Monday, February 25, 2013

బాధ్యత లేని మీడియా, నాయకులు..


దిల్ సుఖ్ నగర్ బాంబు పేలుళ్ల తర్వాత మన నాయకులు, మీడియా బాధ్యత లేకుండా వ్యవహరించడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది..
బాంబు పేలుళ్లు జరగగానే రాజకీయ నాయకులు ఢిల్లీ నుండి గల్లీ దాకా నాయకులు సంఘటనా స్థలంలో వాలిపోయారు.. తామేదో మైలేజీ కోల్పోతామన్నట్లుగా ఒకరి చూసి ఒకరు సంఘటనా స్థలానికి పరుగెత్తి దర్యాప్తు సంస్థలకు ఇబ్బంది కలిగించడం ఎంత వరకూ సమంజసం.. ఇలాంటి విపరీత ప్రవర్థన కారణంగా కేసు దర్యాప్తుకు అవసరమైన ప్రాథమిక ఆదారాలకు నష్టం జరిగిన విషయం ఆ నాయకులకు అర్థం అయ్యిందా? పోలీసులు ప్రజల భద్రతను పక్కన పెట్టి వీరికి భద్రత కల్పించడమెలా అని హైరానా పడిపోయారు.. అంతగా కుతూహలం ఉంటే పోలీసులు దర్యాప్తు ఆధారాలు సేకరించిన తర్వాత వెళ్లవచ్చు..అయ్యా నాయకులారా.. ఇలాంటి క్లిష్ట సమయంలో ప్రజలెవరూ మీ సందర్శనలు, పరామర్శలు ఆశించడం లేదని గ్రహించండి..
ఇక మీడియా విషయానికి వద్దాం.. బాంబు పేలుళ్ల కేసులలో నిఘా సంస్థలు, పోలీసులు సేకరిస్తున్న ఆధారాలను ఎప్పటికప్పడు బట్టబయలు చేస్తున్న మీడియా కేసు దర్యాప్తుకు అవరోధాలు కల్పిస్తోందా అనిపిస్తోంది.. ముంబాయిపై దాడి సమయంలో టీవీ ఛానెళ్లు ఇచ్చిన లైవ్ చూసి అప్రమత్తమైన తీవ్రవాదులు తమను పట్టుకోవడానికి వచ్చిన పోలీసులు మరింత ఎక్కువ సంఖ్యలో పొట్టన పెట్టుకున్నారు.. ఇది కాదేనలేని నిజం.. ఇప్పడు హైదరాబాద్ పేలుళ్ల దర్యాప్తు విషయంలో మీడియా ఇస్తున్న కథనాలు అదే స్థాయిలో ఉన్నాయి.. దర్యాప్తు జరుగుతున్న తీరును ఎప్పటికప్పడు ప్రకటించడం ద్వారా తీవ్రవాదులు తప్పించుకునే అస్కారాన్ని కల్పిస్తోంది మన మీడియా.. ఇవాళ ఓ ఛానెల్లో చూసిన స్క్రోలింగ్ ఆశ్యర్యాన్ని కలిగించింది.. దర్యాప్తు సంస్థలు తనను వేధిస్తున్నాయని ఒకాయన ఆ ఛానలోడితో ఏడిచాడట.. అయ్యా.. వాడి నేరం ఏమిటో విచారణలో నిగ్గు తేలుతుంది కదా? అతగాడు నిర్దోషి అని వకాల్తా పుచ్చుకునే అధికారం మీకు ఎక్కడిది?

 అమెరికా లాంటి అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో సెప్టెంబర్ 11 సంఘటన తర్వాత అక్కడి మీడియా కనీసం మృతుల సంఖ్యను కూడా ప్రకటించకుండా.. కీలకమైన దర్యాప్తు అంశాలను బయటపెట్టకుండా ఎంతో నిగ్రహం, సంయమనం పాటించింది.. అలాంటి సంయమనం మన మీడియాకు ఎందుకు లేదో?.. మీ పోటీలకు, రేటింగ్లకు తగిన సమయమేనా ఇది.. అసలు పోలీసులు, నిఘా సంస్థలు తప్పుకొని బాంబు పేలుళ్ల కేసు దర్యాప్తును మీడియాకే అప్పగిస్తే మంచిదేమో? నేర వార్తల కవరేజీ విషయంలో మీడియా విచారణ ప్రతికూల ప్రభావాలను చూపే అవకాశం ఉందని ఇటీవల సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి అల్తమస్ కబీర్ ఆందోళన వక్తం చేయడం గమనించాల్సిన అవసరం ఉంది..

