Wednesday, September 9, 2015

జనం భాషే కాళోజీ గోడు..

రఘువీర్ నారాయణ్ లక్ష్మీకాంత్ శ్రీనివాసరావు రాంరాజా.. ఇది ఆయన అసలు పేరు.. తండ్రి మరాఠి, తల్లి కన్నడిగ.. కానీ తెలుగే ఆయన భాష, మాట, రాత, శ్వాస అయింది..  నిరంకుశ నిజాం పాలనను నిరసించాడు. అరాచక పాలనపై అక్షరాయుధాలతో పోరాటం చేశాడు.. సత్యాగ్రహం చేసి జైలుకు వెళ్లాడు. ఆర్యసమాజం, ఆంధ్రమహాసభ, స్టేట్ కాంగ్రెస్, కమ్యూనిస్టులు, విశాలాంధ్ర ఉద్యమం, తెలంగాణ రాష్ట్ర ఉద్యమం, అత్యవసర పరిస్థితికి వ్యతిరేకంగా పోరు, పౌర హక్కులు, గ్రంధాలయ ఉద్యమం.. ఇలా అన్నింటా తానై పని చేశాడు. అన్ని సిద్దాంతాలను సమానంగా ఆదరించాడు. జనం ఆవేదనే ఆయన గోడు అయింది.. ప్రజాస్వామ్యవాది, వ్యక్తి స్వేచ్ఛను గట్టిగా బలపరిచాడు.. అన్నింటికీ మించి గొప్ప మానవతా వాది.. ఆయనే కాళోజీ నారాయణ రావు.
‘ పుట్టుక నీది.. చావు నీది.. బతుకంతా దేశానిది..’ అంటూ లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ రావు దివంగతులైనప్పుడు కాళోజీ నివాళి అర్పించారు.. ఈ పదాలు ఆయన జీవితానికీ చక్కగా వర్తిస్తాయి..
కాళోజీ కవిగా ఎక్కువ ప్రసిద్ధి పొందారు.. తెలుగు భాష అంటే ఆయనకు ప్రాణం. మాతృ భాషను అవమానిస్తే అసలు సహించేవారు కాదు..
తెలుగు బిడ్డవురోరి తెలుగు మాట్లాడుటకు-సంకోచ పడియెదవు సంగతేమిటిరా?..అని నిలదీశారు అంతే కాదు..
ఏ భాష నీది ఏమి వేషమురా, ఈ భాష ఈ వేషమెవరి కోసమురా, ఆంగ్లమందున మాటలనగానే ఇంత కుల్కెదవెందుకురా, తెలుగువాడివై తెలుగు రాదనుచు సిగ్గులేక ఇంక చెప్పుటెందుకురా, అన్య భాషలు నేర్చి ఆంధ్రమ్ము రాదంచు, సకిలించు ఆంధ్రుడా చావవెందుకురా..’ అంటూ ఈసడించారు కాళోజీ.
తెలుగులో అన్ని మాండలికాలను సమానంగా ఆదరించాలని కోరేవారు.. ఒక ప్రాంతానిదే తెలుగు భాషగా చలామణి కావడాన్ని సహించలేకపోయారు. రెండున్నర జిల్లాల భాష తెలుగు భాష ఎట్టయితదని ప్రశ్నించారు..
తెలంగాణ యాస భాషలను గేలి చేసిన తోటి తెలుగువారిని అసలు సహించలేకపోయారు కాళోజీ..
‘’ తెలంగాణ యాస నెపుడు యీసడించు భాషీయులసుహృద్భావనఎంతని వర్ణించుట సిగ్గుచేటు..’ కవిత ద్వారా ఎండగట్టారాయన..
ఎవని వాడుక భాష వాడు రాయాలె. ఇట్ల రాస్తే అవతలోనికి తెలుస్తదా అని ముందర్నే మనమనుకునుడు, మనను మనం తక్కువ చేసుకున్నట్లె. ఈ బానిస భావన పోవాలె. నే నెన్నో సార్లు చెప్పిన. భాష రెండు తీర్లు - ఒకటి బడి పలుకుల భాష, రెండోది పలుకు బడుల భాష. పలుకు బడుల భాషగావాలె..’ అని స్పష్టంగా చెప్పారు కాళన్న..

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాళోజీ నారాయణ రావు జయంతిని తెలంగాణ భాషా దినోత్సవంగా ప్రకటించింది.. ఈ సందర్భంగా ఆ మహావ్యక్తిని స్మరించుకుందాం..

1 comment:

  1. హాంకాంగ్ లో పారిశ్రామిక వేత్తలతో కేసీఆర్ భేటీ more Telangana news

    ReplyDelete