Saturday, June 29, 2013

రాజకీయం చేయకండి

భారత జాతికి అండ సైనికులు.. తెలుగు జాతికి అండ చంద్రబాబు. జై జవాన్.. జై చంద్రబాబు
పశ్చిమ గోదావరి జిల్లాలో ఓ టీడీపీ నాయకుడు పెట్టిన ఫ్లెక్సీ ఇది..
భారతీయుల జాతి వేరు, తెలుగు వారి జాతి అని ఆ నాయకుడు భావిస్తున్నారా? తెలుగు వారు భారతీయుల్లో భాగం కాదా?
జై జవాన్.. జై కిసాన్.. జై విజ్ఞాన్.. నినాదాం వెనుక ఓ స్పూర్తి ఉంది.. దీన్ని రాజకీయ నినాదంగా మార్చకోవడం సబబేనా..
అభిమానానికీ హద్దు ఉండాలి.. చంద్రబాబు నాయుడు ఉత్తరాఖండ్ రాష్ట్రంలో తెలుగు యాత్రికులను రక్షించేందుకు చొరవ తీసుకోవడం అభినందనీయమే.. కానీ అతి పబ్లిసిటీ బెడిసి కొట్తే ప్రమాదం ఉంది.. దేశ రక్షణ కోసం అహర్నిమిషం కష్టపడుతూ, ప్రాణాలకు తెగించి ప్రకృతితో పోరాడుతూ బాధితులను కాపాడుతున్న సైనికులతో చంద్రబాబును పోల్చడం సరికాదు..
చంద్రబాబు ఓ రాజకీయ నాయకుడు, తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా పని చేసిన బాబు గారు ఏమి చేసినా మీడియాలో పబ్లిసిటీ దొరుకుతుంది.. కానీ వీర జవాన్లకు పబ్లిసిటీ అవసరం లేదు.. దేశం కోసం తమ ప్రాణాలు పణంగా పెట్టి పని చేస్తున్న సైనికులకు ఓట్లు అవసరం లేదు.. ప్రజల ఆశీర్వాదాలు, అండదండలు కావాలి..

మితి మీరిన పబ్లిసిటీ కొన్ని సందర్భాల్లో బెడిసికొట్టే ప్రమాదం ఉంది.. బాబుగారి విషయంలో ఇది చాలాసార్లు రుజువైంది.. ఈ విషయాన్ని టీడీపీ అభిమానులు, కార్యకర్తలు గ్రహించాలి..

Friday, June 28, 2013

జై జవాన్.. జై కిసాన్..

ఈ నినాదం వినగానే మనలో దేశభక్తి ఉప్పొంగుతుంది.. ఉత్తరాఖండ్ వరదల్లో మన సైనికుల సహాయక చర్యలను చూస్తుంటే మరోసారి ఈ నినాదం అందరి నోళ్లపై మెదులుతోంది..
1965లో లాల్ బహద్దూర్ శాస్త్రి ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో పాకిస్తాన్ మన దేశంపై యుద్ధానికి దిగింది.. భారత సైనికులు పాకిస్తాన్ ను చిత్తుగా ఓడించారు.. ప్రధమ భారత ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ ముందు చూపు లోపం కారణంగా చైనా దాడిని సమర్థవంతంగా ఎదురుకోలేక పోయామనే బాధలో ఉన్న భారత ప్రజలకు, పాకిస్తాన్ పై సాధించిన తాజా విజయం ఎంతో ఆనందాన్ని ఇచ్చింది.. భారత జవాన్లలో శాస్త్రీజీ నింపిన స్పూర్తి విజయానికి కారణమైంది..
మరోవైపు స్వాతంత్ర్యం తర్వాత తీవ్ర ఆహార ధాన్యాల కొరతతో బాధపడుతున్న మన దేశం హరిత విప్లవంతో స్వయం సంవృద్ధిని సాధించింది.. దేశంలో విస్తారంగా పంటలు పండాయి.. ఈ నేపథ్యంలోనే లాల్ బహద్దూర్ శాస్త్రి జై జవాన్.. జై కిసాన్.. నినాదం ఇచ్చారు.. దేశాన్ని రక్షించే సైనికులకు జై కొడదాం.. అలాగే మనం తిండిని ఇచ్చే రైతన్నకూ జై కొడదాం అని శాస్త్రీజీ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు..
ఈ నినాదాంలో మరో జై జోడించారు ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజపేయి.. 1999లో పోఖ్రాన్ అణు పరీక్ష విజయం సందర్భంగా వైజ్ఞానిక వేత్తల (శాస్త్రవేత్తల) సేవలను గుర్తిస్తూ జై విజ్ఞాన్ నినాదాన్ని కూడా చేర్చారు..
సైనికులకు, రైతులకు సైతం శాస్త్రవేత్తల సేవలు కావాలి.. ఈ ముగ్గరి సేవలు దేశ ప్రజలకు ఎంతో ముఖ్యం..
అలా జై జవాన్.. జై కిసాన్.. జై విజ్ఞాన్ .. నినాదం రూపు దిద్దుకుంది..