Saturday, February 23, 2013

ఉగ్రవాద నగ్న స్వరూపం

దిల్ సుఖ్ నగర్ లో జరిగిన బాంబు పేలుళ్ల దుర్ఘటన తర్వాత ఉగ్రవాదుల నగ్న స్వరూపం దేశ ప్రజలందరికీ మరోసారి తెలిసి వచ్చింది.. ఉగ్రవాదం అనేది ఒకరకమైన మానసిక వికృత చర్య తమ భావాలను ఇతరులపై బలవంతంగా నెట్టేందుకో, పంతాన్ని నెగ్గించుకోవడాకి ఎలాంటి దారుణమైన హత్యలుకైనా పాల్పడేందుకు సిద్దపడే పైశాచిక స్వభావులే ఉగ్రవాదులు.. అవసరమైతే తమకు తాము మానవ బాంబులుగా మారి తాము చచ్చీ, అవతలి వారిని చంపి తామేదో ఘన కార్యానికి అంకితమౌతున్నామని సమాధానపరచుకుంటారు..
ఉగ్రవాదానికి జాతి, మతం, కులం, వర్గం, భాష, ప్రాంతం లేదనేది నిజం.. కానీ కొందరు దర్మార్గులు జిహాద్ పేరిట భయోత్పాతాన్ని సృష్టిస్తూ ఉగ్రవాదాన్ని ఒక మతానికి ఆపాదించేస్తున్నారు.. నిజానికి మన దేశంలో ఉన్న ఆ మతస్తుల్లో అత్యధికులు ఉదారస్వభావులే.. ఈ దేశాన్ని ప్రేమించేవారే.. దేశ విభజన జరిగిన సమయంలో వారంతా తాము పుట్టి పెరిగిన భారత్ దేశమే కావాలనుకున్నారు.. కానీ తులసి వనంలో గంజాయి మొక్కల్లా అతి కొద్ది మంది జిహాద్ పేరిట రెచ్చగొడుతూ తప్పుదోవ పట్టిస్తున్నారు.. అయితే ఉగ్రవాదం ఒక మతానికి మాత్రమే పరిమితం అని నేను వాదించడం లేదు.. ఉగ్రవాదులు హిందూ మతంతో సహా అన్ని మతాల్లోనూ ఉన్నారు.. ఉగ్రవాదాన్ని మెజారిటీ, మైనారిటీ అనే దృష్టితో చూడరాదు..
ఆర్థికంగా, సామాజికంగా వెనుకబాటు తనం, చదువు లేక పోవడమే వేర్పాటు భావనలను సృష్టిస్తుందని కొందరు మేధావులు తేల్చేస్తుంటారు.. కానీ నా పరిశీలన ప్రకారం చదువుకున్న మేధావులు, అంతో ఇంతో స్థితి మంతులు అయినవారు, సామాజికంగా కొంత పలుకుబడి ఉన్న వారే అధికంగా ఉగ్రవాద భావాలకు ఆకర్శితులవుతున్నారు.. వ్యాప్తి చేస్తున్నారు కూడా.. ఇందుకు నేను ఎన్నో ఉదాహరణలు చూపగలను..
ఈ దేశంలో పుట్టి, ఇక్కడి తిండి తింటూ, స్వేచ్ఛను అనుభవిస్తూనే తామేదో అన్యాయానికి గురవుతున్నామని చెప్పుకునేవారు కచ్చితంగా దేశ ద్రోహులే.. ఇలాంటి వారందరికీ పొరుగు దేశం ఏదో స్వర్గం అనే భావన ఉంది.. కానీ మతం పేరిట ఏర్పడ్డ ఆ దేశంలో వర్గాలు, తెగల పేరిట ఎంతగా కొట్టుకు చస్తున్నారో ప్రతి నిత్యం మనం పత్రికల్లో టీవీల్లో చూస్తూనే ఉన్నాం.. తమ దేశంలో ఉన్న అరాచకాన్ని పుచ్చుకోవడానికి వారు మన దేశంలో హింసను రగిలిస్తున్నారు..

