Thursday, September 18, 2014

ఆసఫ్‌జాహీ వంశం.. ఏడు రొట్టెల కథ

హైదరాబాద్ సంస్థానాన్ని ఆసఫ్‌జాహీ వంశం క్రీ.శ.1724 నుండి 1948 వరకూ పాలించింది.. ఈ వంశానికి చెందిన ఏడుగురు పాలకులు 224 సంవత్సరాల పాటు దక్కన్ హైదరాబాద్రాజ్యాన్ని పాలించారు.. ఏడు తరాలతోనే ఈ వంశ పాలన ముగిసింది.. అందుకు ఏడు రొట్టెలే కారణం అంటారు.. ఇదో ఆసక్తికరమైన కథ..
గోల్కొండ సామ్రాజ్యంపై మొఘల్ సామ్రాట్ ఔరంగజేబు దాడి తర్వాత కుతుబ్ షాహీ పరిపాలన అంతరించింది.. అంతటితో హైదరాబాద్ ప్రాభవం తగ్గిపోయింది.. ఢిల్లీలో ఔరంగజేబు మరణం తర్వాత మొఘల్ సామ్రాజ్యం క్షీణిస్తున్న దశలో మీర్ కమ్రుద్దీన్ ఖాన్ ను 1724లో దక్కన్ సుబేదారుగా నియమించారు.. గోల్కొండ పతనంలో కీలకపాత్ర పోషించిన ఘియాజుద్దీన్ ఫిరోజ్ జంగ్ కొడుకే ఈ కమ్రుద్దీన్.. ఇతని తల్లికి మొదటి ఖలీఫా వారతస్వం ఉందటం విశేషం..
నిజాం ఉల్ ముల్క్ అనే బిరుదుతో మీర్ కమ్రుద్దీన్ ఖాన్ రాజ్యభారం స్వీకరించేందుకు ఓ గుర్రంపై ఢిల్లీ నుండి దక్షిణాదికి బయలు దేరాడు.. మార్గమధ్యలో ఆయనకు ఆకలి వేసింది.. దూరంగా ఒక ఫకీర్ కనిపించాడు.. దగ్గరకు వెళ్లి సలాం చేసి తినడానికి ఏమైనా ఉందా అని అడిగాడు.. ఫకీరు తన దగ్గర ఉన్న రొట్టెల గంప కమ్రుద్దీన్ ముందు పెట్టి ఇష్టమైనన్ని తినమని సూచించాడు.. ఆకలితో ఉన్న కమ్రుద్దీన్ గబాగబా ఏడు రొట్టెలు తిన్నాడు.. ఇక తినలేనని ఫకీరుతో చెప్పాడు.. నీ వంశం ఏడు తరాల పాటు మాత్రమే రాజ్యం ఏలుతుందని కమ్రుద్దీన్ కు ఆ ఫకీరు చెప్పాడు..


దక్కన్ సుబా తొలి రాజధాని ఔరంగాబాద్.. ఆ తర్వాత హైదరాబాద్ కు మారింది.. పరిపాలనా పగ్గాలు చేపట్టిన మీర్ కమ్రుద్దీన్ ఖాన్ మొఘలుల బలహీనతను గమనించి స్వతంత్రాన్ని ప్రకటించుకున్నాడు.. ఆ తర్వాత కాలంలో ఆసఫ్‌జాహీ పాలకులు బ్రిటిష్ వారికి సామంతులుగా మారారు.. 
ఆసఫ్‌జాహీ వంశ పాలకులు వీరే .. 1)మీర్ కమ్రుద్దీన్ ఖాన్, 2)నిజాం అలీఖాన్, 3)సికిందర్ జా, 4)నసీరుద్దౌలా, 5)అఫ్జలుద్దౌలా, 6)మహబూబ్ అలీఖాన్, 7)ఉస్మాన్ అలీఖాన్.. నిజాం ఉల్ ముల్క్ బిరుగు కారణంగా వీరు నిజాం నవాబులుగా గుర్తింపు పొందారు.. ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ పాలనలోనే హైదరాబాద్ సంస్థానంపై పోలీస్ యాక్షన్ జరిగి 17 సెప్టెంబర్ 1948లో భారత దేశంలో విలీనం అయ్యింది.. తన వారసుడిగా మనవడు ముఖరంజాను ప్రకటిద్దామని ఉస్మాన్ అలీఖాన్ భావించాడు.. కానీ ఆయన కోరిక ఫలించలేదు..

అలా ఏడు తరాలతో ఆసఫ్‌జాహీ వంశం కథ ముగిసింది.. ఫకీరు గారి ఏడు రొట్టెల జోస్యం ఫలించింది.. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఆసఫ్‌జాహీ పతాకంపై రొట్టెను చూడవచ్చు..

No comments:

Post a Comment