Thursday, June 27, 2013

వీర జవాన్లకు పాదాభివందనం..

దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత అతి పెద్ద యుద్దేతర సహాయక కార్యక్రమాల్లో భారత సైన్యం పాల్పంచుకుంటోంది.. ఉత్తరాంఖండ్ వరదల్లో చిచ్చుకున్న వేలాది మంది చార్ ధామ్ భక్తులను కాపాడుతోంది మన సైన్యం.. కొండా కోనల్లో చెల్లా చెదురైన యాత్రికులను సురక్షితంగా బయటకు తీసుకు రావడంతో పాటు ఆహారం, వసతి కల్పించి ఆదుకుంటున్నారు మన జవానులు.. తాత్కాలిక వంతెనలు నిర్మించి, తాళ్లతో నదులను దాటించి యాత్రికుల ప్రాణాలు కాపాడుతున్నారు.. అందుకోసం ప్రతికూల వాతావరణంలో ప్రాణాలకు తెగించి ప్రకృతితో పోరాటం చేస్తున్నారు.. సహాయక చర్యల్లో సైనికులు తమ సహచరులను సైతం కోల్పోయినా మనో ధైర్యం కోల్పోకుండా పని చేస్తున్నారు.. ప్రతికూల వాతావరణంలో ఓ హెలిక్యాప్టర్ కూలి వైమానిక దళ సభ్యుల ప్రాణాలు కూడా పోయాయి..

మన వీర జవానులకు సెల్యూట్ చేయడంతోనే సరిపెట్టుకోవద్దు.. వీలైతే పాదాభివందనం చేద్దాం..






ముఖ్యమంత్రి ఢిల్లీకి ఎందుకు వెళ్లారు?

కేంద్రంలో యూపీఏ ప్రభుత్వానికి మెజారిటీ లోక్ సభ సీట్లను కట్టబెట్టిన ఆంధ్ర ప్రదేశ్ అంటే కాంగ్రెస్ పార్టీ ఏపాటి విలువ ఇస్తోందో మరోసారి గమనించండి..
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఏఐసీసీ అధినేత్రి సోనియా గాంధీ దర్శనం కోసం మూడు రోజుల పాటు ఢిల్లీలో ఎదురు చూశారు.. ఆమె అపాయింట్మెంటే దొరకలేదట పాపం.. చేసేది లేక సెకండ్ కేడర్ నాయకులతో చర్చలు జరిపి హైదరాబాద్ కు తిరుగు ముఖం పట్టారు.. రెండు రోజుల కాశ్మీర్ పర్యటనకు వెళ్లిన సోనియాజీ, మూడో రోజున ముఖ్యమైన అపాయింట్మెంట్లతో బిజీగా ఉన్నారట.. ఒక కాంగ్రెస్ పాలిత రాష్ట్ర ముఖ్యమంత్రికే ఆమె సమయం ఇవ్వలేదంటే అంత పెద్ద రాచకార్యాలు ఏమున్నాయో? తమ రాష్ట్రాల్లోనే గుర్తింపు కోల్పోయిన గులాంనబీ, దిగ్విజయ్ లాంటి నాయకులతో కలిసేందుకే కిరణ్ కుమార్ గారు ఢిల్లీ దాకా వెళ్లారు.. ఏం వారినే హైదరాబాద్ వచ్చి మాట్లాడమని చెప్పొచ్చు కదా? చూశారు కదా తెలుగు వారన్నా, ఏపీ కాంగ్రెస్ నాయకులన్నా కాంగ్రెస్ పార్టీ పెద్దలకు ఏ మేరకు గౌరవం ఉందో..