ఉగ్రవాద చర్యలకు పాల్పడేవారిని, ప్రోత్సహించేవారిని కఠినంగా శిక్షించాల్సిందే.. వీరికి ఉరికన్నా కఠినమైన శిక్షలే విధించాలి.. దురదృష్టవశాత్తు మన దేశంలో ఉగ్రవాదులకు, దేశ ద్రోహులకు, దేశ ద్రోహులకు వంతపాడేవారే మేధావులు(అసలు వీరిని అలా పిలవవచ్చా?) ఉన్నారు.. వీరి పైశాచిక ఆనందానికి అమాయక పౌరులు చనిపోయినప్పుడు ఈ మేధావుల నోళ్లు పెగలవు.. కానీ వారికి శిక్షపడ్డప్పుడో, ఎన్ కౌంటర్లో చనిపోయినప్పుడో గొంతు చించుకొని అరుస్తారు.. దిల్ సుఖ్ నగర్ లాంటి దుర్ఘటనలు జరిగినప్పుడు వీరి నోళ్లు మూబోతాయెందుకో?.. అఫ్జల్ గురు ను ఉరి తీసినప్పుడు చర్చ చేసిన వారు ఇప్పుడు ఎందుకు చప్పుడు చేయరు? అఫ్జల్ గురు ఉరికి ప్రతీకారమే దిల్ సుఖ్ నగర్ హత్యాకాండ అనే విషయం తెలిసి తేలు కుట్టిన వారిలా వ్యవహరిస్తున్నారా?

Friday, February 22, 2013

దిల్ దు:ఖ్ నగర్


దిల్ సుఖ్ నగర్ ఈ పేరులోనే ఎంతో సంతోషం కనిపిస్తుంది.. మన మనస్సు ఎంతో సుఖంగా ఉండాలని కోరుకుంటున్న ప్రాంతం.. నిత్యం వచ్చి పోయే ప్రయాణీకులతో, వ్యాపార, విద్యాసంస్థలు, సినిమా ధియేటర్లతో కళకళలాడే ప్రాంతం ఇది.. ఒక్కడి రద్దీ రోడ్లు, గల్లీల్లో తిరగాలే కానీ.. ఈ జనాన్ని చూస్తుంటే నిజంగా మన దిల్ కు ఎంతో సుఖం’ అనిపిస్తుంది..
జర్నలిస్టుగా నా కెరీర్ ప్రారంభించింది దిల్ సుఖ్ నగర్లోనే.. త్రినేత్ర సూపర్ మార్కెట్ పైన ఉండే ఈనాడు జోనల్ ఆఫీస్, మధుర స్వీట్స్, వెంకటాద్రి పక్కన ఉడిపి హోటల్ టిఫిన్స్, కోణార్క్ ముందు విల్సన్ కేఫ్ ఛాయ్.. ఇవన్నీ నా జీవితంలో మరచిపోయేని తీపి గుర్తులు.. దురదృష్టవశాత్తు మధుర స్వీట్స్ తప్ప త్రినేత్ర సూప్ మార్కెట్, ఈనాడు జోనల్ ఆఫీసు, ఉడిపి హోటల్, విల్సన్ కేఫ్ ఇప్పుడు లేవు.. విల్సన్ కేఫ్ పోయి ఆనంద్ టిఫిన్ సెంటర్ వచ్చింది (ఇక్కడే బాంబు పేలింది).. నా జీవితంలో రెండొంతులకు పైగా దిల్ సుఖ్ నగర్ గుర్తులు నిండిపోయాయి..

నిన్నటి దినం (21 ఫిబ్రవరి 2013) సాయంత్రం వేళ సరిగ్గా 6 గంటల 10 నిమిషాలకు దిల్ సుఖ్ నగర్ కోణార్క్ సమీపంలోనే ఛాయ్ తాగి వెళ్లాను.. కొద్ది నిమిషాలకే ఆ ప్రాంతంపై ఉగ్రవాదులు పంజా విసరడం నన్నెంతో కలచి వేసింది.. 25.08.2007 నాడు ఇలాగే కోఠిలోని గోకుల్ ఛాట్ భండార్లో సమోసా తిని బయలు దేరిన 5 నిమిషాలకే అక్కడో దారుణ సంఘటన జరిగింది.. (గతంలో ఫేస్ బుక్ లో ప్రస్థావించాను) ఇలా రెండుసార్లు మృత్యువు నుండి వెంట్రుక వాసిలో బయటపడ్డాను.. కానీ ఆనాటి, ఈనాటి ఉగ్రవాద చర్యల్లో ఎందరో అమాయకులు బలైపోయారు?.. వీరి ప్రాణాలకు ఎవరు తిరిగివ్వగలరు?.. నా జీవితంలో మరచిపోలేని చేదు గుర్తులు ఇవి.. 
 దిల్ సుఖ్ నగర్ లో ఉగ్రవాదుల దుశ్చర్యను ఖండిద్దాం.. ఎందరో అమాయకులు మరణించారు.. వారందరి ఆత్మలకు శాంతి చేకూరాలని కోరుతూ, వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలుపుకుంటున్నాను.. ఈ ఘటనలో గాయపడ్డ వారందరూ త్వరలో కోలుకోవాలని కోరుకుంటున్నాను..

