజారిపోయామా మనం?.. న్యాయం మన వైపు ఉన్నప్పుడు భయం ఎందుకు.. ప్రధాని మన్మోహన్, రక్షణ మంత్రి ఆంటోనీలకు ప్రతి విషయం చర్చలతో పరిష్కరించుకుంటామనడం ఊత పదంగా మారిపోయింది.. దేశ ప్రజలు వీరి చేతగానితనాన్ని చూసి అసహ్యించుకుంటున్నారు..
స్వాతంత్ర్య దినోత్సవం నాడు ప్రధాని మన్మోహన్ ఎర్రకోట నుండి జాతిని ఉద్దేశించి ఏం మాట్లాడారో ఓ సారి గుర్తు చేసుకోండి.. పాకిస్తాన్తో సమస్యలు ఉన్నాయట.. అవేమిటో చేప్పే ధైర్యం లేదా? దేశ ప్రజలకు స్పూర్తి దాయకమైన సందేశాన్ని ఇవ్వాల్సిన పెద్ద మనిషి అశ్వద్ధామ హత: కుంజర అన్నట్లు మాట్లాడితే ఏమనాలి? పాకిస్తాన్, చైనా 1,15,600 చ.కి.మీ భూభాగాన్ని మన దేశం నుండి ఆక్రమించుకున్నాయి.. ప్రస్తుత యూపీఏ సర్కారు ఈ భూభాగాన్ని తిరిగి సాధించుకునే దిశగా ఎలాంటి ప్రయత్నాలు చేయడం లేదు.. కనీసం ఉన్న భూభాగాలైనా కాపాడితే అదే పది వేలు..

Thursday, August 15, 2013


1947 ఆగస్టు 15 అర్థరాత్రి..

మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన రోజు మాత్రమే కాదు.. దేశం నిలువునా చీలిన రోజు కూడా..
ఒకవైపు దేశ ప్రజలంతా త్రివర్ణ పతాకాలు ఎగురేసి, మిఠాయిలు పంచుకొని సంబరాలు చేసుకుంటున్న వేళ.. మరోవైపు సరిహద్దుకు ఆవల కోట్లాది జనం అర్ధరాత్రే పరాయి దేశస్తులైపోయారు.. రెండు వైపులా అమాయకుల రక్తం చిందింది.. ఎందరో అభాగ్యుల మాన, ప్రాణాలు పోయాయి.. మరెంతో మంది అనాధలైపోయారు.. లక్షలాది మంది ఆస్తులు పోగొట్టుకొని కట్టుబట్టలతో తరలి వచ్చేశారు..
బ్రిటిష్ వారు పోతూ, పోతూ భారత దేశాన్ని ఇండియా, పాకిస్తాన్ (పశ్చిమ, తూర్పు) అంటూ మూడు ముక్కలు చేసేశారు.. మహ్మద్ అలీ జిన్నా ద్విజాతి సిద్ధాంతం తెచ్చిన తప్పిదం ఇది అంటారు మన నాయకులు.. కానీ ఆ పాపంలో తమకూ భాగస్వామ్యం ఉందనే మాటను మాత్రం మరిచారు..
అప్పటి వరకూ స్వాతంత్ర్యం కోసం పోరాడిన అనాటి వృద్ధ నాయకత్వానికి ఇదేమీ పట్టలేదు.. దేశ విభజనను ఆపేందుకు చివరి దాకా ప్రయత్నించామని చెబుతారు.. కానీ వాస్తవాలు వేరు.. మరి కొంత కాలం పోరాడే ఓపిక లేదు.. తమ జీవిత చరమాంకంలో అయినా పదవులు అనుభవిద్దామనే తాపత్రం ఆనాటి మెజారిటీ నాయకుల్లో ఉండేది.. ఈ కారణం వల్లే దేశ విభజనను ఇష్టంగానో, అయిష్టంగానో ఒప్పేసుకున్నారు..
చరిత్రలోకి ఒక్కసారి తొంగి చూస్తే ఎన్నో విశాద సంఘటనలు కనిపిస్తాయి.. చరిత్ర నుండి గుణ పాఠాలు నేర్చుకోవాల్సిన మన నాయక గణం ఆ తర్వాత కాలంలో కూడా ఈ విభజన చరిత్రను కొనసాగించింది.. కాశ్మీర్లో మూడో వంతు పాకిస్తాన్ కబ్జాలోకి పోయింది.. లడాక్, అరుణాచల్ ప్రదేశ్ ప్రదేశ్ తమ వంటూ చైనా క్లెయిమ్ చేస్తోంది. .టిబెట్ ను చైనా అక్రమించినప్పుడే మనం గట్టిగా వ్యతిరేకించి ఉంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేదా? కచ్చతీవులను శ్రీలంకకు, తీన్ బిగాను బంగ్లాదేశ్ కి ఉదారంగా ఇచ్చేసింది మన ప్రభుత్వం.. పొరుగు దేశాలు మన దేశంలో అస్థిరత్వాన్ని సృష్టిస్తున్నా నాయక శ్రేణుల మొద్దు నిద్ర నటిస్తున్నాయి.. దేశ ఏమైతేనేం వారికి కావాల్సింది అధికారం..
ఇదేనా మన స్వాతంత్ర్యానికి అర్థం.. ఒకనాటి విశాల భారత దేశం క్రమంగా ముక్కలు చెక్కలు అవుతూ వచ్చినా మనకు పట్టదా.. మనం కోల్పోయిన భూభాగాలను సాధించుకోలేమా? తిరిగి అఖండ భారత దేశాన్ని నిర్మించలేమా? చరిత్ర ఎప్పుడూ ఒకేలా ఉండదు.. ప్రయత్నిస్తే సాధ్యం కానిదేమీ లేదు.. ఒక్కసారి ఆలోచించండి..
జై హింద్..


