Sunday, January 12, 2014

యువతకు స్వామీజీ సందేశం..

నవ భారతంలో దేశ ప్రజలను అత్యధికంగా ప్రభావితం చేసిన మహా వ్యక్తుల్లో స్వామి వివేకానందకే ప్రథమ స్థానం ఇవ్వాలి.. స్వామీజీ జీవించింది చాలా కొద్ది కాలమే. కానీ ఆయన ఇచ్చిన సందేశం తరతరాలకు స్పూర్తి దాయకం.. స్వామి వివేకానంద 150వ జయంత్యుత్సవాల సందర్భంగా యువతకు ఆయన ఇచ్చిన సందేశాన్ని సంక్షిప్తంగా గుర్తు చేసుకుందాం..
ఆధునిక యువతపైనే నాకు విశ్వాసం ఉంది.. నేను నిర్మించిన ఆదర్శాన్ని దేశ మంతా వ్యాప్తి చేసేది యువతే.. యువత ముందు బలిష్టులు, జవ సంపన్నులు, ఆత్మ విశ్వాసుల, రుజువర్తనులు కావాలి.. ఇలాంటి వారు వంద మంది ఉన్నా చాలు, ఈ ప్రపంచాన్నే మార్చేయ వచ్చు.. ఇనుప కండరాలు, ఉక్కునరాలు, వజ్రసంకత్పమైన మనస్సు అవసరం.. బలమే జీవితం, బలహీనతే మరణం..
మీరంతా మహత్కార్యాలు సాధించడానికే జీవించామని విశ్వసించండి.. బలం, శక్తి మీలోనే ఉన్నాయని గుర్తుంచుకోండి.. ఎంతో విశ్వాసంతో లేచి నిలబడండి.. ధైర్యంగా బాధ్యతను మీ భుజ స్కంధాలపై వేసుకోండి.. భవిష్యత్తుకు మీరే బాధ్యులమని తెలుసుకోండి.. ఆరంభం అతి స్వల్పంగా ఉందని నిరాశపడకండి.. క్రమంగా ఘనమైన ఫలితాలు వస్తాయి.. సాహసంగా పని చేయండి
తమ సర్వస్వాన్ని త్యాగం చేసి, దేశం కోసం తమ జీవితాలను ఆహుతి చేసే యువత మనకు కొందరు కావాలి.. దేశ ప్రజలను ఉద్దరించే ఏకైక లక్ష్యంతో పని చేసే యవతను గుర్తించి పని చేయాలి.. త్యాగం, ఉత్సాహాలతో వారిని జాగృతం చేసి ఐక్యం చేయాలి.. మన స్థితికి మనమే బాధ్యులం.. లక్ష్యాన్ని సాధించే శక్తి, ఆపై శక్తి మనకే ఉంది..
విజయాన్ని సాధించడానికి కావలసినవి మూడు. అవి.. పవిత్ర, సహనం, పట్టుదల. వీటన్నింటినీ మించి కావలసింది ప్రేమ.. మీరు నిజంగా నా బిడ్డలే అయితే దేనికీ భయపడరు.. ఎక్కడా ఆగిపోరు.. మీరు సింహాల్లా ఉండాలి.. మన భారత దేశాన్నే కాక, ప్రపంచాన్నే జాగృతం చేయాల్సి ఉంది. ఉద్యమ నిర్వహణలో అవసరమైతే అగ్నిలో దూకడానికైనా సంసిద్ధంగా ఉండాలి..

లేవండి! మేల్కొనండి!.. మిమ్మల్ని మీరు మేల్కొల్పుకొని ఇతరులను మేల్కొల్పండి! ఇకపై నిద్రించకండి!.. మీరు మరణించే లోపే జీవిత పరమావిధిని సాధించండి.. లేవండి! మేల్కొనండి!.. గమ్యం చేరేవరకూ ఎక్కడా నిలవకండి.. ఎప్పటికీ జాగృతంగానే ఉండండి..  - స్వామి వివేకానంద

 

No comments:

Post a Comment