Sunday, February 17, 2013

తొమ్మిదేళ్లు.. తొమ్మిది పాపాలు


కుంభకోణాల మీద కుంభకోణాలు.. 9 ఏళ్ల పాలనలో 9 కుంభకోణాలు.. ఒక కుంభకోణం మరువక ముందే మరో కుంభకోణం..
ఓటుకు నోటు, 2జీ, ఆదర్శ్ హౌసింగ్, కామన్ వెల్త్ క్రీడలు, బొగ్గు గనుల కేటాయింపు, ఎస్ బ్యాండ్, జాతీయ ఉపాధి హామీ పథకం, విదేశాల్లో నల్ల ధనం.. చివరకు ఇప్పడు అగస్టా హెలిక్యాప్టర్ల కుంభకోణం..
ఇదేనా యూపీఏ ప్రభుత్వం సాధించిన ప్రగతి.. ఏ కుంభకోణంపైనా విచారణ కొలిక్కి రాలేదు.. తూతూ మంత్రం లాంటి విచారణలు.. అవినీతిపై ప్రతి పక్షాలు నిలదీసినా చర్యలు తీసుకోవడం దేవుడెరుగు.. ఎదురు దాడే కాంగ్రెస్ నేతల సమాధానం..
ఉలుకూ, పలుకు లేని మౌనీ బాబా మన్మోహన్ గుడ్డి దర్బారులో అవినీతి బేషుగ్గా రాజ్యమేలుతోంది.. దేశంలో ఆర్ధిక సంస్కరణలు ప్రవేశ పెట్టిన గొప్ప ఆర్థిక వేత్తగా పేరొందిన మన్మోహన్జీ హయాంలో ధరలు ఆకాశాన్ని అంటుతూ పేదలు బతకడమే గగణమైపోయింది.. పేదలు మరింత పేదలు అవుతుంటే.. ధనికులు ఆస్తులు ఎన్నో రెట్లు పెరిగిపోతున్నాయి..  ఇవేమీ పట్టని పాలకులు దేశ సంపదను అడ్డంగా దోచుకుంటున్నారు..
ఇప్పుడు తొమ్మిదేళ్ల పాలన అయిందేదో అయింది, కొత్తగా యువరాజు వచ్చి ఏదో కుళ్లపొడుస్తాడని కాంగ్రెస్ నేతలు గొప్పగా చెప్పుకుంటున్నారు..  ఇంతకాలంగా కొనసాగిన అనర్థాలన్నింటికీ మనన్మోహన్ సింగ్ ను బాధ్యున్ని చేసేసి.. అధినేతి సోనియమ్మవారు ప్రెష్ లుక్ పేరుతో రాహుల్ గాంధీని తెరపైకి తెరపైకి తెస్తున్నారు.. అంటే ఇంత కాలంగా కొనసాగుతున్న అసమర్థ పాలనకు కాంగ్రెస్ పాలకులు మూల్యం చెల్లించనక్కరలేదా?
ప్రజలు వెర్రివాళ్లు కాదు.. రాబోయే ఎన్నికల్లో కచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి, యూపీఏకు కచ్చింతంగా కర్రు కాల్చి వాత పెడతారు..

Thursday, February 14, 2013

ప్రేమికులకో దినమా?