Sunday, August 11, 2013

తెలంగాణ, సీమాంధ్ర రెండూ అభివృద్ధి చెందాలి..

తెలంగాణ, సీమాంధ్ర రెండు రాష్ట్రాలు అభివృద్ధి చెందాలి.. సీమాంధ్రలో నూతన రాజధాని హైదరాబాద్ ను మించిన అభివృద్ధి సాధించగలదు.. ఈ రెండూ గుజరాత్ కన్నా ఎక్కువ అభివృద్ధి సాధించగలవు.. ఇరు ప్రాంతాల వారు అన్నదమ్ముల్లా కలిసి తమ ప్రాంతాలను అభివృద్ది చేసుకోవాలి.. ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల నుండి రాష్ట్ర ప్రజలు బయటకు రావాలని మనసారా కోరుకుంటున్నారు.. నాకు తెలంగాణ ఎంత ముఖ్యమో, సీమాంధ్ర కూడా అంతే ముఖ్యం.. కాంగ్రెస్ మాయలో పడి ఇరు ప్రాంతాల ప్రజలు ఘర్షణకు దిగరాదు.. ఒకరినొకరు నిందించుకునే పరిస్థితిని కాంగ్రెస్ పార్టీ కలిపించింది.. 2004లోనే తెలంగాణ ప్రక్రియను ఎందుకు ప్రారంభించలేదు.. ఓట్ల కోసం విభజించు పాలించు అనే విధానంలో భాగంగానే కాంగ్రెస్ తెలంగాణ ప్రక్రియను ఆలస్యంగా ప్రారంభించడం వల్లే సమస్యలు వచ్చాయి..  కాంగ్రెస్ పార్టీకి సద్బుద్ది కలగాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నాను..
(హైదరాబాద్ ఎల్ బి స్టేడియంలో జరిగిన నవభారత యువభేరీ సభలో గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ ప్రసంగంలోని ఓ భాగమిది)

Saturday, August 10, 2013

పరిణతి చెందిన నాయకత్వమేనా ఇది?..