ముఖ్యమంత్రి గారు ఢిల్లీ వెళ్లింది ఉత్తరాంచల్ రాష్ట్ర వరదల్లో చిక్కుకున్న తెలుగువారిని ఓదార్చి, వారికి అందుతున్న సహాయ కార్యకలాపాలు పర్యవేక్షించడానికే కాబోలు అని అంతా భావించారు.. కానీ కిరణ్ కుమార్ గారు పుణ్యం పురుషార్ధం కలిసి వస్తాయని అన్ని పనులు కలుపుకొని అక్కడికి వెళ్లారు.. సరే ఇక ఏపీ భవన్లోనే బస కాబట్టి బాధితుల కష్టాలు వినక తప్పలేదు.. దేశంలోని పలు రాష్ట్రాల సీఎంలు ఉత్తరాఖండ్ వెళ్లి తమ ప్రజల బాగోగులు చూసుకున్నారు.. మన సీఎం గారికి మాత్రం అంత తీరుబడి లేదేమో? అందుకే క్రెడిట్ అంతా తన జిల్లాకే చెందిన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబుకు ఇచ్చేశారు..



Wednesday, June 26, 2013

కాళరాత్రి 1975


మిత్రులారా ఉత్తరాఖండ్ అకాల వరదల వార్తల్లో పడి మనమంతా దేశ చరిత్రలోని చీకటి రోజును మరచిపోయినట్లున్నాం.. అత్యవసరపరిస్థతి(Emergency)పై గతంలో నేను Facebookలో రాసిన కథనంలోని కొంత బాగాన్ని మరోసారి ఇస్తున్నాను..........................
అవి ఇందిరాగాంధీ దేశాన్ని పాలిస్తున్న రోజులు. బ్యాంకు జాతీయీకరణ, రాజభరణాల రద్దు, బంగ్లాదేశ్ యుద్దంలో విజయంతో ప్రజల్లో ఆమె ఖ్యాతి అమాంతం పెరిగిపోయింది. ఇందిరాగాంధీ తిరుగులేని ప్రధానిగా ఆవిర్భవించారు. అపర దుర్గగా ప్రతిపక్షం కీర్తించింది.. ఇందిరాయే ఇండియా, ఇండియాయే ఇందిర అని పాలక కాంగ్రెస్ నేతలు భజనలు చేశారు. క్రమంగా ఇందిరాగాంధీలో గర్వం పెరిగింది. తానేమీ చేసినా చెల్లతుందనే అహంభావం వచ్చేసింది. ఇదే సమయంలో ఇందిర చుట్టూ కోటరీ ప్రారంభమైంది. వారిచ్చే సలహాలను ఆమె గుడ్డిగా అనుకరించడం మొదలు పెట్టారు. 
 ఇందిర తన వారసునిగా కుమారుడు సంజయ్‌ గాంధీని ఎంపిక వంశపారం పర్యపాలన శాశ్వతం చేసే ప్రయత్నాలు ప్రారంభించారు. సంజయ్‌ క్రమంగా రాజ్యాంగేతర శక్తిగా, షాడో పీఎంగా ఎదిగారు. క్రమంగా పరిపాలన గాడి తప్పి విచ్చల విడితనం వచ్చేసింది. ఇక ఎక్కడ చూసినా అవినీతి పెరిగిపోవడం ప్రారంభమయింది. ఇదేమని ప్రశ్నించిన వారి నోరు నొక్కడం ప్రారంభించారు. 
ఇందిర పాలనపై దేశంలో క్రమంగా వ్యతిరేకత ప్రారంభమైంది. ప్రముఖ గాంధేయ వాది లోక్‌నాయక్‌ జయప్రకాశ్‌ నారాయణ్‌ అవినీతికి వ్యతిరేకంగా ప్రారంభించిన ఉద్యమం యావత్తు దేశాన్ని కదిలించడం ప్రారంభించింది.
ఇదే సమయంలో అమేధీ నియోజక వర్గం నుండి విజయం సాధించేందుకు ప్రభుత్వ యంత్రాంగాన్ని వాడుకున్నందున ఇందిరా గాంధీ ఎన్నిక చెల్లదని అలహాబాద్‌ హైకోర్టు తీర్పునిచ్చింది. ఆమెపై పోటీ చేసి ఓడిపోయిన రాజ్‌ నారాయణ్‌ ఈ కేసు దాఖలు చేశారు. 