ఈ ప్రపంచంటో అర్ధంలేని దినాల్లో ఒకటి ప్రేమికుల దినం (వాలెంటైన్స్ డే).. అసలు ప్రేమ అంటే ఏమిటి?.. దురదృష్టవశాత్తు ప్రేమ అంటే ఆడ, మగ మధ్య అనే నడిచే వ్యవహారం అనే అపోహ మన సమాజంలో ఉంది.. ఇందుకు కారణం సినిమాలు, సాహిత్య ప్రభావమే.. నిజానికి ప్రేమకు విస్తృత అర్థం ఉంది.. ప్రేమ కేవలం ప్రేయసీ, ప్రియులకు సంబంధించినది మాత్రమే కాదు.. మనం భగవంతున్ని ప్రేమిస్తాం.. తల్లిదండ్రులను, తోబుట్టువులను, బంధుమిత్రులను,  తోటి మనుషులను సైతం ప్రేమిస్తాం..  
ప్రేమ అనేది అనంతం, శాశ్వతం, నిత్య నూతనం.. ప్రేమను ఒక్క రోజుకు పరిమితం చేయగలమా? ప్రేమ ఒక్క రోజులో పుట్టి, ఒక్క రోజులోనే అంతరిస్తుందా? అలాంటప్పుడు ఎందుకీ అర్థం పర్థం లేని ప్రేమికుల రోజు.. నిజానికి మన దేశంలో ప్రేమికుల రోజు జరుపుకోవడం మెట్రో నగరాలకే పరిమితంగా ఉండేది.. కానీ మీడియా పుణ్యమా అని రెండు దశాబ్దాలుగా చిన్న పట్టణాలకు, గ్రామీణ ప్రాంతాలకూ వ్యాపించింది.. గ్రీటింగ్ కార్డులు, గిఫ్టులు అమ్ముకునేవారికి వ్యాపార లాభాలు, మీడియాకు ప్రకటనలు, టీఆర్పీ రేటింగ్ల ఆదాయానికి మాత్రమే పనికి వచ్చే దినమిది..
ఒక్కసారి మనం చరిత్ర పుటలను తిరగేస్తే వాలెంటైన్స్ డే ఎందుకు జరుపుకుంటారు అనే దానికి సూటిగా సమాధానం ఉండదు.. (వీకీపీడియా, ఇతర సర్చ్ ఇంజన్లు తిరగేసి చూడండి) వాలెంటైన్స్ డే మత పరమైన వేడుకే తప్ప ప్రేమికులకు సంబంధించింది కాదు.. ఓ మత ప్రచారకుడు ప్రేమతత్వాన్ని ప్రచారం చేయడం.. అతన్ని చక్రవర్తి బంధించి ఉరి తీయడం.. ఈ లోగా ఆ ప్రచారకుడు జైలరు కూతురుకు ప్రేమ లేఖ రాయడం (కూతురు వయసులో ఉన్న యువతిపై ఆ మత ప్రచారకునికి ప్రేమ ఏమిటో?)..

వాలెంటైన్స్ డే రోజులన గ్రీటింగ్స్, గిఫ్టులు ఇచ్చి పుచ్చుకొని పార్కులు, గట్లెమ్మట తిగినంత మాత్రాన ప్రేమ బలపడుతుందా? ఈ ఒక్క రోజు ప్రేమించుకుంటే చాలా? ప్రేమ అనేది శాశ్వతంగా ఉండాలి కాని దానికో దినం పెడితే ఎలా? నిజానికి దినాలు జరుపుకోవడం మన సాంప్రదాయం కాదు.. ఎవరైనా నా భావాలతో ఏకీభవిస్తే సంతోషం.. ఏకీభవించకున్నా నేనేమీ బాధపడను.. నేను ఎవరి మనోభావాలనైనా నొప్పించి ఉంటే క్షమించాలని కోరుకుంటున్నాను..

Tuesday, February 12, 2013

కాశ్మీరీలకు ఎవరు ఆదర్శం?