ఈ రాష్ట్రంలో పరిణతి చెందిన నాయకత్వ లోపం స్పష్టంగా కనిపిస్తోంది.. ఎవరికీ విశాల దృక్పథం లేకుండా పోయింది.. ప్రత్యేక రాష్ట్రం కావాలని తెలంగాణ వాదులు కోరుకోవడం ఎంత సహజమో, రాష్ట్రం ఒకటిగా ఉండాలని సమైక్యవాదులు కోరుకోవడం అంతే సహజం.. ఎవరి కారణాలు వారి ఉన్నాయి.. ఇరు ప్రాంతాల రాజకీయ నాయకులు, ప్రజలు నిలువునా చీలిపోయారు..
పరిస్థితులను మొత్తం మీద బేరీజు వేస్తే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయక తప్పని పరిస్థితి ఏర్పడింది.. ఐదు దశాబ్దాలుగా రగుతున్న సమస్యను ఇంకా ఏమాత్రం వాయిదా వేయలేని స్థితి వచ్చేసింది.. సహజంగానే రాష్ట్ర విభజన అన్నప్పడు రాజధాని, వనరులు, ఆస్తులు, అప్పులు తదితర పంపకాలు సహజం.. ఒక హైదరాబాద్ విషయమే కాదు, చాలా విషయాల్లో అంతిమ పరిష్కారం చూపాల్సిన అవసరం ఉంది.. రాజకీయ పార్టీలు నాయకులు, కార్యకర్తలు తమ ప్రాంతాల ప్రజల ఆకాంక్షలు, వత్తిళ్ల మేరకు తెలంగాణ, సమైక్యాంధ్రల పేరిట విడిపోయి తగాదాలకు దిగడాన్ని తప్పు పట్టలేం.. పీత కష్టాలు పీతవి అన్నట్లు వారి సమస్యలు వారికి ఉన్నాయి..
ఇలాంటి పరిస్థితిలో ప్రధాన పార్టీల అధినాయకులు ఏమి చేయాలి?.. అందరి ప్రయోజనాలు కాపాడే పరిష్కారం దిశగా ఆలోచించాలి. తమ కేడర్ ను ఒప్పించి, మెప్పించే విషయంలో దృష్టి పెట్టాలి.. కానీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి(కాంగ్రెస్) ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు(తెలుగుదేశం) చేస్తున్న పనేమిటి?.. వారు విశాల ప్రయోజనాలను మరచిపోయి ప్రాంతీయ కోణంలో ఆలోచించే దుస్థితికి వెళ్లిపోయారు.. వారి రహస్య ఎజెండాను ఇప్పుడు చాలా స్పష్టంగా బయట పెట్టుకున్నారు..
తెలంగాణ ఏర్పడితే సీమాంధ్రకు ఎదురయ్యే కష్ట నష్టాలను ఏ విధంగా ఎదుర్కోవానే విషయంలో పరిష్కార మార్గాన్ని చూపాల్సిన నాయకులే ఇప్పడు ప్రత్యేక రాష్ట్రం ఏర్పడకుండా అడ్డు తగిలే ప్రయత్నాలు చేయడం దారుణం.. రాష్ట్ర విభజన సమయంలో పెద్ద మనిషి పాత్రలో హుందాగా నిర్ణయాలు తీసుకోవాల్సిన సీఎం కిరణ్ కుమార్, తమ పార్టీ నాయకత్వ అభిమతానికే వ్యతిరేకంగా ప్రాంతీయ దృక్ఫథంతో మాట్లాడిన తీరు ఆశ్చర్యం కలిగించింది.. పైగా ఆయన మాట్లాడిని విషయాల్లో చాలా వరకు అవాస్తవాలే ఉన్నాయి..
కాంగ్రెస్ అధిష్టానం రాష్ట్ర విభజన ప్రకటన చేయగానే టీడీపీ అధినేత చంద్రబాబు చాలా హుందాగా స్పందించారు.. సీమాంధ్ర రాజధాని ఏర్పాటు కోసం ప్రకటించిన దానికన్నా రెండు మూడు రెట్లు అధికంగా ఇవ్వాలని డిమాండ్ చేయడంలో ఎలాంటి తప్పులేదు.. కానీ సీమాంధ్ర ప్రయోజనాల ముసుగులో తెలంగాణ రాష్ట్రాన్ని అడ్డుకునే పనులకు ఆజ్యం పోయడం దారుణం.. చంద్రబాబు ఒకవైపు తెలంగాణకు కట్టుబడి ఉన్నామని స్పష్టంగా చెబుతుంటే, ఆ పార్టీ సీమాంధ్ర ఎంపీలు పార్లమెంటులో సమైక్యాంధ్ర నినాదాలు చేయడం, సీమాంధ్ర ఎమ్మెల్యేలు, నాయకులు తమ జిల్లాల్లో తెలంగాణ వ్యతిరేక ప్రదర్శనలు జరడం వెనుక ఆంతర్యం ఏమిటి? ఈ ద్వంద్వ వైఖరిని కప్పి పుచ్చుకోవడానికా అన్నట్లు స్వయంగా చంద్రబాబు ప్రధాన మంత్రికి రాసిన లేఖలోని అంశాలు ఆయన అంతర్ముఖానికి, ద్వంద్వ విధానాలకు అద్దం పడుతున్నాయి..
భగవంతుడా.. ఈ ఇద్దరు అధినాయకులకు పరిణతిని, విశాల దృక్పథాన్ని ప్రదర్శించే సద్బుద్ధి ఇవ్వాలని, ఇరు ప్రాంతాల ప్రయోజనాలను కాపాడబడాలని కోరుకుంటున్నాను..

