Thursday, August 14, 2014

మాతృభూమి ముక్కలైన రోజు..

మరి కొద్ది గంటల్లో దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన దినం అంటూ ఉత్సవాలకు సిద్దమవుతున్నాం.. కానీ ఈ ఉత్సవాల వెనుక విషాదం దాగి ఉందని నేటి తరం భారతీయులకు ఎంత మందికి తెలుసు?
ఆగస్టు 15, 1947 రోజున అర్ధరాత్రి స్వతంత్ర భారత దేశం అవతరించింది.. కానీ అంతకు ముందు రోజే ఆగస్టు 14, 1947న మన దేశం ముక్కలైంది.. బ్రిటిష్ వారి కుటిల నీతి, కాంగ్రెస్ - ముస్లిం లీగ్ నేతల అధికార దాహానికి దేశం విభజించబడింది.. పాకిస్తాన్ ఆవిర్భవించింది..భరత మాత ముక్కలైంది.. లక్షలాది మంది భారతీయుల నెత్తురు చిందింది.. మాన ప్రాణాలు కోల్పోయారు.. రాత్రికి రాత్రే పరాయి దేశస్తులైపోయారు.. కోట్లాది జనం ఆస్తిపాస్తులు వదిలేసుకొని ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని కాందీశీకులై వచ్చారు..  దేశ చరిత్రలోనే అత్యంత విచారకరమైన సందర్భం ఇది..
భారత దేశ స్వాతంత్ర్యం కోసం ఎందరో మహనీయులు పోరాటం చేశారు.. త్యాగాలు చేశారు.. ప్రాణాలు కోల్పోయారు.. కానీ ప్రతి ఫలం ఏమిటి? దేశ విభజనతో స్వాతంత్ర్యమా?.. త్యాగాలు చేసింది ఒకరైతే, అప్పనంగా ఫలాలు అనుభవించేందుకు తయారయ్యారు కొందరు నేతలు..
రెండో ప్రపంచ యుద్దం ముగిసింది.. బ్రిటిష్ వారు విజయం సాధించినా రవి అస్తమించని సామ్రాజ్యాన్ని ఇక నిలుపుకోలేమని గ్రహించారు.. అప్పటికే భారత దేశమంతటా బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఉద్యమాలు, పోరాటాలు పతాక స్థాయికి చేరాయి.. సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్ తదితర విప్లవ వీరుల పోరాటాలను చూసి భయపడిపోయిన లండన్ పాలకులు ఇలాంటి స్థితిలో భారత దేశాన్ని నిలుపుకోవడం సాధ్యం కాదని నిర్ణయానికి వచ్చేశారు.. కానీ యధాతథంగా స్వాతంత్ర్యం ఇచ్చేస్తే భారత దేశం నుండి ఏనాటికైనా తమకు ముప్పు అని భయపడ్డారు..  ఈ నేపథ్యంలో పురుడు పోసుకున్న కుట్ర దేశ విభజన..
బ్రిటిష్ వారి కుట్రకు పావులుగా దొరికారు కాంగ్రెస్, ముస్లిం లీగ్ నాయకులు.. మహ్మద్ అలీ జిన్నాను దువ్వి ద్విజాతి సిద్ధాంతాన్ని తెరపైకి తెచ్చారు.. భారత దేశానికి విభజించకుండా స్వాతంత్ర్యం ఇస్తే ఒప్పుకోబోమని, ముస్లింలకు ప్రత్యేక దేశాన్ని ఏర్పాటు చేసి ఇవ్వాలని పట్టుబట్టాడు జిన్నా.. ఆయన ఇచ్చిన ప్రత్యక్ష చర్య పిలుపుతో దేశ వ్యాప్తంగా మత కల్లోలాలను చెలరేగాయి.. వేలాది మంది అమాయకులను ఊచకోత కోశారు.. అదే సమయంలో కాంగ్రెస్ నాయకుల మీద వత్తిడి పెరిగింది.. అప్పటికే వీరిలో చాలా మంది వృద్ధులైపోయారు.. తమ జీవిత కాలంలో పదవులు అనుభవిస్తామో లేదో అనే బెంగ పట్టుకుంది వారికి.. పైకి ఇష్టం లేనట్లు మేకపోతు గాంభీర్యాన్ని చూపిస్తూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.. దీని ఫలితమే దేశ విభజన స్వాతంత్ర్యం..
దేశానికి స్వాతంత్ర్యం వచ్చిందని ఆనందించాలా? విభజనకు గురైందని బాధ పడాలా?.. స్వాతంత్ర్య దినోత్సవాలు జరుపుకోవాల్సిందే.. మన పెద్దల త్యాగాలను స్మరించుకోవాల్సిందే.. కానీ అదే సమయంల్ చరిత్ర నుండి గుణపాఠం నేర్చుకోవాలి.. మళ్లీ ఇలాంటి దుస్థితి మన దేశానికి రాకూడదు.. అందుకు మనం చేయాల్సిన కర్తవ్యం ఏమిటో ఆలోచించండి.. by: క్రాంతి దేవ్ మిత్ర

(కథ ముగిసిపోలేదు.. ఇంకా ఉంది..)

No comments:

Post a Comment