అఫ్జల్ గురును ఉరి తీసినందుకు కాశ్మీర్ లోయలోని యువతలో పరాయివారమనే భావన ఏర్పడిందట.. ఒక తరం ప్రజలు తమని తాము బాధితులుగా భావిస్తున్నారట.. ఈ తీవ్రదాదిని కాశ్మీర్ యువత ఆదర్శంగా భావిస్తోందట.. అఫ్జల్ ను ఉరి తీయడం తప్పట.. ఈ మాటలు అన్నది ఎవడో దారిన పోయే దానయ్యో, గొట్టంగాడో కాదు.. స్వయాన జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా నోటి గుండా వచ్చిన కూతలు ఇవి..
మన దేశం తిండి తింటూ, ఇక్కడి స్వేచ్ఛా వాయువులు పీలుస్తూ పరాయి దేశం పాట పాడే వారిని ఏమనాలి.. కచ్చితంగా దేశ ద్రోహులు అనక తప్పదు.. భారత రాజ్యాంగం, ప్రజాస్వామ్యంపై విశ్వాసం వ్యక్తం చేస్తూ, ఒక రాష్ట్ర ప్రజలు ఎన్నికున్న పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తూ ముఖ్యమంత్రి పదవిలో ఉన్న వ్యక్తి మాట్లాడాల్సిన మాటలేనా ఇవి.. అసలు ఈ అబ్దుల్లాల కుటుంబమే అంత.. కాశ్మీర్ తొలి సీఎం షేక్ అబ్దుల్లా.. ఆయన కొడుకు ఫరూక్ అబ్దుల్లా.. ఇప్పడు మనవడు ఒమర్ అబ్దుల్లా వంశ పారం పర్యంగా కాశ్మీర్ను ఏలుతూ తమ స్వార్ధ ప్రయోజనాలను కాపాడుకుంటున్నారు..
కాశ్మీర్లో తీవ్రవాదం బలంగా ఉన్న కాలంలో అబ్దుల్లాల కుటుంబం విదేశాల్లో విహరిస్తుంది.. పరిస్థితి చక్కబడ్డాక వచ్చి అధికార పగ్గాలు చేపడుతుంది..  నెహ్రూ మొదలు కొని ఇందిరా, రాజీవ్, సోనియా వరకూ కాంగ్రెస్ పాలక కుటుంబం అబ్దుల్లాల కుటుంబానికి అండగా నిలుస్తూ వచ్చింది.. అయితే ఈ కుటుంబంలో విశ్వాసం అనేదే కనిపించదు.. నెహ్రూ ఏరి కోరి సీఎం చేసిన షేక్ అబ్దుల్లా మధ్యలో కొంత కాలం పాకిస్తాన్ పాట పాడి జైలు పాలయ్యాడు.. ఆయన కొడుకు ఫరూక్ అబ్దుల్లా కేంద్రంలో అధికారానికి దూరం అయిన కాంగ్రెస్కు మస్కా కొట్టి నేషనల్ ఫ్రంట్, బీజేపీ నేతృత్వం ఎన్టీఏ పంచన జేరాడు.. వీరికి అధికారమే పరమావధి..
కాశ్మీరీల్లో దేశ భక్తికి నెల కొల్పాల్సిన ఆ రాష్ట్ర పాలకులు ఉగ్రవాదులకు సలాంలు కొట్టడం దారుణం.. ఇంతకీ అఫ్జల్ గురు కాశ్మీరీ యువతకు ఎందులో ఆదర్శం.. పార్లమెంటుపై దాడిలో సహకరించడంలోనా?.. పాకిస్తాన్లో ఉగ్రవాద శిక్షణ పొందడంలోనా? వీధుల్లోకి వచ్చి రాళ్లు విసరడంలోనా?.. జవాబు చెప్పాల్సిన బాధ్యత అబ్దుల్లా కుటుంబంపై ఉంది.. ఇలాంటి నీఛులు అధికార పీఠాలపై ఉండటం కన్నా జైళ్లలో ఉండటం బెటరు..
ఇంతకీ కాశ్మీరీ యువతకు ఆదర్శం ఎవరు? అఫ్జల్ గురులాంటి తీవ్రవాదులు కాదు.. సివిల్స్ లో విజయం సాధించి 2009 బ్యాచ్లో ఐఏఎస్ టాపర్ గా నిలచిన డాక్టర్ షాఫైసల్ అనే కాశ్మీరీ యువకుడు.. ఈ విషయం బహిరంగంగా ఎందుకు చెప్పరు?


Sunday, February 10, 2013

గురప్ప భాషాభిమానం

ఈయన పేరు గురప్ప.. తిరుమల నడక మార్గంలో గాలి గోపురం దగ్గర చిన్న హోటల్ నడుపుతున్నాడు.. గురప్ప హోటల్లో మేం ఇడ్లీలు తిన్నాం.. తెలుగులో మాట్లాడినందుకు 5 రూపాయలు రాయితీ ఇచ్చాడు.. ఇటీవల తిరుపతిలో తెలుగు మహాసభలను చూసి ప్రభావితుడయ్యాడట.. కాణిపాకం నివాసి అయిన గురప్ప పెద్దగా చదువుకోలేదు.. అయినా తెలుగు భాషపై ఎంతో అభిమానం ఉంది.. గురప్ప లాంటి సామాన్యుడు చేస్తున్న పనిని ఇతర వ్యాపారులు ఎందుకు చేయరు? తెలుగు భాషను తన వంతు సేవ చేస్తున్నగురప్ప అందరికీ మార్గదర్శి కావాలని కోరుకుంటున్నాను.. ప్రభుత్వం ఇలాంటి వ్యక్తులను ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది..

ఉరిలో రహస్యమేల?