Friday, August 9, 2013

సీఎం..ఆంధ్ర ప్రదేశ్ కా? సీమాంధ్రకా?

నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అన్న నా భ్రమ తొలగిపోయింది.. వారు సీమాంధ్రకు వకాలతు పుచ్చుకున్న ప్రతినిధి అని తేలిపోయింది..
ముఖ్యమంత్రిగారు సమైక్యాంధ్ర పేరిట తెలంగాణ వాదంపై విషయం కక్కడం ఆశ్చర్యమనిపించలేదు.. ఎందుకం
టే ఆయన మొదటి నుండి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకిస్తూనే ఉన్నారు.. తెలంగాణ వస్తే నక్సలిజం సమస్య మొదటికొస్తుందని సోనియాగాంధీ, కాంగ్రెస్ అధిష్టానం దగ్గర వాదించారు.
కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణ ఇచ్చేయాలని స్పష్టమైన నిర్ణయం తీసుకున్నాక 9 రోజులు మీడియా ముందుకు, ప్రజల ముందుకు రాలేదు.. గురువారం రాత్రి మీడియా ముందు మట్లాడిన తీరు ఆశ్చర్యాన్ని కలిగించింది.. ఎందుకంటే అందులో చాలా వరకు వాస్తవ దూరమైన (అబద్దాలు అనడం అన్ పార్లమెంటరీ కదా..) అంశాలే..
సీఎం గారు మీడియా ముందు మట్లాడిన ఉదయమే తిరుపతిలో ఆయన మద్దతు దార్లు డాన్సులు చేసి పండుగ చేసుకోవడం టీవీల్లో చూశాను.. సీమాంధ్ర సింహం, సమైక్యాంధ్ర పరిరక్షకుడని కిరణ్ గారికి బిరుదులు కూడా తగిలించారు.. దీని భావమేమిటి తిరుమలేశా..రాష్ట్ర విభజన సమయంలో ఇరుపక్షాల మధ్య సంధానకర్తగా, హుందాగా వ్యవహరించాల్సిన సీఎం గారు ఏకపక్షంగా తెలంగాణనే వ్యతిరేకిస్తున్నారు..
కాంగ్రెస్ పార్టీ సభ్యుడైన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు సొంత అధిష్టానం నిర్ణయాన్నే వ్యతిరేకిస్తున్నారు.. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటారు.. లగడపాటి గారి ఈ స్టార్ బ్యాట్స్ మాన్ పోరాటం తెలంగాణపైనా? కాంగ్రెస్ అధినేత్రిపైనా?

Thursday, August 8, 2013

అర్థంలేని ఆందోళనలూ, అపోహలూ..

