Friday, August 14, 2015

భారతజాతి చరిత్రలో విషాద దినం..

ప్రపంచమంతా నిద్రిస్తున్న వేళ భారత జాతి జాగృతమై స్వాతంత్ర్యాన్ని పొందుతున్నది..మరి కొద్ది గంటల్లో తాను చేసే ఉపన్యాస ప్రతికి మెరుగులు దిద్దుతున్నారు జవహర్ లాల్ నెహ్రూ.. కానీ ఆ సమయంలో భారత మాత మహా విషాదంలో మునిగిపోయింది.. స్వాతంత్ర్యంతో పాటే కన్నీరు కార్చాల్సిన దురదృష్టకర సందర్భం..
ఆగస్టు 15, 1947 అర్ధరాత్రి బానిసత్వ పాలన నుండి విముక్తి.. కానీ ఒక రోజు ముందే ఆగస్టు 14న దేశం ముక్కలైంది.. బ్రిటిష్ వారి కుటిల నీతి, కాంగ్రెస్ ముస్లింలీగ్ నాయకుల అధికార దాహానికి మన మాతృభూమి చీలిపోయింది.. పాకిస్తాన్ ఆవిర్భావం.. భరతమాతకు తీరని శోకం.. లక్షలాది మంది భారతీయులు రాత్రికి రాత్రే పరాయి దేశస్తులైపోయారు.. నెత్తురు చిందింది.. మాన ప్రాణాలు కోల్పోయిన అభాగ్యులెందరో.. నాయకులు చేసిన పాపానికి సామాన్య ప్రజలు మూల్యం చెల్లించుకున్నారు.. ఆస్తిపాస్తులు కోల్పోయారు.. ప్రాణాలు చేతిలో పట్టుకొని కట్టు బట్టలతో కాందీశీకులై తరలివచ్చారు.. దేశ చరిత్రలోనే అత్యంత విషాదకర సందర్భమిది..
భారతమాతకు విదేశీ సంకెళ్ల నుండి విముక్తి కల్పించడానికి ఎందరో మహనీయులు పోరాడారు.. త్యాగాలు చేశారు.. ప్రాణాలు కోల్పోయారు.. కాని ప్రతిఫలం ఏమిటి? దేశ విభజనతో స్వాతంత్ర్యమా?.. త్యాగాలు చేసింది ఒకరైతే అప్పణంగా ఫలాలు అనుభవించింది ఒకరు..
రవి అస్తమించని సామ్రాజ్యం నుండి భారత్ తమ చేజారక తప్పదని రెండో ప్రపంచ యుద్ధానికి ముందే బ్రిటిష్ వారికి అర్థమైంది.. భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్ లాంటి విప్లవ వీరులు, సుభాష్ చంద్రబోసు లాంటి తిరుగుబాటు యోధులు, మహాత్మా గాంధీ సత్యాగ్రహం, భారతీయుల్లో పెరుగున్న పోరాట స్పూర్తిని చూసిన తర్వాత తమకు రోజులు దగ్గర పడ్డాయని అర్థమైపోయింది బ్రిటిష్ పాలకులకు.. భారత దేశానికి స్వాతంత్ర్యం ఇచ్చేయాలనే నిర్ణయానికి వచ్చారు.. కానీ అలాగే ఇచ్చేస్తే తమకు ముప్పు తప్పదని భయపడ్డారు.. ఈ నేపథ్యంలో పురుడు పోసున్నదే దేశ విభజన కుట్ర..
ఈ కుట్రకు కాంగ్రెస్, ముస్లింలీగ్ నాయకులే పావులు.. మహ్మద్ అలీ జిన్నాను దువ్వి ద్విజాతి సిద్దాంతాన్ని తెర పైకి తెచ్చారు.. స్వాతంత్ర్యం ఇవ్వాలంటే ముందు దేశాన్ని విభజించాలని పట్టుబట్టాడు జిన్నా.. ఇందు కోసం ప్రత్యక్ష చర్యకు పిలుపునిచ్చాడు.. దేశ వ్యాప్తంగా మతకల్లోలాలు చెలరేగి వేలాది మంది అమాయకులు ఊచకోతకు గురయ్యారు.. అదే సమయంలో కాంగ్రెస్ నాయకులపై వత్తిడి పెరిగింది.. అప్పటికే వారిలో వృద్ధులు పెరిగిపోయారు.. దేశ విభజనతో కూడిన స్వాతంత్ర్యానికి అంగీకరించకపోతే తమ జీవిత కాలంలో పదవులు అనుభవించలేమేమో అనే బెంగ పుట్టుకుంది.. పైకి ఇష్టం లేనట్లు మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు.. దీని ఫలితమే మన దేశ విభజన.. స్వాతంత్ర్యం..

భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చిందని సంబరాలు జరుపుకుంటున్న వేళ కొత్తగా ఏర్పడ్డ సరిహద్దుల అవతల కోట్లాది మంది భారతీయులు పరాయివారైపోయారు.. వారి కన్నీటిని తుడిచే నాధుడే కరువయ్యాడు.. వేయేళ్ల బానిసత్వ పాలన నుండి విముక్తి లభించినందుకు స్వాతంత్ర్య దినోత్సవ సంబరాలు జరుపుకోవాల్సిందే.. కానీ అదే సమయంలో మన మాతృభూమికి జరిగిన ద్రోహాన్ని కూడా గుర్తు పెట్టుకోవాలి.. చరిత్ర నుండి గుణపాఠం నేర్చుకోవాలి.. అందుకు మన కర్తవ్యం ఏమిటో ఆలోచించండి..

No comments:

Post a Comment