ఇందిర గద్దె దిగాలని ప్రతిపక్షం నుండి వత్తిడి రావడంతో పాటు దేశ వ్యాప్తంగా ఉద్యమం ప్రారంభమెంది. కోర్టు తీర్పతో ఆమె ప్రధాని పదివిని వదులుకోక తప్పని పరిస్థితి ఏర్పడింది. తనను చుట్టు ముట్టిన సమస్యల నుండి బయట పడటం ఎలాగో ఆమెకు అర్థం కాలేదు. క్రమంగా ఆమెలో దాగిన నియంత నిద్ర లేచింది. ఒక కీలక నిర్ణయానికి వచ్చేశారు. 1975 జూన్‌ 25 అర్ధరాత్రి రాష్ట్రపతి ఫక్రద్దీన్‌ అలీ అహ్మద్‌ను కలుకొని కీలక పత్రాన్ని చూపించారు. వెంటనే ఆయన మారుమాట్లాడకుండా రాజ్యంగంలోని 352వ నిబంధన క్రింద అత్యవసర పరిస్థితిని విధిస్తూ ఆ ఉత్తర్వుపై సంతకం చేశారు. దేశంలో ప్రజాస్వామ్యం హత్యకు గురైంది..చీకటి రోజులకు తెరలేచింది.
ఆనాటి అర్ధరాత్రి ఇందిరా గాంధీ ప్రతిపక్ష నాయకులందరినీ జైలుకు పంపింది. అరెస్టయిన వారిలో జయప్రకాశ్‌ నారాయణ్‌, మురార్జీ దేశాయి, అటల్‌ బిహారీ వాజ్‌పేయి, లాల్‌ కృష్ణ అద్వానీ, చరణ్‌ సింగ్‌, ఆచార్య కృపలానీ, జార్జ్ ఫెర్నాండెజ్‌, రాజ్‌నారాయణ్‌ తదితర ప్రముఖ నాయకులు ఉన్నారు. ఎఎర్జెన్సీ పేరిట పత్రికల గొందు నొక్కారు. దేశంలో అసలేం జరుగుతుందో తెలియని వాతావరణం ఏర్పడింది. ప్రశ్నించే వారిని, మేధావులను, పాత్రికేయులను ఎక్కడిక్కడ అరెస్టు చేయడం మొదలు పెట్టారు. ఆరెస్సెస్‌తో పాటు ఎన్నో సంస్థలను రద్దు చేశారు. దేశంలోని జైళ్ళన్నీ లక్షలాది రాజకీయ ఖైదీలతో కిక్కిరిసి పోయాయి. ఎమర్జెన్సీ ముసుగులో సంజయ్‌ గాంధీ, కాంగ్రెస్‌ నేతల అరాచకాలకు అంతు లేకుండా పోయింది. 1947లో దేశానికి స్వాతంత్రం వస్తే.. 28 ఏళ్ళకే దేశ ప్రజలు మరోసారి స్వాతంత్ర్యాన్ని కోల్పోయింది. దేశ వ్యాప్తంగా ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా రహస్య ఉద్యమం ప్రారంభమైంది.
19 నెలల నియంతృత్వ పాలన తర్వాత ప్రధాని ఇందిరాగాంధీలో ఆందోళన ప్రారంభమైంది. ఈ పరిస్థితి ఏనాటికైనా తనకు ముప్పు తెస్తుందని ఆమెకు అర్థమైంది. 1977 మార్చి 21న ఎమర్జెన్సీ ఎత్తివేస్తూ ఇందిరాగాంధీ నిర్ణయం తీసుకున్నారు. దేశానికి పట్టిన సుదీర్ఘ గ్రహణం తొలగి పోయింది. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అదే సంవత్సరం లోక్‌ సభ ఎన్నికలు జరిగాయి. ప్రతిపక్షాలన్నీ జనతా పార్టీ పేరిట ఏకమయ్యాయి. ఎన్నికల్లో జనతా పార్టీ ఘన విజయం సాధించి అధికారం చేపట్టింది. కాంగ్రెస్‌ పార్టీ ఘోరంగా ఓడిపోయింది. స్వయాన ఇందిరాగాంధీ రాయబరేలీలో తన ప్రత్యర్థి రాజ్‌ నారాయన్‌ చేతిలో ఓడిపోయారు. ఇందిర నియంతృత్వ విధానాలపై దేశ ప్రజల వ్యతిరేకతకు ఈ ఎన్నికల ఫలితాలు అద్దం పట్టాయి. అయితే మురార్జీ దేశాయ్‌ ప్రధానిగా ఏర్పడిన జనతా ప్రభుత్వం అంతర్గత కలహాలతో కుప్పకూలడంలో ప్రజలు తప్పనిసరి పరిస్థితుల్లో మళ్ళీ కాంగ్రెస్‌కే పట్టం కట్టారు. కానీ ఎమర్జెన్సీ చీకటి రోజులను ప్రజలు ఈనాటికీ మరిచిపోలేదు.