తెలంగాణ వస్తే ఆంధ్రా, రాయలసీమ జనం తట్టా బుట్టా బిస్తరు సర్దుకొని వెళ్లిపోవాలా?.. సీమాంధ్ర ఉద్యోగులను హైదరాబాద్ నుండి పంపేస్తారా?..
ఈ తరహా ప్రచారం ఉభయ ప్రాంతాల ప్రజల్లోనూ అపోహలు పెంచుతున్నాయి.. రాష్ట్ర విభజన సమస్యను కొందరు దేశ విభజన మాదిరి ప్రచారం చేస్తున్నారు.. తెలంగాణ, సీమాంధ్ర రాష్ట్రాలు ఏర్పడ్డా రెండూ భారత దేశంలో ఉంటాయి.. భారత రాజ్యంగానికి లోబడే ఉంటాయి.. రాజ్యాంగం ఇచ్చిన స్వేచ్ఛ, స్వాతంత్ర్యం, హక్కులూ, విధులూ అన్ని ప్రాంతాలకు వర్తిస్తాయి.. ఉన్న ఫలానా వెళ్లిపొమ్మని పంపేయడానికి చట్టాలు అంగీకరించవు..
కొందరు రాజకీయ నాయకులు తిన్నది అరగక, స్వలాభాల కోసం చేసే రెచ్చగొట్టే ప్రకటనలు ఉభయ ప్రాంతాల్లోనూ ఉద్రిక్తతలను సృష్టిస్తున్నాయి.. ప్రతి చిన్న విషయానికి మేమున్నామంటూ ఆర్భాటం చేసే మేధావి వర్గాలు ఈ సమస్య పరిష్కారానికి, ఉద్రిక్తలను తగ్గించడానికి ముందుకు రాకపోవడం బాధాకరం..
తెలంగాణ ఏర్పడితే సీమాంధ్ర ఉద్యోగులు స్వప్రాంతానికి వచ్చేస్తే, తమకు కొత్తగా ఉద్యోగాలు రావని ఆంధ్రా, రాయలసీమ ప్రాంతాల నిరుద్యోగులు, విద్యార్థులు ఆందోళన పడుతున్నారు.. ఇప్పడున్న ఉద్యోగులు 10-15 ఏళ్లలో రిటైరైపోయి ఖాళీలు భర్తీ చేసే అవకాశం ఉన్నా తమ వయోపరిమితి (ఏజ్ బార్) దాటిపోతుందని వారి భయం.. ఇది అర్థం చేసేకోదగ్గదే అయినా పూర్తిగా వాస్తవం కాదు..
తెలంగాణ వస్తే తాము స్వస్థలాలకు వెళ్లకుండా హైదరాబాద్ లోనే ఉద్యోగాలు చేసుకునే అవకాశం ఇవ్వాలని సీమాంధ్ర ఉద్యోగుల డిమాండ్.. ఉన్నపళాన పోతే తమ పిల్లల చదువులు, భవిష్యత్తు ఏమవుతుందని వారు ప్రశ్నిస్తున్నారు.. ఇదీ నిజమే.. కానీ కొత్తగా ఏర్పడే తెలంగాణ రాష్ట్రాన్ని తామే నడపాలని కోరుకోవడం భావ్యమేనా? ప్రభుత్వాలు ఒప్పుకున్నా తెలంగాణ యువతరం అంగీకరిస్తాందా? 610 జీవో అమలై ఉంటే ఈ పరిస్థతి ఇంత వరకూ వచ్చి ఉండేదికాదు..  వదేళ్ల వరకూ హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉండాలని నిర్ణయమైనప్పుడు ఈలోగా ఏర్పాట్లు చేసుకోవడానికి కావాల్సినంత సమయం ఉంది.. ఈ నేపథ్యంలో సీమాంధ్ర ఉద్యోగుల ఆందోళన అర్థరహితం..
రాష్ట్ర విభజన తర్వాత ఇరు ప్రాంతాల్లో కొత్త ఉద్యోగ, ఉపాధి అవకాశాలు చాలా వరకూ ఏర్పడే అవకాశం ఉంటుంది.. నిజానికి ప్రభుత్వ ఉద్యోగాలకు ఏనాడో ప్రాధాన్యత తగ్గింది.. ఇప్పుడున్న ఉద్యోగాలు కూడా భవిష్యత్తులో ఉంటాయనే గ్యారంటీ లేదు.. ఉన్నా వేల సంఖ్యలోనే.. ప్రతి ఏటా లక్షకు పైగా గ్రాడ్యుయేట్లు, ఇంజనీర్లు తయారవుతున్న ఈ రోజుల్లో అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు ఆశించగలమా? భవిష్యత్తులో ఇక ప్రయివేటు రంగమే దిక్కని స్పష్టంగా తెలుస్తోంది.. ఈ పరిస్థితుల్లో ఈ ఆందోళనలు అవసరమా చెప్పండి..

రాష్ట్ర విభజన విషయాన్ని పరిపాలనా సౌలభ్యం, స్థానికులు మనోభావాల కోణంలో చూసినప్పుడు ఎలాంటి సమస్యలు కనిపించవు.. కానీ తమవి కానీ వనరులపై కన్నేసి దానికి తెలుగు జాతి ఐక్యత అనే ముసుగేసినప్పుడే సమస్యలు వస్తున్నాయి.. మనమంతా ముందు భారతీయులం.. మనది భారత జాతి.. ఆ తర్వాతే తెలుగు వాళ్ల.. తెలంగాణ, సీమాంధ్ర వాసులం..

Monday, August 5, 2013

అమరజీవి ఆత్మ ఘోషిస్తోంది..