పార్లమెంట్ పై దాడి కేసులో అఫ్జల్ గురుకు ఉరి శిక్ష అమలు చేయడానికి ఎట్టకేలకు యూపీఏ సర్కారుకు ధైర్యం చాలింది.. అయితే శిక్షను అమలు చేసిన తీరే విచిత్రంగా ఉంది.. అఫ్జల్ గురు, అంతకు ముందు అజ్మల్ కసబ్ లను రహస్యంగా ఉరి తీశారు.. ఉరి తీయడానికి అంత రహస్యం పాటించాల్సిన అవసరం ఏమిటి? హిందుత్వానికి తీవ్ర వాదానికి లింకులు పెట్టడానికి ప్రయత్నించి భంగ పడ్డ కాంగ్రెస్ పార్టీ, వారి ఓట్లను దూరం చేసుకోవడానికి ఇష్టం లేకే ఇంత కాలంగా తాము ఇంటా అల్లుళ్ల మాదిరిగా జైళ్లలో మేపుతున్న ఈ ఘరానా తీవ్రవాదులను అయిష్టంగానే ఉరి తీయక తప్పలేదు..
కసబ్ ను ఉరి తీసినప్పుడు నోరు మెదపడానికి సాహసించని వారు ఇప్పుడు అఫ్జల్ ను ఉరి తీయడాన్ని తప్పు పడుతున్నారు.. భారత ప్రజాస్వామ్య వ్యవస్థపై దాడి చేసిన పాకిస్తాన్ ప్రేరిత తీవ్ర వాదులకు వత్తాసు పలుకుతున్న ఇలాంటి వారిని ఏమనాలో అర్థం కావడం లేదు.. ఎందుకు ఉరి శిక్ష అమానుషం అనేది వీరి వాదన.. కానీ వీరు సమర్థిస్తున్న సిద్దాంతం తాలూకూ వ్యక్తులు ఆయుధాలు ధరించి ఎన్ని హత్యలు చేసినా, దోపిడీలు చేసినా తప్పు లేదేమో?.. ఎందుకీ ద్వంద్వ వైఖరి.. అఫ్జల్ గురు అమాయకుడంటున్నారు.. మరి ఈ విషయాన్ని న్యాయస్థానంలో ఎందుకు నిరూపించలేకపోయారో?
కొందరు వ్యక్తులు మతాన్ని బట్టి వాదనలు మారుస్తారు.. వారి దృష్టిలో ఒక మతం వారు చేస్తే ఉరి తీయాల్సిన నేరం, మరో మతం వారు చేస్తే ఉరి తీయకుండా జైలు శిక్ష వేస్తే చాలు.. పైగా సుదీర్ఘ కాలం శిక్ష అనుభవించి పశ్చాతాప పడుతున్నందుకు వదిలేయాలని వాదిస్తారు.. ఎందుకీ ద్వంద్వ నీతి? తీవ్రవాదానికి, మతానికి సంబంధం లేదు.. మతం ముసుగులో ఎవరు తప్పు చేసినా క్షమించరాదు..

Saturday, February 2, 2013

భారతీయుడు

కొంత కాలం క్రితం ఓ పెద్ద మనిషి నీ బ్యాక్ గ్రౌండ్ ఏమిటి?’ అని ప్రశ్నించాడు..
జర్నలిస్టుఅని చెప్పాను..
నేనడిగింది నీవెవరని?’.. ఆయన తొలి ప్రశ్న నాకు అర్థం కాలేదని భావించి కాస్త డీటైల్డ్ గా ప్రశ్నించాడు..
అబ్బ అది కాదు బాసూ.. నేనడిగింది నీ కులం గురించి.. గురుడు అసలు విషయానికి వచ్చేశాడు..
అప్పుడు నేను కాస్త గంభీరంగానే సమాధానం చెప్పాను..
“I am INDIAN”.. “నేను భారతీయుడిని..
ఓహో కమల్ హాసన్ వా? అయితే అందుకేనా నీ జుట్టు కాస్త ముందుకుంది.. ఆ పెద్ద మనిషి ఎక్కసెక్కేలాడాడు.. (కారణమేంటో తెలియదు.. ఎంత దువ్వినా నా జుట్టు ముందుకే పడుతుంది)
నేను నా పేరులో కులం ప్రస్థావన లేకుండా జాగ్రత్త పడతాను.. భారతీయునిగా చెప్పుకోవడానికి గర్వపడతాను.. భారతీయుడినని చెప్పగానే ఆ పెద్ద మనిషి ఆ పెద్ద మనిషి క్రూరమైన జోక్ వేశానని అనుకొని నవ్వుకున్నాడు..
శంకర్ దర్శకత్వంలో సొంత కొడుకునే క్షమించని, అవినీతి వ్యవస్థపై పోరాడిన స్వాతంత్ర్య సమరయోధుడిగా భారతీయుడు చిత్రంలో కమల్ హాసన్ అద్భుతంగా నటించారు.. ఇదే చిత్రం తమిళంలో ఇండియన్గా, హిందీలోహిందుస్తానీగా వచ్చింది..

నిజానికి నేను సినిమాలు చూసేది చాలా తక్కువ.. చూసేవి కూడా ఎక్కువగా కమల్ హాసన్ వే.. చిన్నప్పటి నుండి కమల్ కు నేను వీరాభిమానిని.. భారత దేశంలోనే ఆయన గొప్ప నటుడని గట్టిగా చెప్పగలను.. నిరూపిస్తాను కూడా.. దురదృష్ట వశాత్తు మన తెలుగు ఇండస్ట్రీలో కమల్ లాంటి గొప్ప నటుడు, ఆయనలా వినూత్న ప్రయోగాలు చేసే నటుడు లేడని బాధ పడుతుంటాను..