అమ్మ పెట్టదు.. అడుక్కు తిననివ్వదు


అమ్మ పెట్టదు.. అడుక్కు తిననివ్వదు.. ఈ సామెత ప్రస్తుతం ఉపయోగించడం సమంజసం కాకపోవచ్చు.. కానీ రాష్ట్ర మంత్రులు, కాంగ్రెస్ నేతల వ్యవహారం చూస్తుంటే ఇలా వ్యాఖ్యానించక తప్పడం లేదు..
ఉత్తరాఖండ్ చార్ ధామ్ యాత్రలో చిక్కుకు పోయిన ఆంధ్రప్రదేశ్ యాత్రికులను బయటకు తీసుకొచ్చి సురక్షితంగా స్వస్థలాలకు పంపడంలో ఘోరంగా విఫలమైన రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు, కాంగ్రెస్ నేతలు తమకు తోచిన సాయం చేస్తున్న తెలుగుదేశం నాయకులపై తమ ప్రతాపం చూపారు.. డెహ్రాడూన్ విమానాశ్రయంలో ప్రత్యేక విమానం సిద్ధం చేసిన టీడీపీ నాయకులతో గొడవ పడి, యాత్రికులను ఆ విమానంలో ఎక్కొద్దని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన విమానంలో ఎక్కాలని వత్తిడి తెచ్చారు.. ఇరు పార్టీల నేతలు ఎయిర్ పోర్టులో కాట్లాడుకొని తెలుగువారి పరువు గంగపాలు చేశారు.. ఇద్దరూ బాధితులకు సాయం చేయాలనే అనుకున్నప్పుడు సమన్వయం ఎందుకు ఉండదు? ఇది పచ్చి రాజకీయమే కదా?
చార్ ధామ్ యాత్రలో అష్ట కష్టాలు పడి ఢిల్లీ చేరుకున్న యాత్రీకులకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తమ భవనాల్లో ఉచిత వసతి గదులు, ఆహారం, రవాణా సౌకర్యాలు కల్పిస్తున్నాయి.. ప్రత్యేక విమానాల్లో వారి వారి రాష్ట్రాలకు తరలిస్తున్నాయి.. కానీ ఢిల్లీ ఆంధ్రప్రదేశ్ భవన్ లోని  తెలుగు యాత్రికులను యాచకుల కన్నా అధ్వాన్నంగా చూస్తున్నారు..  అక్కడ ఉన్న ఖరీదైన గదులు బాధిత యాత్రికులకు ఉచితంగా కేటాయించడం అక్కడి రెసిడెంట్ కమిషనర్ గారికి ఇష్టం లేదట..  హాళ్లలో నేలపైనే పడుకునే అవకాశం కల్పించాడు ఈ దయామయుడు.. టీడీపీ అధినేత చంద్రబాబు వచ్చి హడావుడి చేసి మందలించాక ఏవో కొన్ని గదులు ఇచ్చాడట.. వేల సంఖ్యలో వస్తున్న యాత్రీకులకు వసతి కల్పించడం కష్టమట.. యాత్రికులకు అన్నం, చారు, పెరుగన్నంతోనే సరిపుచ్చుతున్నారు.. ఇదేమని ప్రశ్నిస్తే క్యాంటీన్లో డబ్బు పెట్టి కొనుక్కొమ్మని సలహా ఇస్తున్నారు.. టీడీపీ వారు హెల్త్ క్యాంప్ పెడితే మందులు బయటకు విసిరేయించిన మహానుభావుడు ఈ రెసిబెంట్ కమిషనర్..
అయ్యా శశాంక్ గోయల్ ఏపీ భవన్ మీ తాత గారి జాగీర్ కాదు, మీ అత్తగారు కట్నం కింద నీకు ఇచ్చింది కాదు.. రాష్ట్ర ప్రజలు ప్రభుత్వానికి పన్నుల కింద ఇచ్చిన పైసలతో కట్టిన భవనం అది.. నీ జీతం కూడా ప్రజలే చెల్లిస్తున్నారని గుర్తు తెచ్చుకో.. కష్టాల్లో ఉన్న తెలుగు యాత్రికులను ఇంత ఘోరంగా అవమానిస్తున్న అహంభావి, మూర్ఖపు రెసిడెంట్ కమిషనర్ గారికి బుద్ది చెప్పే వారే లేరా?