అమరజీవి పొట్టి శ్రీరాములు ఆత్మ ఘోషిస్తోంది.. తన చరిత్రను వక్రీకరిస్తున్న తీరు చూసి..
పొట్టి శ్రీరాములు ఎందుకు ఆత్మార్పణం చేశారో తెలుసా? మద్రాసుతో కూడిన ఆంధ్ర రాష్ట్రం కోసం.. ఒక్కసారి వాస్తవ చరిత్రను క్లుప్తంగా చూడండి..

మద్రాసు రాష్ట్రంలోని తెలుగు ప్రాంతాలను విడదీసి ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేయాలనే డిమాండ్ చిరకాలంగా ఉంది.. అది నగరంలో 1912 సంవత్సరంలో తొలిసారిగా ఊపిరి పోసుకున్న ఆంధ్ర రాష్ట్ర స్వప్నం 1914లో ఆంధ్ర మహాసభ, భారత జాతీయ కాంగ్రెస్ మహాసభల్లో బలంగా వినిపించింది.. 1918లో కాంగ్రెస్ పార్టీ ఆంద్ర కోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది.. ఆంధ్ర రాష్ట్రం కావాలనే డిమాండ్ కు కాంగ్రెస్ అగ్రనేతలు సానుకూలంగానే స్పందించి, స్వాతంత్ర్యం తర్వాత చూద్దాం అంటూ దాటవేశారు.. 1947లో స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఆంధ్ర రాష్ట్రం ఇవ్వాలనే డిమాండ్ తిరిగి మొదలైంది..

ఆనాటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ తెలుగు జిల్లాలను కలిపి ఆంధ్ర రాష్ట్రం ఇచ్చేందుకు సిద్దపడ్డా, మద్రాసు విషయంలో పేచీ వచ్చింది.. మద్రాసుతో కూడిన ఆంధ్ర రాష్ట్రం కావాలంటూ తెలుగు వారు పట్టుబట్టగా తమిళులు మోకాలడ్డారు.. దీంతో కేంద్ర ప్రభుత్వం మద్రాసు విషయంలో మెట్టు దిగితే ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేయడానికి సిద్ధమంటూ మడత పేచి పెట్టింది.. మద్రాసు లేని ఆంధ్ర రాష్ట్రం తల లేని మొండెం వంటిదని, తమకు అలాంటి రాష్ట్రం ఆమోదయోగ్యం కాదని తెలుగు నాయకులు ఖరాఖండిగా చెప్పేశారు.. వాస్తవానికి ఒకప్పడు మద్రాసు నగరం (చెన్నపట్నం) తెలుగు వారిదే.. కానీ స్వాతంత్ర్యం వచ్చే నాటికి తమిళ తంబీల జనాభా తామర తంపరలా పెరిగిపోయింది.. మద్రాసు మాదే అని క్లైమ్ చేసుకోవడం మొదలు పెట్టారు..
ఈ దశలో గాంధేయ వాది పొట్టి శ్రీరాములు మద్రాసుతో కూడిన ఆంధ్ర రాష్ట్రం కావాలనే డిమాండ్ తో 1952 అక్టోబర్ 19న ఆమరణ దీక్ష ప్రారంభించారు.. ఈ దీక్షకు ఆనాటి మద్రాసు ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదు.. 1952 డిసెంబర్ 15న 58 రోజుల అకుంఠిత దీక్ష తరువాత పొట్టి శ్రీరాములు అమరుడయ్యారు.. దీంతో ఆంధ్ర రాష్ట్రం భగ్గుమన్నది.. తీవ్ర హింస చలరేగింది..