Friday, February 1, 2013

పోలీసులంతా ఇంతేనా?..

ఆయన నిజంగా నేరమే చేసి ఉండొచ్చు.. పోలీసులు చెప్పనట్లు వారిపట్ల దురుసుగానే ప్రవర్తించి ఉండొచ్చు.. అంత మాత్రాన ఒక రౌడీ షీటర్ ను లాక్కెళ్లినట్లు, చొక్కా సరిగ్గా వేసుకోని, లుంగీ ఊడిపోతున్న స్థితిలో పట్టుకెళ్లి పోలీసు వాహనంలో పట్టుకెళ్లడం సమంజసమేనా? పైగా తమపై దౌర్జన్యం చేసినట్లు పోలీసు స్టేషన్లో కేసు పెట్టేశారు..
ఇటీవలి వరకూ రాష్ట్ర మంత్రిగా ఉన్న వ్యక్తి, సీనియర్ శాసనసభ్యుడు శంకర్రావుకు పోలీసులు చేసిన మర్యాద ఏ పాటిదో ప్రజలంతా టీవీల్లో ప్రత్యక్షంగా చూశారు.. ఒక ప్రముఖ వ్యక్తి పట్లే పోలీసుల ప్రవర్తన ఇలా ఉంటే సామాన్యుల పరిస్థితి ఏమిటి? చట్టసభ సభ్యుడినే గౌరవించలేని పోలీసులు సామాన్య ప్రజల పట్ల ఎలా ప్రవర్తిస్తారో ఊహించుకోండి.. బహుషా చట్టం ముందు అందరూ సమానమే అని పోలీసులు బుకాయిస్తారేమో?.. సామాన్యునిలాగే గౌరవ శాసనసభ్యున్ని ట్రీట్ చేశామని గొప్పలకు పోతారేమో?
ఒక సీనియర్ జర్నలిస్టుగా మన పోలీసులను చాలా దగ్గర నుండి చూశాను.. నిజానికి వారికి పాత్రికేయులంటే చాలా చులకన భావం ఉంటుంది.. రెండేళ్ల క్రితం రవీంద్రభారతిలో నాటి ముఖ్యమంత్రి కార్యక్రమాన్ని కవర్ చేయడానికి వెళ్లిన నాకు ఇలాంటిదే ఓ వింత అనుభవం ఎదురైంది.. మీడియా ద్వారం వైపు వెళ్లుతున్న నన్ను ఓ ఖాకీ అటకాయించి ఏకంగా చొక్కా పట్టేశాడు.. నేను తీవ్రంగా స్పందించే సరికి సారీ ప్రెస్ అని తెలియదని బుఖాయించేశాడు.. ఆ మహానుభావుడికి నా మెడలో ఐడీ కార్డు కూడా కనిపించనంగా క్రౌర్యం కళ్లకెక్కిందేమో?..
ఖాకీ డ్రెస్ వేసేవారంతా తాము ఎలా ప్రవర్తించినా చెల్లుతుందనుకుంటారేమో?.. సాటి వ్యక్తికి గౌరవించలేని కరుదుదనం వారిలో అణువణువునా ఉంటుందనుకుంటా? పీపుల్స్ ఫ్రెండ్లీ కాప్స్అనే పదానికి వారికి అర్థమే తెలియదేమో? అసలు పోలీసులకు ఇచ్చే శిక్షణే ఇలా ఉంటుందా అనే అనుమానం కలుగుతుంది.. పోలీసులంటే నేరగాళ్లు భయపడాలి.. కానీ మన వ్యవస్థలో నేరగాళ్లు గల్లా ఎగరేసుకొని తిరుగుతుంటే సామాన్యుడు ఖాకీ డ్రెస్ వేసిన వారిని చూసి జడుసుకునే పరిస్థతి ఉంది..
నా బంధు మిత్రుల్లో చాలా మంది పోలీసు వృత్తిలో ఉన్నారు.. వారిని దగ్గర నుండి చూసి చెబుతున్న మాటలివి.. అయితే అందరూ ఇలాగే ఉంటారని మాత్రం నేను చెప్పడం లేదు.. ప్రతి వృత్తిలో మంచి వారు ఉంటారు. చెడు వారు కూడా ఉంటారు.. అది పోలీసు వృత్తి అయినా, పాత్రికేయ వృత్తి అయినా మంచీ చెడూ నాణేనికి రెండు వైపులా ఉంటాయి.. నా ఆవేదన అంతా రెండో శ్రేణి వారిగురుంచే..