నెహ్రూ ప్రభుత్వం వెంటనే ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు.. కానీ అందులో మద్రాసు లేదు.. ఆనాటి వృద్ద నాయకత్వం తమ జీవితంలో ఆంధ్ర రాష్ట్రాన్ని చూస్తామో లేదో అనే బెంగతో వెంటనే ఒప్పేసుకుంది.. కానీ పొట్టి శ్రీరాములు ఏ మద్రాసు గురించి పట్టు పడుతూ దీక్ష ప్రారంభించాడో ఆ మద్రాసు మాత్రం మనకు దక్కలేదు.. నిజం చెప్పాలంటే పొట్టి శ్రీరాములు ఆశయం నెరవేరలేదు.. నెరలేదు అనడం కన్నా పదవుల కోసం కాళ్లు చాచుకొని కూచున్న ఆ నాటి తెలుగు నాయకులు అమరజీవి ఆశయానికి తూట్లు పొడిచారని చెప్పడమే సబబుగా ఉంటుంది.. అలా 1953 అక్టోబర్ ఒకటిన కర్నూలు రాజధానిగా ఆంధ్ర రాష్ట్రం సిద్దించింది..
ఆంధ్రా రాష్ట్రమైతే వచ్చింది కానీ వారికి అసలు కష్టాలు తెలిసి వచ్చాయి.. మద్రాసును ఉమ్మడి రాజధానిగా కొంత కాలం కొనసాగించాలని ఆంధ్ర నాయకులు కోరగా, తక్షణం మద్రాసు విడచి వెళ్లాలని ఆనాటి ముఖ్యమంత్రి రాజీజీ హుంకరించాడు.. సరైన మౌళిక సదుపాయాలు లేని కర్నూలు పట్టణంలో గుడారాలు వేసుకొని ఆంధ్ర రాష్ట్రం పాలన సాగించాల్సి వచ్చింది.. ఆ సమయంలో వారి కన్ను హైదరాబాద్ నగరంపై పడింది..
1948 సెప్టెంబర్ 17న భారత దేశంలో విలీనమైన హైదరాబాద్ ప్రత్యేక రాష్ట్రంగా కొనసాగుతూ వచ్చింది.. హైదరాబాద్ రాష్ట్రంలో తెలుగువారు అధికంగా ఉన్న తెలంగాణను కలుపుకొని విశాలాంధ్రగా ఏర్పడాలనే ప్రతిపాదన తెరపైకి వచ్చింది.. పావులు కదిలాది.. చివరకు ఆంధ్ర-తెలంగాణ విలీనమై 1956 నవంబర్ 1న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటైంది.. ఇదీ అసలు చరిత్ర..

కానీ ఇప్పడు ప్రచారంలో ఉన్న చరిత్ర ఎలా ఉందో చూడండి.. పొట్టి శ్రీరాములు ఆంధ్ర ప్రదేశ్ ఏర్పాటు కోసం ఆత్మ త్యాగం చేశారట.. అసలు అప్పటికి (1952)తెలుగు నాయకులకు ఆంధ్రప్రదేశ్ ఆలోచనే లేదు.. వారి ముందున్న కర్తవ్యమల్లా మద్రాసు నుండి విడిపోయి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడాలన్నదే..  అమరజీవి పొట్టి శ్రీరాములు జీవిత చరిత్రను గమనిస్తే ఆంధ్రప్రదేశ్(విశాలాంధ్ర) ప్రస్థావనే కనిపించదు.. అమరజీవి త్యాగం వల్లే ఆంధ్రప్రదేశ్ ఏర్పడిందనే ప్రచారాన్ని నిజమని నమ్మిన కొందరు తెలంగాణ ఉద్యమకారులు అప్పట్లో ఆయన విగ్రహాలను ధ్వంసం చేశారు...
ఆంధ్రప్రదేశ్ నుండి విడిపోయి తెలంగాణ ఏర్పడాలని కోరడం వేర్పాటు వాదమట.. మరి మద్రాసు నుండి విడిపోయి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడటం వేర్పాటు వాదం పరిధిలోకి రాదా?..  పైగా భాషా ప్రయుక్త రాష్ట్రమని, సమైక్య రాష్ట్రమని గొప్పగా వర్ణిస్తుంటారు.. వాహ్వా.. క్యా బాత్ హైజీ..
అమరజీవి పొట్టి శ్రీరాములు చరిత్రను మరుగున, పరచి ఆయన చిత్ర పటాలను సమైక్యాంధ్ర పోరాటానికి వాడుకోవడం ఎంత వంచనో గమనించారా?.. నిజంగా పొట్టి శ్రీరాములు గారి ఆశయం నెరవేర్చాలని ఉంటే మద్రాసు (నేటి చెన్నై) నగరాన్ని సాధించుకోండి.. అప్పుడే అమరజీవి ఆత్మకు శాంతి చేకూరినట్లు..

Saturday, August 3, 2013

మళ్లీ అవే వెన్నుపోట్లు..

మళ్లీ అవే నాటకాలు.. తెలంగాణ ప్రజలు ఐదు దశాబ్దాల కల నెరవేరిందని సంతోషపడుతున్న సమయంలో మళ్లీ పాత డ్రామాకు తెర తీశారు..
వైఎస్ఆర్ కాంగ్రెస్ ద్వంద్వ విధానాన్ని పక్కన పెడితే, రాష్ట్రంలో సీపీఎం తప్ప అన్ని పార్టీలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మద్దతు ఇచ్చాయి.. ఇది అక్షరాలా నిజం.. తెలుగుదేశం పార్టీ గతంలో తెలంగాణకు అనుకూలంగా తాము ఇచ్చిన లేఖకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేసింది.. స్వయాన ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తెలంగాణ ఏర్పాటును స్వాగతించారు.. కానీ సీమాంధ్రకు చెందిన ఆ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు చేస్తున్న పని ఏమిటి? వారు రాజీనామా చేయాల్సిన అవసరం ఏమిటి?
కాంగ్రెస్ అధిష్టానమే స్వయంగా తెలంగాణ ఇస్తున్నట్లు ప్రకటించిన తర్వాత, ఆ పార్టీ సీమాంధ్ర ఎంపీలు, ఎమ్మెల్యేలు రాజీనామాలంటూ మళ్లీ ఎందుకు కపటనాటకాలు ఆడుతున్నారు?.. గత నెల రోజులుగా జరుగుతున్న పరిణామాలను గమనిస్తే తెలంగాణ ఏర్పాటు ఖాయమని మెడ మీద తలకాయ ఉన్న ప్రతి ఒక్కరూ ఊహించారు.. అంత ముందు చూపు వారికి లేకపోయిందా?
రాజకీయ నాయకులకు, కార్యకర్తలకు తమ పార్టీ విధానాలపై నిబద్దత ఉండాలి.. కానీ పార్టీ తీసుకున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తే ముందు తమ పార్టీలకు రాజీనామా చేయాలి.. కాంగ్రెస్, టీడీపీ ప్రజా ప్రతినిధులకు ఆ ధైర్యం ఉందా వీరికి.. మీరు ఎవరిని మోసం చేస్తున్నారు?.. మీ పార్టీలనా?.. తెలంగాణ ప్రజలనా?.. కాదు. మీరు వంచిస్తున్నది మీ పార్టీలను, మిమ్మల్ని ఎన్నుకున్న ప్రజలను..
చరిత్ర ఎప్పడూ ఒకేలా ఉండదు.. మారిన పరిస్థితులను వాస్తవిక దృక్ఫథంతో, విశాల హృదయంతో ఆలోచించాలి.. ఆహ్వానించాలి.. సీమాంధ్ర ప్రాంతంలో కొత్త రాజధాని ఏర్పాటు చేసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా సహకరించడానికి సిద్ధంగా ఉంది.. చేరువలో సొంత రాజధాని రావడం వల్ల అన్ని విధాలా ప్రయోజనాలు సీమాంధ్ర జనమే పొందుతుంది కదా? ఉద్యోగ ఉపాధి అవకాశాలు కూడా ఘననీయంగా పెరిగే అవకాశం ఉంది.. ఈ విషయాలను దాచి పెట్టి సమైక్యాంధ్ర పేరిట ఉద్యమాన్ని రెచ్చగొట్టడం ఎందుకు?.. ఎటు చూసినా సీమాంధ్ర జిల్లాల నుండి 150 నుండి 200 పై చిలుకు దూరంలో తెలంగాణ నడి బొడ్డున ఉన్న హైదరాబాద్ ఉమ్మడ రాజధానిగా ఉండటం సాధ్యమేనా?
ఆంధ్ర ప్రదేశ్ ఏ పరిస్థితుల్లో ఏర్పడిందో చరిత్ర చదివిన ప్రతి ఒక్కరికీ తెలుసు.. తెలంగాణను విలీనం చేసుకునే సమయంలో కుదిరిన పెద్ద మనుషుల ఒప్పందం ప్రకారమే కదా?.. ఆ ఒప్పందంలోని అంశాలనే పాటించనప్పడు వినీనానికి ఏమైనా అర్ధం ఉందా? అపార్ధాలకు ఆస్కారం లేకుండా సంతోషంగా విడిపోవాల్సిన సమయంలో ఏమిటీ వెన్ను పోట్లు? మళ్లీ 2009 నాటి సీన్ రిపీట్  చేయాలనే ఆలోచన ఎందుకు?